నరేంద్రమోడీ అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు.. ఈ దేశానికి ప్రధాని!
ఒక ప్రధాని అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు.. ఒక దేశపు యావజ్జాతి ఆత్మగౌరవానికి ప్రతీక. భారతజాతి సమగ్రతకు చిహ్నం. భారత యశోవైభవానికి ఆయన ఒక రుజువు!
అలాంటి ప్రధానమంత్రి నరేంద్రమోడీని.. ప్రమాదం వాకిట నిస్సహాయంగా నిలబెట్టడం అంటే.. దేశ సమగ్రతని పరిహాసం చేయడం. నవ్వులపాలు చేయడం. ప్రత్యర్థి దేశాల ఎదుట చులకన చేయడం. ప్రధానికి అపకారం తలపెట్టదలచుకునే, తద్వారా విరాట్ భారత సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడానికి తెగించే అతివాద మూకలకు ఆశ కల్పించడం.
రాజకీయ సంకుచిత ఆలోచనా పరులైన పంజాబ్ పాలకులు చేసిన పని.. వారి చేతగాని తనానికి నిదర్శనమే కావొచ్చు. లేదా.. ఇవాళ యావత్ దేశం అనుమానిస్తున్నట్టుగా.. ప్రధాని భద్రతను గేలిచేయదలచుకున్న, ఆయనకు హాని తలపెట్టాలనుకున్న కుట్ర కావచ్చు. కానీ.. ఇలాంటి వైఫల్యం యొక్క విపరిణామాలు పైన పేర్కొన్నంత బహుముఖంగా ఉంటాయి.
అందుకే ఇవాళ యావత్ భారత జాతి.. మన ప్రియమైన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మద్దతుగా నిలుస్తోంది. ఏ ప్రధానిని రోడ్డు మీద నిలబెట్టడం ద్వారా.. ముష్కర కాంగ్రెస్ పాలకులు పైశాచిక ఆనందం పొందారో.., అదే మోదీకి మద్దతుగా, అనల్పమైన ఆత్మబలంగా మేమంతా ఉన్నాం అని నిరూపిస్తూ.. ఇవాళ వందకోట్ల భారతజాతి ఆయన వెన్నంటి నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఊరూరా వాడవాడలా.. ప్రజలు ప్రియతమ నేత నరేంద్రమోడీ క్షేమాన్ని కాంక్షిస్తున్నారు. ఆయన కోసం మృత్యుంజయహోమాలు నిర్వహిస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేకపూజలు జరుగుతున్నాయి. భవిష్యద్దార్శనికుడు అయిన మోడీ వంటి నాయకుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో పూర్ణాయుష్కుడుగా వర్ధిల్లాలని జాతి కోరుకుంటోంది.
పంజాబ్ లో ఏం జరిగింది..
ఒక ప్రధాని ప్రాణాలకు అపాయస్థితి వాటిల్లడం అనేదే అనూహ్యం. అవమానకరం. ఆ పరిణామాన్ని అది యావత్ జాతి అసహ్యించుకుంటోంది. ఈసడించుకుంటోంది.
కానీ నిత్యం జనం మనిషిగానే బతికే నరేంద్రమోడీ.. ఎన్నడూ తన ప్రాణాలకు విలువ ఇచ్చే తరహా కాదు. తాను భరతమాత బిడ్డని.. భారత జాతి తనను ప్రేమిస్తుంది తప్ప.. మరొకటి జరగదు అనేది ఆయన విశ్వాసం. అదే ఆయన వ్యక్తిత్వం. అందుకే పంజాబ్ లో అధికారిక కార్యక్రమాలకు ఆయన సిద్ధమయ్యారు. ఇందిరను కడతేర్చిన దుర్మార్గపు భావజాలానికి అడ్డానే అయినప్పటికీ.. రైతు ఉన్నతిని కాంక్షిస్తూ సుదీర్ఘ కసరత్తు తర్వాత తీసుకువచ్చిన చట్టాలను.. అపరిపక్వ ఆలోచనలతో, అసమంజస వాదనలతో అడ్డుకుని.. సాక్షాత్తూ ఎర్రకోట వైభవానికే మచ్చతెచ్చే అల్లర్లతో పెట్రేగిన అదే ఆగంతకుల అడ్డానే అనే స్పష్టత కూడా ప్రధానికి ఉంది.
అయితే.. ఒక ప్రాంతం, అక్కడి ప్రజ విషాలోచనలతో నిండి ఉన్నప్పుడు.. విస్మరించి వదిలిపెట్టేయడానికి ఆయన వ్యాపారి కాదు. స్వార్థపరుడు కాదు. యావత్ దేశమూ.. తన కార్యక్షేత్రం అని నమ్మే రాజకీయవేత్త. అందుకే పంజాబ్ లో కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. అక్కడి అతివాదులు.. మోడీ ర్యాలీకి పిలుపుఇచ్చే ఫ్లెక్సిలను కూడా చించివేస్తున్నా సరే.. ఆయన ఆ కార్యక్రమానికి వెళ్లారు. బఠిండా విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో వెళ్లవలసి ఉన్న నరేంద్రమోడీ.. వాతావరణం అనుకూలించని నేపథ్యంలో రోడ్డు మార్గంలో వెళ్లడానికి సిద్ధపడ్డారు. రాష్ట్రప్రభుత్వానికి డీజీపీకి సమాచారం ఇచ్చారు. ఎయిర్ పోర్ట్ లోనే కాసేపు ఆగిఉన్నారు. ఈలోగా డీజీపీ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లడానికి ‘క్లియరెన్స్’ వచ్చింది.
ఒక ప్రధాని ప్రయాణించే రోడ్డు మార్గానికి సంబంధించి.. రాష్ట్ర డీజీపీ నుంచి వచ్చిన ‘క్లియరెన్స్’ అనగా ఏమిటి? ‘‘ఆ మార్గం మొత్తం పోలీసు బందోబస్తు పూర్తిచేసి.. ప్రతిచోటా పోలీసు ఎస్కార్టును నిలిపిఉంచి.. ఆయనను ఎలాంటి అంతరాయం లేకుండా క్షేమంగా గమ్యానికి చేర్చే ఏర్పాటు’’ అని పసిపిల్లలైనా చెప్పగలరు. ప్రధాని వెంట ఉన్న ఎస్పీజీ ప్రత్యేక భద్రత దళాలు కూడా అలాగే అనుకున్నాయి. రోడ్డు మార్గంలో బయల్దేరాయి. కాసేపు ప్రయాణించే సరికే వారికి చేదు సమాచారం తెలిసింది.
రోడ్డు మార్గాన్ని స్తంభింపజేసి ఘెరావ్ చేస్తున్నారని! ట్రాక్టర్లు తెచ్చిన ప్రతి ఒక్కరూ రైతులే అయి ఉండాలనే నియమం లేదు. ఎవరు రైతులో, ఎవరు తుంటరులో, ఎవరు ఉగ్రవాదులో.. ఎవరు అచ్చంగా ప్రధానికి అపాయం తలపెట్టే కుట్రప్రణాళికతో అక్కడ ఆ సమూహంలో పొంచి ఉన్నారో తెలియదు. అలాంటి సమయంలో ‘ఛాన్స్’ తీసుకోవడం మంచిది కాదు. ప్రధాని కాన్వాయ్ ఆగింది.
దేశ ప్రజల హృదయాలలో కొలువుండే నరేంద్రమోడీ వ్యవహారసరళి అది కాదు. ఎక్కడ జనసమూహం ఉన్నా సరే.. తాను స్వయంగా వారి వద్దకు వెళ్లి వారిలో కలిసిపోయి.. కరచాలనాలు కూడా చేస్తూ మాట్లాడేదే ఆయన పద్ధతి. మరో సందర్భంలో ఇలాంటి నిరసనలను ఆయన వ్యక్తిగతంగానే సంబాళించి ఉండేవారేమో తెలియదు. కానీ.. ఇక్కడ ఉన్నది నిరసనకారులో, ఆ ముసుగులో నరహంతకులో ఎవ్వరికీ తెలియదు. దాంతో మోడీ ఆగిన వాహనంలోనే ఉండిపోయారు.
కాన్వాయ్ ఎక్కడ ఆగింది..
బఠిండా ఎయిర్ పోర్ట్ నుంచి హుస్సేనీ వాలాలోని జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లి భగత్ సింగ్ ప్రభృతులకు నివాళి అర్పించి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం మోడీ షెడ్యూలు. ఆ హుసేనీవాలా సమీపంలోని ఒక ఫ్లైఓవర్ మీదకు కాన్వాయ్ వెళ్లిన తర్వాత.. ఆపేశారు. ఆ హుసేనీవాలా ఎక్కడ ఉన్నదో తెలుసా..?
భారత దేశంలో అస్థిరత సృష్టించడానికి, భారత్ లో అశాంతిని వ్యాపింపజేయడానికి, అణువంత అవకాశం దొరికినా చేజార్చుకోరాదని అహరహం పొంచి ఉండే పాకిస్తాన్కు అత్యంత సమీపంలో. ఇంకా గట్టిగా, అతిశయంగా చెప్పాలంటే.. పాకిస్తాన్ సరిహద్దు నుంచి.. కూతవేటు దూరంలోనే హుసేనీవాలా ఉంటుంది. పాకిస్తాన్ ముష్కర మూకలు డ్రోన్ ల ద్వారా ఆయుధాల చేరవేత లాంటి అనేకానేక ఆధునిక సాంకేతిక మార్గాల్లో తమ ఉగ్రవాదాన్ని నవీకరించుకుంటున్న నేపథ్యంలో.. పాక్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఒక ఫ్లైఓవర్ మీద.. స్తంభించిపోయిన వాహనాల్లో సుమారు అరగంటసేపు దేశ ప్రధాని ఉండవలసి రావడం అంటే దానిని ఎలా అర్థం చేసుకోవాలి? ఎంత ప్రమాదకరం అది? ఎంత అవమానకరం అది? దీనికి బాధ్యత ఎవరిది?
ఖచ్చితంగా.. పంజాబ్ లో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సిందే.
అసలక్కడ ప్రభుత్వం ఉందా..?
దేశప్రధాని తమ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉంటే.. రోడ్డు మార్గంలో భద్రత కల్పించడం చేతకాని ప్రభుత్వమూ.. ఒక ప్రభుత్వమేనా? ‘ప్రధాని కాన్వాయ్ ఆగిపోవడంలో భద్రతా వైఫల్యం ఏమాత్రం లేదని, ప్రధాని ప్రాణాలకు అపాయం వాటిల్లలేదని’ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ చన్ని ప్రకటించారు. నిజానికి అక్కడ లేకుండాపోయినది భద్రత వైఫల్యం గానీ, ప్రాణాపాయం గానీ కాదు. అసలా పంజాబ్ లో ప్రభుత్వమే లేదు! పరిపాలనే లేదు! అరాచకత్వమే రాజ్యమేలుతోంది! దానికి నిదర్శనమే ఈ దుర్ఘటన.. అంతకంటె పెద్ద నిదర్శనమే అక్కడి కాంగ్రెస్ పాలకుల చేతకాని మాటలు!
ఎలా జరిగిందంటే..
బఠిండా ఎయిర్ పోర్ట్ నుంచి మోడీ రోడ్డు మార్గంలో ప్రయాణించడం అనేది అప్పటికప్పుడు నిర్ణయించబడిన వ్యవహారం. ఆందోళనకు దిగిన ఉగ్రవాద మూకలు.. ప్లాన్ చేసుకోవడానికి ముందుగా నిర్ణయమైన కార్యక్రమం కాదు అది. బఠిండా నుంచి మోడీ హెలికాప్టర్ లో కాకుండా, కారులో వెళ్తారని రాష్ట్రప్రభుత్వానికి, డీజీపీకి, భద్రత ఏర్పాటు చేయాల్సిన పోలీసులకు మాత్రమే తెలుసు. కానీ.. అంతమంది ఆందోళనకు ఎలా గుమికూడారు?
పోలీసులు, ప్రభుత్వం నుంచే ఆ రోడ్డుకు సమీపంలో ఉండే గ్రామాల్లోని ఖలిస్తాన్ ఉగ్రవాదులకు సమాచారం వెళ్లింది. ఒక ప్రధానిని గతంలో పొట్టన పెట్టుకున్న ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదం ఈసారి మరో స్కెచ్ వేసింది. మోడీని నిలువరించి.. తీవ్రమైన ఆందోళనలకు దిగితే.. ఉద్రిక్తపరిస్థితులను కల్పిస్తే.. లాఠీచార్జి, ఫైరింగ్ వరకు జరగాలనేది వారి కోరిక. అలా జరిగితే.. ఖలిస్తాన్ ఉగ్రవాదం మరోసారి పెట్రేగుతుందని.. మోడీ వ్యతిరేక ప్రచారంతో దేశం మొత్తం అట్టుడుకుతుందని కాంగ్రెస్ కోరుకుంది. ఈ మిషమీద ఉగ్రవాద జ్వాలలను దేశమంతా వ్యాపింపజేయాలనుకుంది. కానీ మోడీ సంయమనంతో అది తప్పింది.
పోలీసులు ఏం చేస్తున్నారు..
కాంగ్రెస్ ప్రభుత్వమే స్వయంగా మోడీ ని టార్గెట్ చేసిందా లేదా ఆ సమయంలో అక్కడ అవాంఛనీయ ఉద్రిక్త పరిస్థితులకు ప్రణాళిక రచించిందా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ పుడుతున్నాయి. ఇవి చాలా సహేతుకమైన అనుమానాలు. ఎందుకంటే.. దేశానికి అత్యున్నత ప్రజా నాయకుడు అయిన ఒక ప్రధాని కాన్వాయ్ రోడ్డు మీద ఆగిపోయి ఉంటే.. ఆందోళన కారులు గుమికూడినచోట- వారిని తక్షణం చెదరగొట్టవలసిన పోలీసులు.. వారితో కలసి ముచ్చట్లు చెప్పుకుంటూ చాయ్ తాగుతూ గడపడం హేయం. ఎట్టిపరిస్థితుల్లోనూ నిమిషాల్లో వారిని రోడ్డు మీదనుంచి ఖాళీ చేయించాల్సిన పోలీసులే.. వారితో మంతనాలు చర్చల పేరిట సాగించిన కాలయాపన చాలా చాలా సందేహాస్పదం.
మోడీ ఉన్న వాహనం ఒకే నిర్దిష్టమైన బహిరంగ ప్రదేశంలో స్తంభించిపోయిన తర్వాత కూడా.. పోలీసులు మంతనాల పేరుతో సమయం సాగదీస్తూ ఉన్నారంటే దాని అర్థం.. ఈలోగా మోడీ ఉన్న చోటకు ఖలిస్తాన్ ఉగ్రవాదులు చేరుకుని దాడికి ప్లాన్ చేసే వ్యవధి ఇవ్వడం కోసమే. ఉగ్రవాదులు మోడీని చేరుకునే వెసులుబాటు కోసమే.. పోలీసులు చర్చల పేరుతో.. జాగు చేస్తూ వచ్చారు.
ప్రధాని నరేంద్రమోడీ.. ఆ కుట్రను గుర్తించారు. అందుకే వెనుతిరిగి బఠిండా ఎయిర్ పోర్ట్కు వచ్చేశారు. ‘ప్రాణాలతో తిరిగి రాగలిగాను. మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు’ అని అక్కడి అధికారులతో అన్నటువంటి అంత పెద్ద వ్యాఖ్య ఈ దేశ ప్రధాని నోటినుంచి వచ్చిందంటే.. అక్కడి కాంగ్రెస్ సర్కారు సిగ్గుపడాలి.
కాంగ్రెస్ నిస్సిగ్గు మాటలు..
మోడీకి భద్రత వైఫల్యం ఏమీ లేదని, ఆయన తలపెట్టిన ర్యాలీకి జనం ఎవరూ రానందువల్లనే ఆయన వెనుతిరిగారని.. కాంగ్రెస్ నిస్సిగ్గుగా ప్రకటన చేసింది. నిజానికి ర్యాలీకోసం తరలివెళుతున్న వందల వాహనాలను పోలీసులు ఎక్కడివక్కడ ఆపేసి జనాన్ని వెళ్లనివ్వకుండా చేశారు. ఈ దుర్మార్గాలన్నీ మోడీ వెనుతిరిగి వెళ్లేలా చేసిన అరాచకత్వానికి అదనం!
మోడీ మంచితనం, ఔదార్యం
ఫ్లైఓవర్ మీద ఆగిన మోడీ కాన్వాయ్ కు 150 మీటర్ల దూరంలోనికి ఆందోళనకారులు చొచ్చుకువచ్చినప్పుడు.. మోడీ వెంట ఉన్న ఎస్పీజీ దళాలు.. ‘యాక్షన్’కు సిద్ధమయ్యాయి. ఫైరింగ్ ఓపెన్ చేయడానికి మోడీ అనుమతి అడిగాయి. కన్నుకు కన్ను సమాధానం అనే రాక్షసనీతిని నమ్మే వ్యక్తి కాదు మోడీ. అందుకే.. వారి మీద ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా.. దురుద్దేశంతో ఉన్న ఉగ్రవాదులతో పాటు, కొందరైనా అమాయకులు కూడా ఇబ్బంది పడతారని ఆయన గ్రహించారు. ఎలాంటి ఉద్రిక్తతకు అవకాశం ఇవ్వకుండా తానే వెనుతిరిగి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు.
నడిరోడ్డుమీద నరమేధం సృష్టించడానికి స్కెచ్ వేసిన కాంగ్రెస్ భంగపడింది. ఆ స్థలం నుంచి నరేంద్రమోడీ వెనుతిరిగి ఉండవచ్చు. కానీ.. ఆయన సాధించినది నైతికమైన ప్రజావిజయం. అందుకే యావజ్జాతి ఇవాళ ఆయన క్షేమం కోసం పరితపిస్తోంది. పూజాదికాలు నిర్వహిస్తోంది.
నరేంద్రమోడీ.. యావత్ భారతజాతికి ప్రియతమ నాయకుడు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఈ దేశాన్ని మరిన్ని సమున్నత ప్రగతి శిఖరాల మీదికి తీసుకువెళ్లాలని జాతి కోరుకుంటోంది.
..చంద్రప్ప
ఉపాధ్యక్షుడు, తిరుపతి పార్లమెంటు జిల్లా,
కిసాన్ మోర్చా జిల్లా ఇన్చార్జి

.