భారతదేశం గర్వించదగిన ఆర్ధికవేత్త, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ ఛైర్మన్ దువ్వూరి సుబ్బారావు గారు ఈ మధ్యన ‘Has IAS Failed the Nation?’ శీర్షికతో ఒక మంచి వ్యాసం ప్రచురించారు. 1972 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అయన రాసిన వ్యాసం ప్రచురితమైన కొన్ని రోజులకే ఆంధ్రప్రదేశ్ హై కోర్టు, కోర్టు ధిక్కరణ కింద ఏకంగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు గమ్మత్తైన ‘సామాజిక సేవా శిక్ష’ విధించింది. దువ్వూరి వారి వ్యాసానికి, కోర్టు నిర్ణయానికి సంబంధం లేకపోయినా, సివిల్ సర్వీసెస్ అధికారుల మీద చర్చకు ఈ రెండు పరిణామాలూ ఊతమిచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు.. మొత్తంగా ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారుల పనితీరు, సామర్థ్యం, ధోరణి, వ్యవహార శైలి సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. గొప్ప వడపోత ద్వారా ఎంపికై, అత్యుత్తమమైన శిక్షణ పొంది, ప్రజల జీవితాల్లో వెలుగురేఖలు నింపే గొప్ప అధికారం సొంతమైన ది బెస్ట్ బ్రెయిన్స్ అయిన సివిల్ సర్వీసెస్ అధికారులు కొందరు (గోతికాడి నక్కలు) స్వలాభం కోసం రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు.
మరి కొందరు (గోముఖ వ్యాఘ్రాలు) పైకి సత్యసంధుల్లా వ్యవహరిస్తూ ఎవ్వరికీ దొరక్కుండా అందినకాడికి దండుకుని తూతూ మంత్రంగా పనిచేసుకుంటూ పోతుండగా, చాలా కొద్దిమంది (గోవులు) మాత్రం పరిణామాలకు వెరవకుండా దేశ విశాల హితం కోసం రూల్ బుక్ ప్రకారం తృపిగా నడుచుకుంటూ పొలిటికల్ బాసుల కక్షా కార్పణ్యాలకు బలవుతూనే పనిచేస్తున్నారు. దేశ అభివృద్ధి పథకాలు, నిధులు, నిర్ణయాలు చేతుల్లో ఉన్న ఐఏఎస్లలో మొదటి రెండు రకాల వారు పెద్ద సంఖ్యలో ఉండడంతో చాలా నష్టం జరుగుతున్నది. దువ్వూరి సుబ్బారావు గారి వ్యాసం ప్రచురితం కావడానికి చాలా ముందుగానే ‘రామ్ బాణమ్’ లో భాగంగా రాసిన ‘ఐఏఎస్ లా? అయ్యా.. ఎస్..లా?’ అన్న వ్యాసం చదవండి.
దువ్వూరి సుబ్బారావు గారి ప్రకారం- సత్యం వైపు ధైర్యంగా నిలబడలేని వారిగా ఐఏఎస్లు పేరు తెచ్చుకుంటున్నారు, దురదృష్టవశాత్తూ. తాను సర్వీసులో చేరిన కొత్తల్లో.. అంటే 1970ల్లో.. విపక్షం ఏదైనా అంశంపై గొడవ చేస్తుంటే ముఖ్యమంత్రి లేచి దీని మీద ఐ ఏ ఎస్ అధికారిచేత విచారణ చేయిస్తానని చెబితే అంతా కిమ్మనకుండా ఒప్పుకునేవారనీ, ఇప్పుడు పరిస్థితి మారిందని అయన చెప్పారు. ఐఏఎస్ల నైతిక, మేథో దిగజారుడుతనానికి రాజకీయ నాయకులను నిందించడం తగదని అయన అభిప్రాయపడ్డారు.
అయన అభిప్రాయం ప్రకారం- అధికారులే ఎవ్వరికీ వెరవకుండా నియమనిబంధనలకు కట్టుబడి ఉండాలి. ప్రమోషన్స్, పెనాల్టీస్ గురించి ప్రస్తావిస్తూ.. నిర్దిష్ట కాలంలో పదోన్నతి వస్తుందన్న ధీమాతో ఉంటూ సరిగా పనిచేయని వారిని తొలగించుకుంటూ పోకపోతే సమర్థులైన వారికి ప్రోత్సాహం, ఉత్సాహం ఉండదని చెప్పారు. అయితే, రాజకీయ నేతలతో అంటకాగి వృత్తిధర్మాన్ని కాలరాచే వారిని ఎట్లా పసిగట్టాలి? అలాంటి దుష్టులకు ఎలాంటి శిక్షలు విధించాలి? అన్న అంశాలను అయన ఈ వ్యాసంలో పేర్కొనలేదు.
నేను దువ్వూరి గారి కన్నా సీనియర్ అయిన ఒక మాజీ బ్యూరోక్రాట్ను దగ్గరి నుంచి చూశాను. ఎనభైల్లో పడినా అహం ఎంత ఎత్తున ఉంది. ప్రతిభా అంతగా చెప్పుకోదగ్గది కాదు. పొగిడిన వాడు మంచోడు, తన పని తాను చేసుకునేవాడు పనికిరాని వాడు. అణువణువునా కులపిచ్చి, పర కుల ద్వేషం. 30 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేసిన బాబు గారు ఎంత మందికి దర్జాగా అన్యాయం చేసాడో కదా! అని అనిపించేది. అందరూ అలా ఉంటారని కాదు గానీ, ఈ ఐఏఎస్ లలో ఏదో తేడా కొడుతోంది. నమ్రత, ప్రేమ, సామరస్యం, వినయం ఈ జనాల్లో శూన్యం.
ఎన్నిసార్లు చెప్పినా తప్పులు దిద్దుకోని తెంపరి విద్యార్థికి మాస్టారు గోడకుర్చీ వేయిస్తారు. తిట్టి, మొట్టి, కొట్టడం కన్నా ఇది ప్రభావశీలమైన శిక్ష. తప్పుచేసిన వాడికి బుద్ధివచ్చేలా చేస్తూనే, తప్పు చేస్తే మీకూ ఇదే గతర్రా.. అని ఇతర విద్యార్థులకు చెప్పకనే చెప్పే సూపర్ శిక్ష. ఆంధ్రప్రదేశ్లో ఏకంగా ఎనిమిది మంది ఐ.ఏ.ఎస్. (అందులో కన్ఫర్డ్ వారూ ఉన్నారు)లకు కోర్టు ధిక్కరణ నేరం కింద హై కోర్టు విధించిన సామాజిక సేవ శిక్ష అసాధారణమైనది. ఇందులో ఇద్దరు- విజయ్ కుమార్, వాడ్రేవు చిన వీరభద్రుడు- నాకు తెలిసిన వారే. శ్రీలక్ష్మి గారు యావత్ ప్రపంచానికి పరిచితులే. వీరంతా కావాలని కోర్టు ఆదేశాలు పాటించలేదని అంటే నమ్మబుద్ది కాదు. 2020 లో ఇచ్చిన ఆదేశాలు ఏడాది పాటు పట్టించుకోకుండా ఉండే రకాలు కాదు వీరు. ఉన్నత అధికారులకు చెబితే.. ‘ఏమీ కాదు’ అని వారు అని ఉంటారు, లేదా ప్రభుత్వం ప్రతిష్ఠకు పోయి అధికారులను బలిచేసి ఉంటుంది. తప్పు ఎవరిదైనా, పేపర్లో బొమ్మలు మాత్రం వాళ్ళవే వచ్చాయి. దులుపుకుపోతే పర్వాలేదు కానీ, ఇది నలుగురిలో నగుబాటు కదా! నివారించదగిన వ్యవహారం కదా! శిక్ష వద్దని విన్నవించుకుంటే, అట్లయితే ఏడాది పాటు సంక్షేమ హాస్టళ్ళలో నెలకు ఒక రోజు వెళ్లి సేవ చేయాలన్నది కోర్టు ఆదేశం. విద్యార్థుల భోజనం ఖర్చు కూడా భరించాలని చెప్పింది కూడా.
కోర్టు ధిక్కరణ నేరం కింద కిందటేడాది ఏప్రిల్లో దక్షిణ తెలంగాణా లోని ఒక జిల్లా కలెక్టర్కు, విశ్రాంత పౌర సరఫరాల శాఖ అధికారికి ఇలాంటి శిక్షే తెలంగాణ హై కోర్టు విధించింది. అనాథాశ్రమంలో వారానికి రెండు గంటల చొప్పున ఆరు నెల్ల పాటు సేవ చేయాలని చెప్పింది. ఉగాది, శ్రీరామ నవమి రోజుల్లో అనాథాశ్రమంలో భోజనాలు పెట్టాలని ఆ రిటైర్డ్ అధికారిణిని ఆదేశించింది. అంతకుముందు ఒక ఎక్సయిజ్ అధికారికి రంజాన్ మాసంలో వారం పాటు 20 మంది ముస్లిం సోదరులకు ప్రార్థనానంతరం ఆహారం అందించాలని మరొక కేసులో ఆదేశించింది.
29 సంవత్సరాలు పనిచేసి స్వచ్ఛంద పదవీవిరమణ చేసి ‘బ్యూరోక్రసీ’ మీద పుస్తకం (Everything you ever wanted to know about bureaucracy but were afraid to talk) రాసిన మాజీ ఐ ఏ ఎస్ అధికారి టీ ఆర్ రఘునందన్ తమ వృత్తిలో రాజకీయ జోక్యం ఎట్లా ఉంటుంది? దానికి విరుగుడు ఏంటి? అన్న అంశాల గురించి రాశారు. 38 ఏళ్ళు సివిల్ సర్వెంట్గా ఉండి రిటైర్ అయిన అనిల్ స్వరూప్ “Ethical dilemmas of a civil servant” అనే పుస్తకంలో తన అనుభవాలు పంచుకున్నారు. ‘సివిల్ సర్వెంట్లు రాజకీయ నేతలతో లాలూచీ పడితే సమస్య కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. quid pro quo అక్కడే మొదలవుతుంది,” అని అయన చెప్పారు.
బదిలీలకు వెరవకుండా పనిచేస్తే మంచి పేరు తెచ్చుకోవచ్చని ఆయన హితవు పలికారు. “బదిలీ అనేది మరణం లాగా అనివార్యమయినది. దాని గురించి బాధపడి చేయాల్సిన పని చేయకపోవడం మంచిది కాదు. రాజకీయ నేతల అభిప్రాయాలను గౌరవిస్తూనే (Accommodation) రాజీ (compromise) పడకుండా పనిచేయవచ్చు,” అని ఆయన అంటారు. వృత్తి నైపుణ్యత (expertise) లేకపోయినా పర్వాలేదు గానీ మంచి వైఖరి (attitude) ముఖ్యమని చెబుతారు అనిల్.
సివిల్ సర్వీసెస్లో చేరిన వారు అనైతికంగా ప్రవర్తిస్తున్నారని భావించి, దీనికి విరుగుడుగా కొన్నేళ్ల కిందట ‘ఎథిక్స్’ అనే పేపర్ ను పెట్టారు. అందులో అనేక కేస్ స్టడీస్ మీద ప్రశ్నలు వేస్తున్నారు కానీ, పరీక్షార్ధుల ఆటిట్యూడ్ కనుక్కోవడానికి ఈ పరీక్ష సరిపోవడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒంటి కాలిపై లేచే ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ తన తాజా వ్యాసంలో ‘I Am Shameless” అని ఐ ఏ ఎస్ కు భాష్యం చెప్పారు. ఇది బాధాకరం.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులను ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి రమణ గారు చెప్పినట్లు రాజకీయ కార్యనిర్వాహక వర్గం ప్రజా తీర్పును బట్టి ఇవ్వాళ అధికారంలో ఉంటే, రేపు ఇంటికి పోతుంది. శాశ్వతంగా రిటైర్ అయ్యేదాకా అధికార బాధ్యతల్లో ఉండేవారు అధికారులు. అత్యుత్తమ మేథోసంపన్నులు అని భావించే వారు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ కెరీరిజం రొచ్చులో కొట్టుకుపోతే ప్రజాస్వామ్యానికి తీరని నష్టం జరుగుతుంది. అందుకే-
1) మసకబారిన ప్రతిష్ఠ ను పునరుద్ధరించేందుకు సత్ప్రవర్తనతో, సమాజ సేవ ద్వారా ప్రతి ఐ ఏ ఎస్ అధికారి కృషిచేయాలి.
2) అడ్డదారుల్లో వచ్చే పదోన్నతుల కోసం అంగలార్చకుండా, రాజకీయ నాయకులు విదిల్చే ఎంగిలి మెతుకుల కోసం వెంపర్లాడకుండా ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తామని చేసిన బాసకు అహరహం కట్టుబడి ఉండాలి.
3) సమర్థులైన అధికారులను ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకోవాలి. మంచి పనులు చేస్తే ప్రజాబలం వెన్నంటి ఉంటుందని, అదే శ్రీరామ రక్ష అని నీతిమంతమైన అధికారులకు భరోసా ఇచ్చేందుకు పౌర సమాజం కృషిచేయాలి.
4) ఐఏఎస్ అధికారుల సంఘం మరింత క్రియాశీలంగా పనిచేయాలి. వృత్తిలో విపరిణామాలను గుర్తించి, చర్చించే కార్యాచరణ రూపొందించుకోవాలి. సమర్థతతో పేరు ప్రఖ్యాతులు పొందిన సీనియర్లు నిరంతరం జూనియర్లకు సలహాలు ఇస్తూ మంచిని పెంచాలి.
5) రాజకీయ నాయకుల బూట్లు నాకే అధికారులను నైతికంగా బహిష్కరించాలి. అలాగే, నీతి నిజాయితీ కారణంగా పొలిటికల్ బాసుల కసికి బలయ్యే అధికారులకు ఇతర సహచరులు నైతిక స్థైర్యం ఇవ్వాలి.
..డాక్టర్ ఎస్. రాము
సీనియర్ పాత్రికేయుడు, జర్నలిజం బోధకుడు

.

Discussion about this post