సంపదతో చేరుతూ ఉండే కొద్దీ.. కొందరు వ్యక్తులకు ఒక్కోరకమైన కొత్త అలవాట్లు ఏర్పడుతాయి. మనుషుల్లో రకాలను బట్టి సంపద భాసిస్తుంది. సంపద చేరుతూ ఉండే కొద్దీ కొందరు ముందు ఆ సంపదకు తర్వాత వ్యసనాలకు తర్వాత అహంకారానికి దాసులు అవుతూ ఉంటారు. సంపదలతో తులతూగుతూ ఉండే కొద్దీ అహంకారపు పొరలు కమ్ముతాయి.
డబ్బు ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. జీవితం పట్ల భరోసాను కూడా కలిగిస్తుంది. నిశ్చింతను అందిస్తుంది. అలాంటి నిశ్చింత ఇతర ఆందోళనలు లేకుండా.. ప్రశాంతంగా మన పనులు మనం నిర్వర్తించడానికి బాటలు వేస్తుంది. చాలా రకాలుగా డబ్బు అనేది అవసరమే. మంచి వారిలో అదే సంపద దానధర్మాలకు, సత్కార్యాలకు ఉపయోగపడే రీతిగా తయారైతే.. విచక్షణ ఎరగని వారు అహంకారంతో పెట్రేగిపోయేలా చేస్తుంది.
‘ధనమూలం ఇదం జగత్’ అనే మాట మనం తరచూ వింటూ ఉంటాం. ఇది అక్షర సత్యం కూడా. మనం నివసించే ప్రపంచంలో డబ్బు లేకుండా ఏదీ సాధ్యం కాదు. ‘డబ్బుతో నాకు పనేముంది’ అని చిలకపలుకులు పలుకుతూ.. ఎంత నిరాడంబరంగా జీవించాలని అనుకున్నా కూడా.. హఠాత్తుగా ఆరోగ్యం దెబ్బతినడం లాంటి పరిస్థితులు సంభవించినప్పుడు డబ్బు తప్పనిసరి అవుతుంది. సాధారణంగా డబ్బు సంపాదించడం చేతగాని వాళ్లంతా.. డబ్బు మీద తనకు మమకారం లేదని అంటూ ఉంటారనేది లోకరీతి. ఇది కూడా నిజమే కావొచ్చు. కానీ డబ్బుతో పాటు మనిషికి విచక్షణ చాలా అవసరం.
అయితే, డబ్బు చేరడం అనేది ఒక్కొక్కరినీ ఒక్కోరకంగా తయారుచేస్తుంది. ఎవరిని ఏ రీతిగా తయారు చేస్తుందనేది- ఆయా వ్యక్తుల్లో ఉండే విచక్షణ వివేచన మీద ఆధారపడి ఉంటుంది. సంపదను నిందించాల్సిన అవసరం లేదు. కానీ. సంపదలు కలిగించే పొగరుకు మాత్రం దూరంగా ఉండడం అవసరం.
ప్రపంచంలో ఏది కావాలనుకున్నా సరే.. అందుకు డబ్బు అవసరం. కొన్ని విషయాలు తప్ప.. డబ్బుతోనే భౌతికమైన అవసరాలు అన్నీ తీరుతాయి. కానీ డబ్బుతో ఏదైనా సరే దక్కుతుంది. దక్కించుకోగలం అనుకోవడం మాత్రం అహంకారం. అది కరెక్టు కాదు.
డబ్బు బాగా చేరిన వాళ్లు.. అహంకారం ఆవరిస్తే.. విద్యాసంపన్నులని తృణీకారంగా చూడడం, ఎగతాళి చేయడం, వారి ఎదుట డబ్బును ప్రదర్శించే భేషజాలకు పోవడం.. లాంటివి చేస్తుంటారు. దీనివల్ల.. అలాంటి విద్వత్ సంపన్నులకు కలిగే నష్టం ఏమీ ఉండదు. ఆ వ్యక్తుల అహంకారం మాత్రమే బయటపడుతుంది.
ఇదే విషయాన్ని భర్తృహరి తన సుభాషితంలో చక్కటి పోలికతో వివరిస్తాడు..
పరిగత పరమార్థాన్ పండితాన్ మావమంస్థాః
తృణమివ లఘు లక్ష్మీర్నైవ తాన్ సంరుణద్ధి ।
అభినవ మద రేఖా శ్యామ గండ స్థలానాం
న భవతి బిసతంతుర్వారణం వారణానామ్ ॥
పరమతత్త్వము నెరిగిన పండితులను అవమానించకూడదు. సంపదను చూసి భయపడి హేళలనలను వారు భరిస్తారని అనుకుంటే పొరబాటు. అలాంటి విద్యాసంపన్నులు సంపదను గడ్డిపోచలా భావిస్తారు. సరికొత్తగా మదధారకారి నల్లబారిన చెక్కిళ్ళు గల మత్త గజాన్ని, తామర కాడలతో కట్టి బంధించాలని అనుకుంటే అది సాధ్యమవుతుందా? అంటే, ధన గర్వము చేత విద్యాసంపన్నులను బానిసలుగా చేసుకోగలం అనుకుంటే అంతకంటె అవివేకం ఇంకొకటి ఉండదు.
ధనం, సంపద పొగరు కలిగించకుండా ఉండవు. కానీ, ఆ పొగరును ఆ సంపదలకు మాత్రమే విలువ ఇచ్చే మరొక ధనవంతుడి ఎదుట మాత్రమే ప్రదర్శిస్తే బాగుంటుంది. అంతే తప్ప, విద్వత్తును కలిగిఉండే వారి వద్ద.. డబ్బు పొగరుతో ఆటలాడితే.. అభాసుపాలు కావాల్సి వస్తుంది.
.

Discussion about this post