‘టీఆర్ఎస్ తలచుకుంటే ఉపఎన్నిక వస్తుంది.. లేకపోతే రాదు’ అనే మాటల ద్వారా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరాసను డిఫెన్సులోకి నెట్టేశారు. ఆయన చెప్పింది ఈ మాటలే అయినా.. ఆ వాక్యాల బిట్వీన్ ది లైన్స్ భావం వేరు. ‘టీఆర్ఎస్కు ధైర్యం ఉంటే ఉప ఎన్నిక వస్తుంది.. లేకపోతే రాదు’ అని కోమటిరెడ్డి అన్నట్లుగా బహుశా మనం భావించాల్సి ఉంటుంది. మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన బంతి ఇప్పుడు తెరాస కోర్టులోకి నెట్టబడింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలతీర్థం పుచ్చుకోవడం అనేది అనూహ్యం, కొత్త విషయం కానేకాదు. చాలాకాలంగా ఆయన సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. మొత్తానికి ఇప్పటికి కాంగ్రెస్ కు రాంరాం చెప్పడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఆయన బహిరంగంగా కమలకీర్తనం మొదలెట్టిన తర్వాత కూడా ఆయన మీద పార్టీ పరంగా క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి సుదీర్ఘకాలమూ, ఆయన తనంతగా రాజీనామా చేసేవరకూ, వెనుకాడడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన బలహీనతను బయటపెట్టుకుంది.
మొత్తానికి కోమటిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఒకటిరెండు రోజుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామాను కూడా స్పీకరుకు సమర్పిస్తానని ఆయన ప్రకటించారు. ఎటూ ఆయన ఉపఎన్నికను కోరుకుంటున్నారు గనుక.. ఉప ఎన్నిక ద్వారా.. మునుగోడులో మళ్లీ గెలిచి.. తాను బలమైన నేతనని బిజెపికి ఒక సంకేతం ఇవ్వదలచుకుంటారు గనుక.. ఆయన స్పీకరు ఫార్మాట్ లోనే రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. అయితే స్పీకరు దానిని ఆమోదించాలి.. అనంతరం, మునుగోడు స్థానం ఖాళీ అయినట్లుగా నోటిఫై చేయాలి.. ఆ తర్వాత.. ఎన్నికల సంఘం పరిధిలోకి వ్యవహారం వెళ్లి ఉపఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది.
ఆమోదించకుండా జాగు చేయడానికి స్పీకరుకు అవకాశం ఉంది. అదే జరిగితే.. ఉప ఎన్నిక రావడానికి టీఆర్ఎస్ భయపడుతోందని.. కోమటిరెడ్డి రెచ్చిపోయే అవకాశం ఉంది. రాజీనామాను ఆమోదిస్తే.. ఆయనను ఎదుర్కొని విజయం సాధించాలి. అది టీఆర్ ఎస్ కు అగ్ని పరీక్ష! అలా ఎటూ నిర్ణయం తీసుకోలేని ఇరకాటం స్థితిలోకి కోమటిరెడ్డి అధికార పార్టీని నెట్టారు.
దుబ్బాక, నాగార్జున సాగర్ వంటి ఉపఎన్నికలు వచ్చిన నేపథ్యం వేరు. కానీ సిటింగ్ ఎమ్మెల్యే రాజీనామా వల్ల ఉపఎన్నిక రావడం.. అక్కడ మళ్లీ అదే నాయకుడు మరో పార్టీ తరఫున పోటీచేయడం అనే ఉపఎన్నిక ఈ విడతలో తెలంగాణలో రాలేదు. కాబట్టి.. బలాబలాలు తేల్చుకోవడానికి ఇది కీలక రణరంగం అవుతుంది.
.