కాస్తంత బలం పెరిగే సరికి.. భారతీయ జనతా పార్టీకి అసలు రాజకీయం అంటే ఏమిటో తెలిసివస్తున్నట్లుగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో అంతో ఇంతో బలం పెరిగిన తరువాత సాంప్రదాయ పార్టీల లాగా భారతీయ జనతా పార్టీలోకూడా ముఠా తగాదాలు, అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి. ఆధిపత్యం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారో.. చిత్తశుద్ధితో పాయింట్ ఉంది గనుకనే మాట్లాడుతున్నారో గానీ.. భాజపాలోని కొత్తనీరు- పాతనీరు మధ్య అగ్గి రాజుకుంటోంది.
భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఈ విషయంతో కేంద్రానికి సంబంధం లేదని అంటున్నారు. అదే సమయంలో కొత్తగా భాజపాలోకి వచ్చిన మరో ఎంపీ సుజనా చౌదరి మాత్రం.. రాజధాని తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా కూడా వ్యతిరేకిస్తున్నారు.
కన్నా వ్యతిరేకించడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన గుంటూరుకే చెందిన నాయకుడు. రాజధాని తరలిపోవడాన్ని అడ్డుకోకుంటే స్థానికంగా పరువు పోతుందనే భయం ఉండొచ్చు. కానీ, సుజనా చౌదరి రాజధానిప్రాంతంలో భూబాగోతాల్లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. ఆయన వ్యతిరేకించడానికి సహజంగానే విలువ లేదు. అయితే జీవీఎల్- సుజనా మధ్య మాటామాటా పెరుగుతోంది.
సుజనా హఠాత్తుగా పార్టీలోకి వచ్చి.. పార్టీ మీద గుత్తపెత్తనం సాగిస్తున్నట్లుగా కొన్ని వర్గాల్లో ప్రచారం ఉంది. పాతకాలంనుంచి పార్టీలో ఉన్న వారిని సైడ్ లైన్ చేస్తూ.. ఆయన పెత్తనం చెలాయిస్తున్నారని కొందరికి అసంతృప్తి ఉంది. సహజంగా భాజపా నాయకుల్లాగా కాకుండా సంపన్నుడైన నేత కావడం వల్ల.. ద్వితీయ శ్రేణి నాయకులు చాలా మంది ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితిని చాలా మంది సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మరి అగ్రనేతలు ఈ కొత్త పోకడల్ని ఎలా చక్కదిద్దుతారో చూడాలి.
.

Discussion about this post