ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేప్పుడు ప్రతిప్రాణిలోను ఉండేది ఒకే భగవంతుడు అనే అందరూ అంటూ ఉంటారు. మరి అన్ని ప్రాణులూ సమానంగా భగవత్ స్వరూపాలే అయినప్పుడు.. ఇతర జంతువుల కంటె మనుషులు ఎలా గొప్ప? జంతువుల నుంచి మనల్ని వేరు చేస్తున్నది ఏంటి?
‘ధర్మం’, ధర్మాచరణతో కూడిన జీవనం మనుషుల్ని జంతువులనుంచి వేరు చేస్తాయని పెద్దలు చెబుతుంటారు. ఒక క్రమబద్ధమైన జీవన శైలి, కొన్ని నియామాలను విధివిధానాలను నిర్దేశించుకుని.. వాటికి అనుగుణంగా జీవనం గడపడమే మనుషులను జంతువుల కంటె మెరుగైన ప్రాణిగా నిలబెడుతోందనేది కూడా అందరూ ఒప్పుకునే సంగతి.
ఈ విషయం కూడా కొత్తది కాదు. ఈ విషయాన్ని ఓ సుభాషితం ఇలా చెబుతుంది..
ఆహార నిద్రా భయ మైథునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణామ్
ధర్మో హి తేషామ్ అధికోవిశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః
తిండి, నిద్ర, భయం, రతి లాంటివన్నీ మనుషులతో సహా అన్ని రకాల జంతువుల్లోనూ ఒకే తీరుగా ఉంటాయి. అయితే ధర్మం ఒక్కటే.. మనుషులను.. ఇతర జంతువుల నుంచి వేరు చేస్తుంది. ధర్మం లేని వాడు.. ఆచరించని వాడు పశువుతో సమానం. .. అని చెబుతుంది ఈ సుభాషితం.
ఇంతవరకు కొత్త విషయమేం కాదు. కానీ.. ధర్మం అంటే ఏమిటి? ఏ విషయాన్ని మనం ధర్మంగా భావించాలి. ఈ మీమాంస ప్రతి ఇద్దరు మనుషులకు మధ్య మారుతుంటుంది.
అయితే ధర్మం అంటే ఏమిటో మరో సుభాషితం మనకు చాలా సరళంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది.
ధారణాత్ ధర్మమిత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః
యస్యాత్ ధారణ సంయుక్తమ్ స ధర్మ ఇతి నిశ్చయః
ధర్మం అనే పదమే.. ధారణ అనే క్రియ నుంచి ఆవిర్భవించింది. ధారణ అంటే సమాజాన్ని కలిపి ఉంచేది. కాబట్టి.. ప్రజలందరినీ కూడా సమైక్యంగా, కలిపి ఉంచేది ఏదైతే ఉంటుందో.. అదే ధర్మం అనిపించుకుంటుంది.
హిందూత్వం మతం కాదు ధర్మం అని కొందరు అంటుంటారు. ధర్మానికి సంబంధించిన ఈ నిర్వచనం ప్రకారం.. కేవలం హిందూత్వం మాత్రమే కాదు.. ఒక జన సమూహాన్ని సమైక్యంగా ఉంచే ఏ విశ్వాసం అయినా సరే, నమ్మకం అయినా సరే.. అది ధర్మమే.
ఒక సమూహాన్ని సమైక్యంగా ఉంచుతున్నదంటే.. వారందరి ఆమోదం పొందినట్టే లెక్క. అలా సర్వజనామోదం పొందిన ప్రతి విషయమూ కూడా ఆ సమూహానికి ధర్మమే అనిపించుకుంటుంది. ఒకరి విశ్వాసాల పట్ల మనకు అపనమ్మకం ఉండొచ్చు. మనం విభేదించవచ్చు. కానీ.. అది ఆ సమూహానికి ‘ధర్మమే’ అనే సత్యం బోధపరచుకున్నప్పుడు.. మనం విభేదిస్తే.. దూరంగా ఉండాలే తప్ప- ఖండించడం తగదు అనే విచక్షణ అలవాటు చేసుకుంటే బహుశా మన సమాజంలో ఎటువంటి అశాంతి కూడా ఉండదు.
శుభోదయం
.
Discussion about this post