“బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్. ఆ ఎరుకే నిశ్చలానందమోయ్, బ్రహ్మానందమోయ్” అని సీనియర్ సముద్రాల ఏ ఉద్దేశంతో చెప్పాడో తెలియదుగాని, ఆ వాక్యాలు మాత్రం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని అనిపిస్తోంది.
ఉరుకుల, పరుగుల ప్రపంచంలో మనిషి తన ఉనికిని ఎప్పుడో కోల్పోయాడు. నిరంతరం ఏదో కావాలనే తపన. ఏదో పొందాలనే ఆరాటం. ఉన్నపళంగా కోటీశ్వరుడై పోవాలనే అత్యాశ. వావివరసలు మరచి పరస్త్రీలను చెరపట్టాలనే దర్మార్గపు ఆలోచనలు తదితర కారణాలతో మనిషి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు.
ఆ కారణంగా సమాజంలో ఆస్తి గొడవలు, అక్రమ సంబంధాలు, హత్యలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు, భూకబ్జాలు, దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. దాంతో మనుషుల్లో భయం చొరబడి అశాంతి చోటుచేసుకుంది.
ఎప్పుడైతే మనిషిలో అశాంతి చోటుచేసుకుంటుందో అప్పుడు వివేకాన్ని, విచక్షణను కోల్పోయి ఏ పనీ సరిగా చేయలేడు. అంతేకాదు సాటి మనుషులతో కూడా సఖ్యంగా మెలగలేడు. అందుకే నేటి కుటుంబాలలో మనుషుల మధ్య బంధాలు బలహీనపడుతున్నాయి. బంధాలు బలహీనపడితే కుటుంబం పురోగతి సాధించలేదు.
దీనికంతటికీ కారణం అత్యాశ. అందుకే అత్యాశను విడనాడి రెండు ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలి.
1. మిత ఆహారం.
2 మిత వ్యవహారం.
మిత ఆహారం అంటే దొరికిన దాంతోనే సంతృప్తిపడి, ఇష్టంగా తినడం. తినడానికి కూడు, ఉండడానికి గూడు, వేసుకోవడానికి గుడ్డ. నిజానికి ఈ మూడే మనిషికి కావాల్సింది. దానికి మించి కోరుకోవడం మహాపాపమే అవుతుందని నా ఉద్దేశం.
మిత వ్యవహారం అంటే సాధ్యమయినంతవరకు తక్కువ మందితో స్నేహం చేయడమే మంచిది. ఎందుకంటే లోకంలో భిన్న మనస్తత్వాల మనుషులు ఉంటారు. వాళ్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. పైగా ఎక్కువమందితో స్నేహం చేస్తే వాళ్ల బాధలన్నీ వినాలి. అవన్నీ మన మనసును ప్రభావితం చేస్తాయి. అందుకే మిత వ్యవహారాన్ని పాటించాలి.
పై అంశాలనుబట్టి మనకు అర్థమయిన విషయం ఏంటంటే ప్రతి మనిషి ఏదోక బాధతో బాధపడుతున్నాడనేది సుస్పష్టం. ఈ బాధలనేవి వస్తూంటాయి. పోతుంటాయి. ఒక్కొక్కసారి సమస్య కంటే దాని గురించి ఆలోచనే మనల్ని ఎక్కువ క్షోభకు గురిచేస్తుంది. అందుకే వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. అసలు బాధలనేవి వచ్చేవి మనల్ని బలపరచడానికేగాని, బలహీనపరచాటానికి కాదు.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ‘దాన్ని ఎలా ఎదుర్కొని పరిష్కరించుకోవాలి’ అని ఆలోచించాలిగాని, దాని గురించే బాధపడుతూ కూర్చోకూడదు. అలా బాధపడితే మరింత సమస్యపఅల్లోకి కూరుకుపోతాం.
మనం నివసించే భూమి నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ అదే సమయంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ‘రోజూ నేనుఎందుకు తిరగాలి?’ అని బాధపడి తిరగకుండా కూర్చుంటే ఏమవుతుంది? అలా ఉండడం సాధ్యమేనా? ఖచ్చితంగా కాదు. అలా తిరగడం దాని విధి. అందుకే భూమి నిరంతరం తిరుగుతూ ఉంటుంది.
బతుకు జీవన గమనంలో మనకు వచ్చే బాధలు కూడా మనల్ని బాధ్యత గల వ్యక్తులుగా మార్చడానికి, మరింత సుఖమయ జీవనం గడపటానికే వస్తాయని మనం అర్థంచేసుకోవాలి.
సీనియర్ సముద్రాల చెప్పినట్లు, ‘బాధలే నిజమైన సుఖాలు’ అని భావించి, ఆ ఎరుకతో ఉన్నట్లయితే ఆనందం అనేది ఎప్పుడూ మనతోనే ఉంటుంది.
బతుకు బండి గమనంలో ఎదురయ్యే బాధలు, కష్టాలు, నష్టాలు అనేవి జీవితం సాఫీగా సాగిపోవడానికి ఉపయోగపడే ప్రగతి చక్రాలేగాని ప్రతి బంధకాలు ఏ మాత్రం కావు అనేది అక్షరసత్యం.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159

.