ప్రజల అభిప్రాయం పరిగణనలోకి తీసుకోకుండా… రాష్ట్ర ప్రభుత్వం ఆఘ మేఘాలపై కొత్త జిల్లాలను ప్రకటించడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. భౌగోళిక పరిస్థితులు సక్రమంగా అధ్యయనం చేయకుండానే.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నేతలు ఇలా విభజన చేయించారనే విమర్శ బలంగా వినపడుతోంది.
కొత్త జిల్లాలు.. కొత్త రెవిన్యూ డివిజనుల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం మరోసారి సమీక్షించాలని ప్రజలు డిమాండు చేస్తున్నారు. లేదంటే ఉద్యమం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. మదనపల్లెలో ఇప్పటికే ఉద్యమం తీవ్రతరం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంను ఒక జిల్లాగా చేస్తూ గెజిట్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కు చేరింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా చిత్తూరు జిల్లాను మూడు ముక్కలుగా చేశారు. నగరి, గంగాధరనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా చేశారు. దీనికి జిల్లా కేంద్రం చిత్త్తూరు.
ఇక తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటికి జిల్లా కేంద్రం తిరుపతి. ఇక తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు కలిపి ఒక జిల్లాగా నిర్ణయించారు. వీటికి జిల్లా కేంద్రం రాయచోటి. ఇలా చిత్తూరు జిల్లా మూడు భాగాలుగా విడిపోతోంది.
బ్రిటీషు వారి హయాం నుంచి ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకుండా.. రాయచోటిని ఏర్పాటు చేయడం పట్ల ఆ ప్రాంత వాసులు రగిలి పోతున్నారు. కొత్త జిల్లా అంటూ ఏర్పడితే దానికి మదనపల్లె కేంద్రంగా వుండాలన్న డిమాండ్తో చాలాకాలంగా అక్కడ ఉద్యమం నడుస్తోంది. ఇపుడు ప్రభుత్వం రాయచోటి పాలనా కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటించడంతో మదనపల్లె జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన మొదలైంది.
ఇది క్రమేపీ తంబళ్లపల్లె, పీలేరు నియోజక వర్గాలకూ ప్రబలుతోంది. దానికి తోడు ప్రతిపాదిత కొత్త జిల్లాలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగంలో కూడా చెప్పుకోదగ్గ ఉన్నత విద్యా, వైద్య సంస్థలు లేకపోవడం వెలితిగా మారింది. మదనపల్లెలో పేరుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వున్నా… స్థాయి రీత్యా ఏరియా ఆస్పత్రికి మించి సదుపాయాలేమీ లేవు. ఇక విశ్వ విద్యాలయాలన్నీ తిరుపతిలో వుండడం,. కొత్త జిల్లా వలన వాటిలో తమకు స్థానిక కోటా వుంటుందో వుండదో తెలియక పశ్చిమ ప్రాంతవాసులు ఆందోళనకు గురవుతున్నారు.
అదేవిధంగా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం పుణ్యక్షేత్రాలను గొప్పగా చెప్పుకునే పరిస్థితి నుంచీ ఇపుడు వాటితో సంబంధం లేని స్థితికి చేరడం సెంటిమెంటల్గా ఈ ప్రాంతవాసుల్ని బాధిస్తోంది.
బాలాజీ జిల్లానా.. ఇదేం పేరు?
తిరుపతి కేంద్రంగా ఏర్పాటవుతున్న కొత్త జిల్లాకు బాలాజీ జిల్లాగా పేరు పెట్టడం స్థానికులకు అభ్యంతరకరంగా మారింది. బాలాజీ అన్నది శ్రీవారి పేరే అయినప్పటికీ.. ఉత్తర భారతీయులు మాత్రమే ఆ పేరిట దేవుని పిలిచి కొలుస్తారని.. స్థానికంగా వెంకటేశ్వరస్వామి పేరే బహుళ ప్రచారంలో వుండి జనం దైనందిన జీవితంలో పెనవేసుకుపోయిందని గుర్తు చేస్తున్నారు.
కాబట్టి తిరుపతి కేంద్రంగా ఏర్పడుతున్న కొత్త జిల్లాకు వెంకటేశ్వర జిల్లా లేదా శ్రీవారి జిల్లాగా పేరు మార్చాలన్న డిమాండు బలంగా వినిపిస్తోంది. అలాగే నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపాలని కొందరు డిమాండు చేస్తున్నారు. నగరి నియోజకవర్గం భౌగోళికంగా బాలాజీ జిల్లా సరిహద్దులో ఉందని… తుడా పరిధిలో ఉన్న నగరిని చిత్తూరు జిల్లాలో కలపడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. నగరి నియోజకవర్గ ప్రజలకు నిత్యం తిరుపతి కేంద్రంగా రవాణా, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలున్నాయని వారు అంటున్నారు. నియోజకవర్గం నుంచి తిరుపతి సమీపంలోనే ఉందని… అదే చిత్తూరు సుమారు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉందని వారు చెబుతున్నారు.
కొత్త జిల్లాలతో పాటు ఏర్పాటవుతున్న కొత్త రెవిన్యూ డివిజన్ల విషయంలో చాలా చోట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. మదనపల్లెకు చేరువగా వున్న రొంపిచెర్ల మండలాన్ని ఎక్కడో వున్న పలమనేరు డివిజన్ పరిధిలో చేర్చడంతో ప్రజలకు అసౌకర్యం కలిగించనుంది. అలాగే పీలేరు, కేవీపల్లె మండలాలను రాయచోటి డివిజన్కు చేర్చడం పట్ల ఆ మండలాల్లో అసంతృప్తి రగులుతోంది.
దూరం ఒకటే అయినా.. మదనపల్లె డివిజన్లోనే తమను కొనసాగించాలన్న డిమాండ్ ఆ మండలాల నుంచి వినిపిస్తోంది. ఇక నాయుడుపేట డివిజన్ విషయంలో కూడా తూర్పు మండలాల్లో తీవ్ర అసంతృప్తి ప్రబలుతోంది. నాయుడుపేట జనాభా 50 వేలు కాగా శ్రీకాళహస్తిలో రెట్టింపు జనాభా వుంది. నాయుడుపేటతో పోలిస్తే శ్రీకాళహస్తి చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఘనమైన నేపథ్యముంది. శ్రీకాళహస్తి అర శతాబ్దంగా పురపాలక సంఘంగా ఉంది. ఇక్కడ సుమారు లక్ష జనాభా ఉన్నారు. రెవిన్యూ డివిజనుగా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి.
బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రతిపాదన కూడా పంపారు. అలాంటిది శ్రీకాళహస్తి మండలాన్ని కూడా నాయుడుపేట డివిజన్లో చేర్చడం తూర్పు మండలాలవాసులకు అసంతృప్తి కలిగిస్తోంది. నాయుడుపేట బదులు శ్రీకాళహస్తిని డివిజన్ కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండు ఈ ప్రాంతం నుంచీ బలంగా వినిపిస్తోంది. ఇందుకోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమానికీ సిద్ధమవుతున్నారు.
అలాగే పారిశ్రామికవాడగా ఎదుగుతున్న సత్యవేడు నియోజకవర్గాన్ని తిరుపతి రెవెన్యూ డివిజన్లోనే కొనసాగించాలని చాలా మంది డిమాండు చేస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని రెండుగా చీల్చి సత్యవేడు, వరదయ్యపాలెం, బీఎన్ కండ్రిగ, కేవీబీ పురం మండలాలను నాయుడుపేట డివిజన్లో కలిపి మిగిలిన నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం మండలాలను తిరుపతి డివిజన్లో కొనసాగించడం వల్ల పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఇప్పటి వరకూ 66 మండలాలతో రాష్ట్రంలోని పెద్ద జిల్లాల్లో ఒకటైన చిత్తూరుకు ఇకనుంచీ ఆ ఘనత వుండదు. భవిష్యత్తులో చిత్తూరు జిల్లాలో కేవలం 33 జిల్లాలు మాత్రమే వుంటాయి. అంటే సగం మండలాలను కోల్పోనుంది. మరోవైపు 31 మండలాలు… ఐదు మున్సిపాలిటీలతో దేశంలోనే పెద్ద రెవిన్యూ డివిజన్గా పేరొందిన మదనపల్లె కూడా ఆ ఖ్యాతిని కోల్పోనుంది. మదనపల్లె డివిజన్లో ఇకపై కేవలం 11 మండలాలు మ్తాత్రమే కొనసాగనున్నాయి.
.

Discussion about this post