నరం లేని నాలుక నాలుగు విధాల చేటు చేస్తుందని సామెత! నాలుక బయటకు కనిపించదు.ఎఫ్పుడూ నోటిలోపల మాత్రమే ఉంటుంది. కానీ అది మనకు చేటు చేస్తుంది. ‘పృష్ట తాడనాత్ దంత భంగః’- వీపు మీద కొడితే మూతి పళ్లు రాలుతాయనే సామెతకు ఇది పూర్తిగా విరుద్ధం. నాలుక అదుపు తప్పి వ్యవహరిస్తే గనుక.. వీపు పేలిపోతుంది! దాని భావమే.. మనం మాట్లాడే మాట మీద అదుపు ఉండాలి!
మాట అదుపు తప్పితే మనుషుల్ని చాలా బాధ పెడుతుంది. మనసుల్ని గాయపరుస్తుంది. ఆ గాయం చాలా తీవ్రంగా కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంతకంత విపరిణామాలకు కూడా అది దారితీస్తుంటుంది. అందుకే మాట విషయంలో.. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట కూడా ప్రళయం సృష్టించేయగలుగుతుంది. వ్యక్తుల జీవితాల్లో, కుటుంబాల్లో, ప్రపంచంలో కూడా ప్రళయం పుట్టించగల శక్తి అదుపు తప్పిన మాటకు ఉంటుంది.
మాట మేలు చేయడం కూడా కద్దు. మాట జీవితాలను బాగు చేయడం కూడా కద్దు. మంచి మాట- చేసే మేలు కూడా మామూల్ది కాదు. కానీ.. పోల్చి చూసినప్పుడు.. దానికంటె ఎక్కువ నష్టం.. అదుపు తప్పిన మాట వల్లనే ఉంటుంది. ఎక్కువ నష్టం జరుగుతుంది.
ఈ విషయాన్ని భారతంలో భీష్ముడు ఇలా చెబుతాడు. యుధిష్టరుడు రాజ్యపాలన లోని నీతులను చెప్పమని అంపశయ్య మీద ఉన్న తాతను అడిగినప్పుడు భీష్ముడు చెప్పే గొప్ప విషయాలలో ఇది కూడా ఒకటి.
సంరోహాత్యగ్నినా దగ్ధం వనం పర పరశునా హతమ్
వాచా దురుక్తమ్ బీభత్సం న సంరోహతి వాక్ క్షతమ్
ఎంత పెద్ద అడవి అయినా కూడా.. దావానాలం రేగినప్పుడు గానీ.. గొడ్డలి వలన గానీ.. సర్వనాశనం అయిపోతుంది. అయినా కూడా.. కొంతకాలం గడిచేసరికి తిరిగి అడవి పెరుగుతుంది. కానీ, చెడ్డ, కఠినమైన మాటల వలన మనసుకు తగిలే గాయం ఎఫ్పటికీ కూడా నయం కాదు. – అనేది శ్లోకభావం.
మాట చేసే గాయం ప్రభావం అది. అడవి మొత్తం దహించుకుపోయినా మళ్లీ పుడుతుంది గానీ.. మాట చేసే గాయం మానదని అంటాడు భీష్ముడు. మరి దీనికి తరణోపాయం ఎలాగ?
మాటను నియంత్రించుకోవాలి. కానీ మాట తూలడం అనేదే ఆవేశంలో చేస్తాం కాబట్టి. మన మాటలు ఇతరులకు గాయం చేయకుండా.. ఆవేశాన్ని నియంత్రించుకోవాలి. ఆవేశకావేషాల్ని నియంత్రించుకోగలిగితే.. మనం మహర్షులం అయిపోతాం కదా. మామూలు మానవులు ఎందుకు అవుతాం? నిజానికి మహర్షులు, దేవుళ్లు కూడా ఆవేశంలో అదుపుతప్పిన సందర్భాలు మనకు కోకొల్లలు. మరెలాగ?
also read : బద్వేలు ఫలితం నుంచి జగన్ నేర్చుకోవాల్సిన పాఠమేంటి?
ఒక చిన్న ఉపాయం ఉంది. మాట్లాడేప్పుడు మనిషికి కొంచెం నిదానం ఉండాలి. మనం ఏ మాట బయటకు చెప్పబోతున్నామో.. ఆ మాటను మనసులో ఓసారి రిహార్సల్ వేసుకోవాలి. మనం అనబోతున్న మాట ప్రభావం ఏంటి? దానివలన ఎదుటివారు ఎలా స్పందిస్తారు? నొచ్చుకుంటారా లేదా? ఒకసారి తర్కించుకోవాలి! ఆ తర్వాత మాటను బయటకు అనాలి.
కోపం వచ్చినప్పుడు సైకాలజిస్టులు ఒకటినుంచి పది లెక్కపెట్టమని అంటారే. అలాగన్నమాట. మాటను ఓసారి అంతరంగంలో అనుకుని, తర్వాత బయటకు అంటే.. ముప్పేమీ ఉండదు. ఇది ఇంకా పెద్ద కష్టం కదా అనుకోవచ్చు. కానీ కొద్దిపాటి సాధనతో ఇది చాలా సులభం.
ఒక్కోసారి మనకు ఆవేశం రానక్కరలేదు. యథాలాపంగా అనే మాటలు కూడా ఎదుటివారిని బాగా నొప్పిస్తాయి. బాధకు గురిచేస్తాయి. మన పట్ల మనస్తాపం కలిగిస్తాయి. మాట అనేసిన తర్వాత.. అలా అని ఉండాల్సింది కాదే.. పొరబాటు చేశానే అని మనకు మనమే చెప్పుకునే సందర్భాలు బోలెడు ఉంటాయి. అలాంటి అన్నింటికీ ఇది నివారణ. ఒక్కసారి మాటను మనసులో అనుకుని బయటకు చెప్పడం అలవాటు అయితే.. ఎవ్వరినీ మనం నొప్పించం. ఎవ్వరితోనూ మన సంబంధ బాంధవ్యాలు గాయపడవు. మన చుట్టూ సౌహార్దపూరిత స్నేహపూరిత వాతావరణం ఎప్పటికీ ఉంటుంది.
శుభోదయం
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post