ఓటుకు ‘రేటు’ మరింత పెరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ‘వ్యయ పరిమితి’కి సంకెళ్లు సడలించింది. దీంతో ఏమవుతుంది? మహా అయితే నేతల విచ్చలవిడి తనం పెరుగుతుంది. ఇటీవల ఏపీతో పాటు పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలే ఇందుకు నిదర్శనం.
తెలంగాణలోని హుజురాబాద్ లో ఓటు రూ.5వేలకు పైగానే పలికింది. ఏపీలోని బద్వేలులో పోటీ నామమాత్రం కావడంతో అక్కడ ఓటు రేటు కొద్దిగా తగ్గింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచ్చల విడిగా డబ్బు ఖర్చు చేసింది. తిరుపతిలో ఓటు రేటు రూ.5వేల వరకు పలికింది. కుప్పం పురపాలక ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలనే పట్టుదలతో అధికార పార్టీ ఓటుకు రూ.6వేలు వరకు ఇచ్చింది.
అంటే రాజకీయ నేతలు తమ విజయం కోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా వెనుకంజ వేయడం లేదు. ఎన్నికల వ్యయ పరిమితి మరింత పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఓటు ‘రేటు’ కు రెక్కలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లోక్ సభ, శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల వ్యయపరిమితులను సవరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో లోక్ సభ స్థానానికి వ్యయపరిమితిని రూ.95లక్షలు, శాసనసభ స్థానం ఖర్చును రూ.40లక్షలుగా నిర్ణయిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల సవరణ నిబంధనలు-2022 పేరిట విడుదల చేసిన ఈ నిబంధనలు అధికారిక గెజిట్ లో ముద్రించిన నాటి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
ఇప్పటి వరకు ఈ వ్యయ పరిమితి పెద్ద రాష్ట్రాలకు రూ.70లక్షలు, చిన్న రాష్ట్రాలకు రూ.54లక్షలుగా ఉండేది. అదే శాసనసభ విషయానికి వస్తే పెద్ద రాష్ట్రాల్లో రూ.28లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.20లక్షలు ఉండేది. అయితే ఇకపై అరుణాచలప్రదేశ్, గోవా, సిక్కిం మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలకు ఎన్నికల వ్యయాన్ని రూ.95లక్షలుగా నిర్ధారించారు. ఆ మూడు రాష్ట్రాల్లో మాత్రం రూ.75లక్షలకు పరిమితం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, జమ్ము-కశ్మీర్ లలో రూ.95లక్షలు, మిగిలిన అన్నిచోట్ల రూ.75లక్షలుగా నిర్ణయించారు. ఇక శాసనసభ స్థానాల ఎన్నికల వ్యయాన్ని అరుణాచలప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురలో రూ.28లక్షలకు, మిగిలిన రాష్ట్రాల్లో రూ.40లక్షలకు పెంచారు.
కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్ము-కశ్మీర్, లద్దాఖ్ లో రూ.40లక్షలు, పుదుచ్చేరిలో రూ.28లక్షలుగా అసెంబ్లీ గరిష్ట వ్యయాన్ని ఖరారు చేశారు. 2020 అక్టోబరు 19న జారీ చేసిన నిబంధనల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ నియోజక వర్గాల ఎన్నికల గరిష్ట వ్యయం రూ.77లక్షలు, శాసనసభ ఎన్నికల వ్యయాన్ని రూ.30.80లక్షలు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం లోక్ సభకు రూ.18లక్షలు, శాసనసభకు రూ.10లక్షల వ్యయాన్ని పెంచారు.
శాస్త్రీయ అధ్యయనం తరువాతే ఎన్నికల వ్యయం పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది. 2014 నుంచి 2021 సంవత్సరాల మధ్యలో ఓటర్ల సంఖ్య 83.4కోట్ల నుంచి 93.6కోట్లకు… వ్యయ ద్రవ్యోల్బణ సూచీ 240 నుంచి 317కు చేరిందని కమిటీ గ్రహించింది.
విచ్చలవిడితనం పెరుగుతుందా?
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల వ్యయపరిమితి పెంచడం వలన పోటీ చేసే వారు ఇంకా విచ్చల విడిగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల వారు ఇప్పటికే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. డబ్బు, మద్యం వంటి వాటితో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. చాలా మంది ఓటర్లు కూడా డబ్బు, మద్యానికి అలవాటు పడిపోయారు. ఇటీవల హుజురాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా… అధికార పార్టీ టీఆర్ ఎస్ పక్క గ్రామాలకు పంపిణీ చేసి… తమకు పంపిణీ చేయలేదంటూ ఓ గ్రామం వారు నడి రోడ్డుపై ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే.
అంటే నోటు లేనిది ఓటు తామెందుకు వేయాలనే ధోరణి ఓటర్లలో నెలకొంది, ఇది ఒక గ్రామానికే పరిమతం కాదు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇదే దుస్థితి. ఓటుకు నోటు లేనిదే బూతు వరకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గి పోయింది. నోటు ఇవ్వడంతో పాటు రవాణా సౌకర్యాలు కూడా కల్పిస్తే తప్ప ఓటర్లు పోలింగ్ బూతు వద్దకు రారు. ఇందులో ఓటర్లను నిందించడం కంటే… రాజకీయ పార్టీల నేతలను నిందించడమే మంచిది.
ఎందుకంటే వీరు రాజకీయాన్ని ప్రజా ప్రయోజానాల కోసం కాకుండా వ్యాపారంగా మార్చేశారు. డబ్బుతో గెలిచిన తరువాత ప్రజలపై స్వారీ చేస్తున్నారు. లంచం లేనిదే వారు ఏ పని చేయని ప్రజా ప్రతినిధుల సంఖ్య గణనీయంగా పెరిగి పోతోంది. డబ్బు సంపాదన కోసం వారు తమకు ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నారు.
2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒక శాసనసభ స్థానానికి ఒక్కో అభ్యర్థి సగటున రూ.10కోట్లకు పైగా ఖర్చు చేశారు. అయితే ఎన్నికల నియమావళి ప్రకారం వారి వ్యయ పరిమితి అప్పట్లో రూ.28లక్షలు మాత్రమే. అదే చిన్న రాష్ట్రాల్లో అయితే రూ.20లక్షలు. ఈ నియమావళి కాగితాలకే పరిమితం. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉంటాయి. ఈ ఎన్నికల్లో సగటున ఓటు రేటు రూ.3వేలు పలికింది. ఇది ఎన్నికల అధికారులరకూ తెలుసు. అయినా వారు సరైన ఆధారాలు లేవనే సాకుతో… అభ్యర్థులపై ఎలాంటి చర్యలు తీసుకోరు.
ఇక్కడ మనం ఓ ఉదాహరణ పరిశీలిస్తాం. చిత్తూరు జల్లాలోని ఓ నియోజక వర్గానికి చెందిన ఓ నేత 2019లో జరిగిన ఎన్నికల్లో రూ.10కోట్లకు పైగా ఖర్చు చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన అభ్యర్థ్థులను మూకుమ్మడిగా ఏకగ్రీవం చేయించుకున్నారు. ఇందుకు ఆయన సదరు అభ్యర్థుల నుంచి ఎన్నికలకు అయ్యే ఖర్చు మొత్తం వసూలు చేసుకుని తన జేబు నింపుకున్నారు.
అలా డబ్బు ఇవ్వక పోతే ఆ పదవి వేరే వారికి వెళుతుంది. ఇలా ఆయన రాజకీయ వ్యాపారం చేసి అనతి కాలంలోనే ఆయన రూ.కోట్లకు పడగలెత్తారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. నేటి ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఇలాంటి వారు చాలా ఎక్కువ మందే ఉన్నారు. పైకి ప్రజాసేవ. లోపల చేసేవన్నీ దందాలు… అక్రమ వ్యాపారాలు. నిజాయితీ గల నేతలు నేడు వేళ్ల్ల మీద లెక్కించ వచ్చు.
రాజకీయ వ్యాపారానికి స్వస్తి చెప్పాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ముఖ్యంగా యువత ఇందుకు ఆదర్శంగా నిలవాలి. ఓటుకు ‘రేటు’ కట్టే వారికి బుద్ధి చెప్పాలి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇలా చేస్తే… వారిని బహిష్కరించాలి. అలాంటి నేతలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలి. ఇక ఎన్నికల సంఘం కూడా నియమావళిని కఠినంగా అమలు చేసి… ఓటుకు రేటు కట్టే వారిపై పోటీకి అర్హత లేకుండా చేయాలి.
అలాంటి నిబంధనలు అమల్లోకి తీసుకు రావాలి. ఇది జరగాలంటే ఎన్నికల కమిషన్ పై రాజకీయ పెత్తనం పోవాలి. ప్రజల్లో చైతన్యం వచ్చినపుడే ప్రజాస్వామ్యానికి విలువ, గౌరవం ఉంటుంది. ప్రజలు తాత్కాలిక ప్రయోజనాలతో సంతృప్తి చెందే అన్ని రోజులూ రాజకీయ నేతలు ఇలాగే ఉంటారు. ప్రజల్లో మార్పు వస్తుందని ఆశిద్దాం.
.

Discussion about this post