శ్రీకాకుళం నుంచి వెలువడుతున్న సాయంకాలం దినపత్రిక
‘సత్యం’ లో బ్యానర్ కథనంగా ప్రచురితం
సాధారణంగా నగరాలు విస్తరిస్తుంటాయి. కొత్త నగరాల్లో సహజంగానే కొత్త కొత్త ఆధునిక వసతులు, జీవనానికి మెరుగైన మౌలిక వసతులు గట్రా ఉంటాయి. ఇక అందరి దృష్టి కొత్త నగరం మీదనే మళ్లుతుంటుంది. పాతనగరం అలా..అలా.. ఎప్పటికీ పతబడుతూనే ఉంటుంది.
ఉదాహరణకు హైదరాబాదును తీసుకుందాం. చార్మినార్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఒకప్పుడు వైభవంగా విలసిల్లిన ప్రాంతమే. తర్వాత కొత్త నగరం ఏర్పడింది. కొత్తనగరం హైటెక్ సిటీగాను, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గానూ, ఇప్పుడు ఫ్యూచర్ సిటీగానూ విస్తరిస్తూనే ఉంది. చార్మినార్ ప్రాంతానికి పాతబస్తీ అనే పేరు స్థిరపడింది. నవీన నగరపు హంగుపొంగులేవీ అక్కడ కనిపించవు. అదే సిద్ధాంతం ఇప్పుడు ఉత్తరాంధ్రకు కూడా వర్తించబోతోందా? భోగాపురంలో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఆర్భాటంగా ప్రారంభమైంది. ఈ ప్రాంతపు అభివృద్ధిలో ఇదొక కీలక ఘట్టం అవుతుందనడంలో సందేహం లేదు. అలాగని యావత్ ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని ఈ విమానాశ్రయం మార్చివేస్తుందని పాలకులు చెబుతున్న మాటల్లో తర్కబద్ధత ఎంత? ఉత్తరాంధ్ర అభివృద్ధికి అనేక ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలను తీసుకువస్తున్నారు. ఆ కోణంలో కూడా పాలకు చిత్తశుద్ధిని అనుమానించాల్సిన అవసరం లేదు. వారి ప్రయత్నాలన్నీ ఫలితస్తే ‘కొత్త ఉత్తరాంధ్ర’ ఆవిర్భవిస్తుంది. దానితో ముడిపడిన వారందరికీ ఈ విమానాశ్రయం ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. అంతేతప్ప.. ‘పాత ఉత్తరాంధ్ర’ ముఖచిత్రం ఏ విధంగా మారుతుంది? ఎంత మేరకు మారుతుంది? ఇవన్నీ జవాబు దొరకని ప్రశ్నలు!

.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె,
సంపాదకుడు, ఆదర్శిని
ఎన్డీయే ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద చాలా శ్రద్ధ పెడుతున్నారు. కానీ వీటిని ప్రజలు కోరుకునే అభివృద్ధి ప్రమాణాల దృష్ట్యా మూడు రకాలుగా వర్గీకరించుకోవాలి. ఒకటి- సంస్థలు వచ్చినా ఉద్యోగాల పరంగా పరిమితమైన ప్రయోజనం కలిగించేవి. ప్రధానంగా డేటా సెంటర్లు ఈ కోవకు చెందుతాయి. రెండు- సంస్థలు రావడంతోటే కొత్తనగరాల విస్తరణకు కారణమయ్యేవి. ఐటీ కంపెనీలు ఈ కోవలోనివి. ఒక ఐటీ కంపెనీ వచ్చినంత మాత్రాన స్థానికులకు దక్కే ఉద్యోగాలు తక్కువే ఉంటాయి. మూడు- సంస్థ ఏర్పాటు అయ్యాక ఉద్యోగాల పరంగా స్థానికులకు వరంగా మారేవి. ఆర్సెలార్ ఉక్కు పరిశ్రమ వంటివి ఈరకం. ఉత్పత్తితో ముడిపడిన ఇలాంటి సంస్థలవల్ల ఉద్యోగాల పరంగా ఎక్కువ మేలు జరుగుతుంది. మిగిలినవన్నీ అనుబంధ ఉపాధులకు మాత్రమే దోహదం చేస్తాయి. పాలకులు ఎన్నివేల కోట్ల పెట్టుబడులు వచ్చాయనే గణాంకాలు మాట్లాడకూడదు. వాటిద్వారా ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చాయి అనే లెక్కలే మాట్లాడాలి. ఇంకా సూక్ష్మంగా వచ్చిన ఉద్యోగాల్లో ఉత్తరాంధ్ర బిడ్డలకు దక్కిన ఉద్యోగాల శాతమెంత? అనేది కూడా పారదర్శకంగా చెప్పాలి. అప్పుడే సరైన న్యాయం జరిగినట్టు!
ఇప్పుడు ఈ మూడు రకాల వాటిలో విమానాశ్రయ అవసరాలు ఎవరికుంటాయి? ముందే చెప్పుకున్నట్టు డేటా సెంటర్లు వచ్చినంత మాత్రాన వాటివల్ల పెరిగే యాక్టివిటీ ఏమీ ఉండదు. సాఫ్ట్ వేర్ పరిశ్రమలు ఎక్కువగాను, ఉత్పత్తితో ముడిపడిన పరిశ్రమలు కాస్త తక్కువగాను ఎయిర్ పోర్ట్ ను వాడుకోవచ్చు. ఆ రకంగా కొత్తగా ఏ అభివృద్ధిని అయితే ఆశిస్తున్నామో.. అదంతా కార్యరూపం దాల్చిన తర్వాత.. ‘కొత్త ఉత్తరాంధ్ర’ అద్భుతాలు సృష్టించడంలో విమానాశ్రయం కీలక భూమిక పోషిస్తుంది.
పాత ఉత్తరాంధ్ర విషయానికి వద్దాం?
ఉత్తరాంధ్ర సుదీర్ఘకాలంగా బాగా వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోవడానికి ప్రధాన కారణం వ్యవసాయాధారితం కావడమే అనుకోవచ్చు. ఇంకా వర్షాధారంగా మాత్రమే సాగవుతున్న లక్షల హెక్టార్ల భూములు ఈ ప్రాంతంలో ఉన్నాయి. పొట్ట చేతబట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న వారు నగరాల్లోని పేదలు కాదు. గ్రామాల్లో వ్యవసాయ పనులకు కూడా దిక్కులేక అలమటిస్తున్న వారు మాత్రమే. వారు తిరిగి రావచ్చునని.. విమానాశ్రయం వలన దానికి అనుబంధంగా తయారుకాగల కొత్త కూలీ పనులను ఇక్కడే వెతుక్కోవచ్చునని పాలకులు చెబుతున్నారు. అంతిమంగా పరాయి నేలమీదనైనా ఇక్కడైనా కూలీలుగా ఉండాల్సిందే తప్ప.. ఇక ఆ బతుకుల్లో మారుతున్న ముఖచిత్రం ఎక్కడ?
ఉత్తరాంధ్రలోని ఒక సాధారణ రైతు, నేలను నమ్ముకుని పొట్టపోసుకుంటున్న కూలీల జీవితంలో ఈ విమానాశ్రయం వలన ఏ రకమైన మార్పు వస్తుంది? తర్కానికి అందని ప్రకటనలు ఇవి!
ఆ బతుకులు మారేదెప్పుడు?
యావత్ ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారడం అంటే.. కేవలం విమానాశ్రయం ఆధారిత/ అనుబంధ వ్యాపారాలు, ఉపాధుల ద్వారా పొందగల కొత్త కూలి పనులు మాత్రమే కాదు. ఉత్తరాంధ్ర కన్నబిడ్డలు, వందల ఏళ్లుగా కష్టాలకే అలవాటు పడిన రైతులు, వ్యవసాయ అనుబంధ వృత్తుల వారు కూడా బాగుపడడం అవసరం. అక్కడి వ్యవసాయానికి మంచిరోజులు వచ్చినప్పుడే కదా అది సాధ్యమవుతుంది? ఈ కోణంలో పాలకులు ఆలోచించాలి.
మన్యం జిల్లాలో సాలూరు సమీపంలోని వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు సంగతి చూద్దాం. 24,700 ఎకరాలు సాగులోనికి రావడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పెండింగులోనే ఉన్నాయి. జైకా రుణ సహాయంతో 63.50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ పనులు సాగుతున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు. 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందిస్తుందనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. పోలవరం ఎడమ కాలువ ద్వారా వంశధార బేసిన్ వరకు నీళ్లు అందించి, శ్రీకాకుళం జిల్లాలోని ఆయకట్టు చిట్టచివరి ఎకరాను కూడా సాగులోకి తీసుకురావాలనేది లక్ష్యం. ఎంతోకాలంగా నేతలు విస్మరిస్తున్న ఉత్తరాంధ్ర ఆశ ఇది. ఇప్పుడు అనకాపల్లి వరకు పోలవరం నుంచి నీళ్లు తెచ్చి.. అఖండ హారతి కూడా ఇచ్చేస్తాం అంటున్నారు. లక్ష్యం మేరకు వంశధార బేసిన్ వరకు, శ్రీకాకుళం జిల్లాలోని చివరి ఎకరం తడిసేలా ఎప్పటికి నీళ్లిస్తారో చెప్పడం లేదో. అనకాపల్లి దాకా నీళ్లు తెచ్చి అక్కడితో చేతులు దులుపుకుంటారేమోనని ప్రజల భయం.
పాలకులు కొన్ని సందర్భాల్లో వీటి గురించి చాలా ఘనంగా గడువు తేదీలు చెబుతూ ఉంటారు. అవి పూర్తి కావడం ప్రజల కలల నెరవేరడం మాత్రం జరగడం లేదు. ప్రాజెక్టులు పూర్తయితే లక్షలాది ఎకరాలు కొత్తగా సాగులోకి రావడం ద్వారా మాత్రమే.. ఈ ‘పాత ఉత్తరాంధ్ర’ జీవితాల ముఖచిత్రం మారుతుంది. కేవలం ఒక విమానాశ్రయం సాధించగల మార్పులు ఈ ‘పాత ఉత్తరాంధ్ర’ బతుకుల్లో ఉండేది లేశమాత్రమే. ఆ స్పష్టత పాలకులకు ఉండాలి. వేల కోట్ల రూపాయతో విమానాశ్రయం కట్టారు. వేల కోట్లరూపాయల పెట్టుబడులు వస్తున్నాయని అంటున్నారు. లక్షల కోట్ల రూపాయలతో రాజధానిని కడుతున్నారు. ఆ రాజధాని పట్ల ఉత్తరాంధ్ర వాసుల్లో అసూయ పుట్టకుండా ఉండాలంటే, ఒక గర్వభావన కలగాలంటే, ఒక అనుబంధం ఏర్పడాలంటే.. ముందుగా వీరి వెతలు తీరాలి, వీరి కడుపు నిండాలి. వేలాది కోట్ల రూపాయల పనులు రాష్ట్రమంతా జరుగుతుండగా.. ‘పాత ఉత్తరాంధ్ర’ ముఖచిత్రం మార్చడానికి, ఆ పాత, పేద బతుకుల్లో కూడా నిత్యమైన సంతోషాలను తీసుకురావడానికి ఏకైక మార్గం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడమే. ఆ ఎరుక పాలకులలో ఏర్పడితే.. అప్పుడు పాత- కొత్త ఉత్తరాంధ్రలు జమిలిగా తమ ముఖచిత్రం మార్పును అనుభూతిస్తాయి.
![]()


.