ఆయనో పేదల పక్షపాతి. నిరంతరం ప్రజల కోసమే పని చేశారు. అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి. వారి శ్వాస కూడా. పీడిత ప్రజల కోసం తన సర్వస్వం త్యాగం చేశారు. సమసమాజం కోసం తుపాకీ చేత బట్టాడు. దశాబ్ద కాలానికి పైగా అజ్ఞాత జీవితం గడిపారు. ఆ తరువాత వ్యక్తి గత కారణాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అయినా తుదిశ్వాస వరకు అణగారిన వర్గాల కోసమే పని చేశారు. అలాంటి పేదల గొంతుకగా ఉన్న మాజీ నక్సలైట్ ఎల్వీరమణ(66) శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో మదనపల్లెలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం చౌడసముద్రం గ్రామానికి చెందిన లచ్చగారి వెంకట్రమణ అలియాస్ ఎల్వీ రమణ జిల్లా మావోయిస్టు కీలక నేతల్లో ఒకరు. 1975 ఎమర్జెన్సీ తరువాత ఆయన విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితులు అయ్యారు. అప్పట్లో ఆ ప్రాంతంలో పీపుల్స్ వార్ లో పని చేస్తున్న మంగలి క్రిష్ణప్ప, చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి వంటి నేతలతో ఈయనకు పరిచయం ఏర్పడింది.
అప్పటి నుంచి ఈయన పార్టీకి సహకారం అందిస్తూ వచ్చారు. 1978 నుంచి క్రియాశీకలంగా పని చేయడం ప్రారంభించారు. రెండు గ్లాసుల పద్దతికి వ్యతిరేకంగా తంబళ్లపల్లె ప్రాంతంలో జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో దళితులకు హొటళ్లలో ప్రత్యేక గ్లాసులు ఉంచే వారు. ఈ విధానానికి వ్యతిరేకంగా తంబళ్లపల్లె ప్రాంతంలో 1980వ దశకంలో రాడికల్స్ ఆధ్వర్యంలో పెద్ద పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ఎల్వీ రమణ పాత్ర మరువలేనిది. ఈయన కొంతకాలం రాడికల్ యూత్ లీగ్ (ఆర్ వై యల్)లో పని చేశారు.
చౌడసముద్రం ప్రాంతంలో ఈయన అనేక పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎల్వీ రమణపై నిర్బంధం పెరిగింది. ఒకవైపు రైతు సంఘం వారు… మరో వైపు పోలీసులు ఈయనను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఈయన అజ్ఞాతవాసంలోకి వెళ్లాల్సి వచ్చింది. అజ్ఞాతంలో ఉంటూ అప్పటి పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శి మంగలి క్రిష్ణప్పకు కొరియర్ గా పని చేశారు. తిరుపతిలో ఉంటూ రాడికల్ విద్యార్థి సంఘం వారికి సహాయంగా ఉండేవారు. ఈ క్రమంలోనే 1983 ప్రాంతంలో తిరుపతి నగరంలోని కొర్లగుంటలో ఈయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ములకలచెరువు మండలం సోంపాళెం సమీపంలోని సంతకనంమిట్ట వద్ద జరిగిన బస్సు దోపిడీ కేసును ఈయనపై బనాయించి మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.
అక్కడ కొంతకాలం పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఆ తరువాత ఈయన బెయిల్ పై బయటకు వచ్చారు. అక్రమ కేసు బనాయించినా ఆయన భయపడకుండా మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి పీపుల్స్ వార్ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. చిత్తూరు జిల్లాలో జరిగిన అనేక రైతాంగ ఉద్యమాల్లో ఎల్వీ రమణ పాత్ర మరువ లేనిది. రెండవ సారి అజ్ఞాతంలోకి వచ్చాక ఈయన కొంతకాలం పాటు సదుం ప్రాంతంలో సీవోగా పని చేశారు. 1984 డిసెంబరులో చౌడసముద్రం కు చెందిన పుట్టా వెంకట్రమణను, 1988లో చౌడసముద్రం పంచాయతీ రెడ్డెంవారిపల్లెకు చెందిన రెడ్డెం సిద్దారెడ్డి ని పీపుల్స్ వార్ దళం హత్య చేసింది.
ఆ తరువాత కొంతకాలానికి ఇదే పంచాయతీ పరిధిలోని గుత్తావారిపల్లెలో శివయ్యనాయుడుతో సహా ముగ్గురిని పీపుల్స్ వార్ దళం హత మార్చింది. ఈ మూడు కేసుల్లో ఎల్వీ రమణను నిందితునిగా చేర్చారు. ఇవే కాకుంగా ఎల్వీ రమణపై పోలీసులు పలు కేసులు పెట్టారు. ఈయన క్రియాశీలకంగా పని చేస్తుండటంతో ఎల్వీ రమణకు పీపుల్స్ వార్ జిల్లా కమిటీ సభ్యునిగా తీసుకున్నారు. 1990 ప్రాంతంలో పీపుల్స్ వార్ లో ఆచరణ వైరుధ్యాలు వచ్చి చీలిక వచ్చింది.
జిల్లాకు చెందిన కొందరు కొండపల్లి సీతారామయ్య వైపు… మరి కొందరు గణపతి వర్గంవైపు వెళ్లారు. ఈ సమయంలో ఎల్వీ రమణ… కొండపల్లి సీతారామయ్య వర్గం వైపు వచ్చారు. 1991లో పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శి బాధ్యతలు తీసుకున్నారు. ఏడాదికి పైగా కార్యదర్శి బాధ్యతలు చూశారు. ఆ తరువాత నిర్బంధం బాగా పెరగడం… కొండపల్లె వర్గం జిల్లాలో బలహీన పడటంతో 1992 జూలై 28న తిరుపతిలో రాష్ట్రపతి బందోబస్తు కోసం వచ్చిన అప్పటి రాష్ట్ర డీజీపీ టీఎస్ రావు ఎదుటు లొంగి పోయారు. అప్పటి నుంచి ఈయన జనజీవన స్రవంతిలో ఉండేవారు.
ఈయనపై పోలీసులు పెట్టిన ఏ కేసు న్యాయస్థానంలో నిరూపణ కాలేదు. ఎల్వీ రమణ జనజీవన స్రవంతిలోకి వచ్చినా… పీపుల్స్ వార్ సిద్ధాంతాలను మాత్రం ఏనాడూ మరువలేదు. మదనపల్లెలో నివాసం ఏర్పరుచుకుని పేద ప్రజలకు అండగా ఉంటూ వచ్చారు. వారికి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కారానికి కృషి చేసే వారు. పౌరహక్కుల సంఘం సమావేశం ఎక్కడ జరిగినా హాజరయ్యే వారు.
తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతంలో తనకంటూ ఓ ప్రత్యేక అభిమానులను సంపాదించకున్నారు. ఈయనకు చాలా కాలంగా చక్కెర వ్యాధి ఉంది. శనివారం కూడా తన మిత్రులతో కలసి మదనపల్లె పట్టణంలో తిరిగారు. మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్లారు. ఇంట్లో విశ్రాంతికి ఉపక్రమించారు. నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మిత్రులు ఏదో పని మీద ఫోన్ చేశారు. ఎంత సేపటికీ ఫోన్ తీయక పోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లారు. దీంతో ఆయన భార్య ఎల్వీ రమణను పిలిచింది. అయినా పలకక పోవడంతో మదనపల్లెలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారు కాదని చెప్పడంతో… అక్కడ నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే ఎల్వీ రమణ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా రమణ మృతి పట్ల మాజీ నక్సలైట్లు చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణంరాజు, శంకరరెడ్డి, భాస్కర్ నాయుడు, పాదం శివన్న, సిద్ధేశ్వర్, కేశవ, మురళి, శ్రీరాములు, మంత్రాల రమణ, పౌరహక్కుల సంఘం నేత నాగేశ్వరరావు, గంధం కిషోర్, సుదర్శన్, మనోహర్ తదితరులు విప్లవ జోహార్లు తెలియచేశారు. ఆయన పోరాటాలను నెమరు వేసుకున్నారు.
.