గృహనిర్బంధాలు.. అక్రమ అరెస్టులు.. టోల్ గేట్ల వద్దే అడ్డగింతలు.. కేసులు పెడతామని బెదిరింపులు.. అయినా బడిపంతుళ్లు భయపడలేదు. నిర్బంధం.. బెదిరింపులు లెక్క చేయకుండా వేలాది తరలి వచ్చి కలెక్టరేట్ల వద్ద కదం తొక్కారు.
పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) పై ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామని.. జగన్ ప్రభుత్వానికి భవిష్యత్తులో తగు బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు.
ఊహించని రీతిలో పాధ్యాయలోకం కలెక్టరేట్ల ముట్టడికి తరలి రావడంతో ప్రభుత్వం షాక్ కు గురవుతోంది. ఉద్యమం ఇంత తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వం ఊహించలేదు.
పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)పై ఇచ్చిన ఉత్తర్వులు వెనుక్కు తీసుకోవాలని.. సీపీఎస్ వెంటనే రద్దు చేయాలని.. హెచ్ ఆర్ ఏ లో విధించిన కోత ఎత్తివేయాలని.. తదితర డిమాండ్లతో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతమైంది.
రాష్ట్రంలోని 13జిల్లాల్లో ఈ ముట్టడి కార్యక్రమం జరిగింది. కలెక్టరేట్ల ముట్టడిని అడ్డుకోవడానికి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. వివిధ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నేతలను బుధవారం రాత్రి నుంచే గృహ నిర్బంధం చేశారు.
తిరుపతిలో టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలనూ ఇదే తరహాలో నిర్బంధించారు. జిల్లా కేంద్రాలకు వచ్చే అన్ని రకాల వాహనాలను తనిఖీలు చేస్తూ.. ఎక్కడ పడితే అక్కడ ఉపాధ్యాయులను అడ్డుకున్నారు. చాలా చోట్ల ఉపాధ్యాయులను బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినా వేలాది మంది ఉపాధ్యాయులు నిర్బంధం అధిగిమించి.. పోలీసుల కళ్లు కప్పి… కలెక్టరేట్ల వద్దకు చేరుకున్నారు.
కలెక్టరేట్ల ముట్టడిని అడ్డుకోవడానికి పోలీసులు వందల సంఖ్యలో బలగాలను మొహరించారు. అయినా ఉపాధ్యాయులు ఏ మాత్రం భయపడలేదు. ముట్టడికి మహిళా ఉపాధ్యాయులు కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడం విశేషం. కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పీఆర్సీపై ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు.
ప్రభుత్వ పథకాలు, విధానాల అమలుకు క్షేత్ర స్థాయిలో శ్రమిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ వైఖరి తీవ్ర నిరాశాజనకంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మ ఆధ్వర్యంలో వేసిన పనికిమాలిన కమిటీ ఇచ్చిన చెత్త రిపోర్టును అమలు చేయడం దుర్మార్గమన్నారు.
పీఆర్సీ అమలు వలన రాష్ట్ర చరిత్రలోనే కాకుండా… దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు తగ్గే దయనీయ స్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్య్తక్తం చేశారు.
70ఏళ్ల వయసు దాటిన పెన్షనర్లకు పింఛనులో కోత విధించి.. వారిని వృధ్యాప్యంలో మానసిక వేదనకు గురిచేయడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ఓ వైపు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నైరాశ్యంతో.. అక్రోశంతో ఉద్యమబాట పడుతుంటే .. అధికారులు అర్ధరాత్రి ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.
మాట తప్పను.. మడమ తిప్పను అని పదే పదే చెప్పే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. పీఆర్సీ, సీపీఎస్ విషయంలో ఎందుకు మాట తప్పుతున్నారని వారు నిలదీశారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే ఏమిటో భవిష్యత్తులో జగన్ కు చూపిస్తామని వారు శపథం చేశారు. పీఆర్సీ పై ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోక పోతే సమ్మె తప్పదని వారు ప్రకటించారు.
Discussion about this post