సినిమావాళ్ళకు వెన్నెముక ఉండదు అని నిరూపించాలన్నది వైసీపీ ప్రభుత్వం ఎత్తుగడ. ఆ విషయంలో జగన్ అండ్ కో నూటికి నూరు శాతం సక్సెస్ అయింది. సినిమా పరిశ్రమను కుదేలు చేసేలా ఉన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు.. సినీ జనాలను చులకన చేసే వ్యాఖ్యలు వైసీపీ వాళ్ళు చేస్తూ వచ్చారు. రంగుల లోకం మౌనం దాల్చడంతో వైసీపీ నేతలు మరింత గొంతు పెంచారు.
ఇప్పుడిప్పుడే చిత్ర సీమలో ఏపీ ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తోంది. ఆ తరుణంలోనే వైసీపీ తమకు ట్రంప్ కార్డుగా ఉన్న చిరంజీవిని మరోసారి తెర మీదకు తెచ్చింది. సినిమా వాళ్ళు మా వెంట ఉన్నారు అని చెప్పుకోవాల్సిన ప్రతి సందర్భంలో జగన్ టీం జాగ్రత్తగా చిరును వాడుతోంది.
మూడు రాజధానుల నుంచి నేటి సినిమా వివాదం వరకూ ప్రతి సందర్భంలో చిరంజీవి వైసీపీ ప్రభుత్వ వ్యూహానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమ వ్యాపారంలో 60శాతం వాటా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచే వస్తుంది. అందుకే ఆ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టింది జగన్ ప్రభుత్వం. సినిమా టికెట్ విధానాన్ని ఆన్లైన్ చేసి.. ఆ పోర్టల్ను ప్రభుత్వం గుప్పిట పెట్టుకొనేలా చట్ట సవరణ చేయడం, టికెట్ రేట్లు గణనీయంగా తగ్గించడం, సినిమా హాళ్లపై దాడులు.. ఈ పరిణామాలు టాలీవుడ్ ను కుదిపేస్తున్నాయి.
ఈ ధోరణి గురించి చిరు తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ నెలలోనే గళం విప్పి వైసీపీ ప్రభుత్వంపై మాటల దాడి చేశారు. అందులో తన అన్నగారికీ చురకలు వేశారు. మోహన్ బాబు కూడా మాట్లాడాలి అని చెప్పారు. భయం వదలండి అనడంతోపాటు ఇప్పుడు మౌనంగా ఉంటే మరింతగా ఈ సమస్య ముదురుతుంది అన్నారు. ఈ విమర్శల జడిపై వైసీపీ కూడా అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది. ఈ సమస్య తీవ్రత తెలిసి కూడా సినీ పరిశ్రమ పవన్ వెంట నిలవకుండా ఏపీ ప్రభుత్వానికి దన్నుగా నిలిచింది. ఇప్పుడు మాత్రం మల్లగుల్లాలుపడుతుంది.
ఈ పరిస్థితుల్లో చిరంజీవి కూడా కొద్ది రోజుల కిందట నేను పరిశ్రమకు పెద్దగా ఉండబోవడం లేదు.. ఏదైనా సమస్య వస్తే స్పందిస్తాను అన్నారు. అదే రోజు మోహన్ బాబు స్పందిస్తూ అందరితోనూ నేను మాట్లాడతాను అని స్వీయ పెద్దరికం ప్రకటించుకొన్నారు.
ఒక నారాయణమూర్తి… ఒక వర్మ
వైసీపీ ప్రభుత్వం కూడా టాలీవుడ్తో ఒక ఆట ఆడుతోంది. సినిమా టికెట్స్ ధరలు, సినిమా హాళ్లపై దాడుల క్రమంలో ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా హాళ్ళు మూసేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్.నారాయణమూర్తి కొందరు ఎగ్జిబిటర్లను వెంటేసుకొని రాష్ట్ర మంత్రి పేర్ని నానితో సమావేశమై సమస్యను పరిష్కరించాలి అన్నారు. ఆయన వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి సినిమా హాల్స్ తెరుచుకొనేలా చూస్తామన్నారు. మరో వైపు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వంపై ట్వీట్ దాడి చేస్తే.. ఇద్దరం చర్చించుకొందాం అని పేర్ని నాని అనడం.. పర్యవసానంగా ఇద్దరూ కలిసి సచివాలయంలో మాట్లాడుకోవడం జరిగింది. ఆ తరవాత రొయ్యల పలావుతో విందు చేసుకున్నారు.
అలాగే న్యాయస్థానం ఆదేశాలతో ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా వైసీపీ పాటే పాడింది. ఇదంతా ఒక స్కెచ్ ప్రకారమే నడుస్తోంది అనేది టాలీవుడ్ కి అర్థం అవుతూనే ఉంది. ఈ సమస్యకు పరిష్కారం మాకు నారాయణ మూర్తి, వర్మతో చర్చల ద్వారా దొరికింది.. వాళ్ళే పెద్దలు అని చెప్పే గేమ్కి తెర తీశారు. అలాగే సినీ రంగంలో మెగా కాంపౌండ్, దగ్గుబాటి కుటుంబం, నందమూరి వారసులు.. ఇవన్నీ పేరు గొప్పే- నారాయణ మూర్తి, వర్మలే పరిశ్రమకు దిక్కు. లేదంటే, మోహన్ బాబు ఉంటారు అని చూపాలన్నది వైసీపీ వ్యూహం.
ఈలోగా వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన ‘బలుపు’ కామెంట్స్, అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి చేసిన ‘కులం’ వ్యాఖ్యలు సినీ రంగంలో వేడి పుట్టించాయి. తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.వి.ప్రసాద్, వి.ఎన్.ఆదిత్య చేసిన కామెంట్స్ టాలీవుడ్ కోపాన్ని తెలిపాయి. వైసీపీపై వ్యతిరేక గళాలు పెరిగితే తమ వ్యూహం బెడిసికొడుతుంది అనే లెక్కలోకి వచ్చింది.
వెంటనే తమ ట్రంప్ కార్డును తెర మీదకు తెచ్చింది. నేను ఇండస్ట్రీ పెద్దను కాదు అని పక్కకు తప్పుకొన్న చిరంజీవిని మరోసారి రంగంలోకి తెచ్చాయి. ఆయన్ని ప్రభుత్వమే ఆహ్వానించింది. తాడేపల్లిలో సి.ఎమ్. నివాసంలో లంచ్ మీటింగ్ ద్వారా పరిశ్రమ సమస్యలపై చర్చిస్తున్నారు.
లంచ్ మీట్ వెనక ఎవరున్నారు?
జగన్ – చిరంజీవిల లంచ్ మీట్ వెనక ఎవరున్నారు అనే చర్చ ఉంది. దీని వెనక ఓ రాష్ట్ర మంత్రి ఉన్నారు అని అంతా భావించారు. అయితే ఈ భేటీ వెనక దిల్ రాజు, నాగార్జున తదితరులు ఉన్నారు అనే మాట ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. దిల్ రాజుకు సన్నిహితుడయిన ఒక లాయర్ ఉన్నారు అనే ప్రచారం ఉంది. ఈ లాయర్ వైసీపీ ముఖ్యులకు అత్యంత సన్నిహితంగా ఉంటారు.

ఆయన ప్రమేయం ఉన్న సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది. అలాగే నాగార్జున నటించిన బంగార్రాజు కూడా సంక్రాంతికి వస్తోంది. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిత్రానికి రాష్ట్ర మంత్రి కన్నబాబు తమ్ముడు కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. ఇన్ని ఈక్వేషన్ల నడుమ జగన్ – చిరు భేటీ మొదలైంది.
సినిమా లెక్కలే కాకుండా రాజకీయం కోణంలోనూ ఈ భేటీని చూడాల్సిన పరిస్థితి ఉంది. చిరు ఎప్పుడూ వైసీపీకి దగ్గరే అనే లెక్కలు చూపే పనిలో ఉన్నారు. ఈ మధ్యనే చంద్రబాబు మాట్లాడుతూ చిరంజీవి ఇప్పటికీ తనతో సన్నిహితంగానే ఉన్నారు అని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా టిడిపితో దగ్గరగా ఉంటారు అనీ, పవన్ కళ్యాణ్ 2024లో కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తారు అనే ప్రచారం జోరుగా ఉంది. వీటిని కట్టడి చేసి వైసీపీకి చిరంజీవి హితులు అనే మాట బయటకు పంపే ఉద్దేశం కూడా ఈ లంచ్ మీటింగ్ వెనక ఉన్న ఒక లెక్క.
చిరంజీవి కూడా పిలిచి పెద్దరికం ఇచ్చారనే లెక్కలతోనే ముందుకు వెళ్లారు. అయితే వైసీపీ లెక్కల్లో పెద్ద లేదు, గద్ద లేదు. తమ అవసరాలకు తగ్గట్టుగా ముక్కలు బోర్డు మీద కొట్టడమే. ముందుగా నారాయణ మూర్తి, వర్మ అనే ముక్కలు వేశారు. రిజల్ట్ తేడాగా వచ్చేలా ఉండటంతో తమ ట్రంప్ కార్డు చిరును వాడారు. చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, మోహన్ బాబు కావచ్చు వీళ్ళకు పెద్దరికం అవసరం లేదు. వాళ్ళకు కావాల్సింది ప్రభుత్వ ప్రాపకమే. తద్వారా ఏదైనా ఒక లబ్ధి మాత్రమే అనేది బహిరంగ రహస్యం. వైసీపీ వాళ్ళకు కూడా కావాల్సింది సినీ రంగంలో అనైక్యత. ఒకే విధమైన గళం బయటకు వినిపించగానే తాము అనుకొన్న పెద్దలను రంగంలోకి దింపి ఆడుకోవడమే! ఆ విషయంలో జగన్ అండ్ టీం సక్సెస్ అవుతూనే ఉంది. దెబ్బ తింటున్నది టాలీవుడ్ మాత్రమే.
– వీణాపాణి
.

Discussion about this post