దాగుడుమూతలు, తొక్కుడుబిళ్ళ, గోళీలాట, కర్రబిళ్ళ, దొంగపోలీసు, చెమ్మాచెక్క, అచ్చాబొమ్మా,, ఇసుకలో ఇల్లుకట్టడం, గచ్చికాయఆట, పుస్తకాల పేజీలలో నెమలీక లాంటి… ఆటలు నాటి పిల్లలు ఎంతో సరదాగా, ఉల్లాసంగా, సంతోషంగా ఆడుకునేవారు. మరి ఆ ఆటలు.. నేటి పిల్లల్లో మసకబారాయి ఎందుకో…?
బిక్కిపండ్లు, ఈతపండ్లు, పీచుమిఠాయి, పుల్లఐసు, సేమియా ఐసు, రేగిపండ్లు, నేరేడిపండ్లు, తేగలు, తాటినుంజులు, ఉప్పుశనగలు, బటానీలు, కారంపూసిన మామిడిదబ్బలు, గెనిసిగడ్డలు, ఆల్వాల్ గడ్డలు, అరినెల్లికాయలు, బొరుగుంటలు, కమ్మరకట్టులు, జీరాఉండలు లాంటి.. ఆహారపదార్థాలు నాటి పాఠశాల పరిసరాలలో… ఇంటర్వెల్ కి అందుబాటులో ఉండేవి. మరి ఆ మధుర ఫలాలు నేటి పాఠశాల పరిసరాలలో మసకబారాయి ఎందుకో…?
కచ్చి- పండు, జూట్, అంబాలీస్, అచ్చా?బొమ్మా?, ఉల్లాకచ్చి, మళ్ళీ ఫస్ట్ నుంచి, అమ్మా సంకా!, ఔట్, నాటౌట్, అంతామోసం, మొండి, నేను ఒప్పుకోను, రేయ్! వాడువస్తే నేను రానురా, వే! అమ్మాయితో నేను ఆడను పోవే లాంటి.. పదాలు వెనుకటిరోజుల్లో పిల్లలు ఆడుకునేటప్పుడు వినిపించేవి. మరి ఆ మధుర పలుకులు నేటి పిల్లల పలుకుల్లో మసకబారాయి ఎందుకో…?
కట్టెలపొయ్యి, రాగిబిందె, రాగి చెంబులు, మట్టికుండ, వెన్నఉట్టి, ఇత్తడిఅండాలు, లాంతర్లు, కిరసనాయిలు బుడ్డీలు, తిరగలి, రుబ్బురోలు, రోకలిబండ, కుంపటి, నులకమంచం, సిరిచాపలు, విసనకర్రలు, పేడ అలికిన మట్టినేల, పశువులకొట్టం, పాడి ఆవులు, పచ్చిగడ్డి, నాటుకోళ్లు, తౌవుడు, నీళ్ళు కాసుకునే బొగ్గుల బాయిలర్, చెక్కపిడి ఉండే ఇనుపకత్తి, చెక్కపీటలు, ఇంటివెనుక పెరడు, గంధం నూరుకునే సాన, ఇంటిముందు పెద్ద అరుగులు, ఎద్దులబండ్లు.. లాంటివి ప్రతి ఇంటికి సహజ సౌందర్యాన్ని ఇచ్చేవి. మరి నేడు ఆ అపురూపమైన సహజసంపదలు మసకబారాయి ఎందుకో…?
సద్దన్నం, దద్దోజనం, రాగిసంగటి, జొన్నరొట్టె, చక్కెర పొంగలి, బెల్లపన్నం, మిరియాల పొంగలి, పాయసం, పానకం, ఆవిరి కుడుములు,అరిసెలు, పూర్ణాలు, చింతపండు నేతి పుళిహోర, సున్నుండలు, బొప్పట్లు, జంతికలు, పప్పుచెక్కలు, సేమిరిపెరుగు, స్వచ్ఛమైన నెయ్యి, రవ్వలడ్డులు, నువ్వుండలు, కారం-కరివేపాకు పొడులు, ఆవకాయ ఊరగాయ, అల్లం పచ్చళ్లు..లాంటి ఆయువును పెంచే ఆహారపు పదార్థాలు వాడుకలో ఉండేవి. మరి అవి నేడు మసకబారాయి ఎందుకో…?
విభూతిరేఖలు, తిలకధారణ, పంచెకట్టు, ధోవతికట్టు, సంధ్యావందనం, సత్గ్రంథాల పఠనం, చెరువుల్లో యువకుల ఈతల సరదాలు, ఈతచెట్ల కింద పెద్దోళ్ళ ‘కల్లు’ బొల్లిమాటలు, అతిథిమర్యాదలు, వీధిఅరుగులపై ముచ్చట్లు, హరికథా కాలక్షేపాలు, హరిదాసుగీతాలు, యజ్ఞయాగాదులు, వేదమంత్రాలు, తలంటిస్నానాలు, తాంబూలాలు, సహపంక్తి భోజనాలు, పతికోసం సతి గుమ్మం దగ్గర ఎదురుచూపులు, స్త్రీ సిగలో సిరిమల్లెల సుగంధాలు, పడచుపిల్లల పట్టు పరికిణీలు, తాటాకు పందిళ్ళు, ముంగిళ్ళలో ముత్యాలముగ్గులు.. లాంటి సంస్కృతి, సంప్రదాయాలతో పల్లెసీమలు శోభాయమానంగా ఉండేవి. మరి ఆ వైభవాలు నేడు మసకబారాయి ఎందుకో…?
అన్నదమ్ముల అనుబంధాలు, అక్కాచెల్లెళ్ల ఆత్మీయతలు, అమ్మానాన్నల పట్ల పిల్లలకున్న అభిమానాలు, అవ్వాతాతల ముదిగారాలు, అక్కాబావల ఛలోక్తులు, మామాఅల్లుళ్ళ చమత్కారాలు, వరుసలు కలిపే పల్లెప్రజలు, ఉమ్మడి కుటుంబాల ఉల్లాసాలు, తాతామనమళ్ళ కథలు- కబుర్లు, బాధల్లో ఆదుకునే బంధువులు, సంక్లిష్ట పరిస్థితులలో స్నేహహస్తం అందించే స్నేహితులు, కల్మషంలేని కరచాలాలు, ఫలితం ఆశించని పలకరింపులు, అక్షరజ్ఞానంలేని అమ్మలక్కలు – పంటపొలాల్లో లయబద్దంగా పాడే పాటలు నేడు మసకబారాయి ఎందుకో…?
మరి ఆ మధురస్మృతులు మసకబారడానికి కారణం మారిన కాలమాన పరిస్థితులుతోపాటు మనిషి మనసు పొరల్లో చొరబడిన విషబీజాలేనని చెప్పడానికి నేను సందేహించను.
ఎందుకంటే…
మన విద్యావ్యవస్థ గాడితప్పడం, సనాతనధర్మం యొక్క వైశిష్ట్యాన్ని గురించి చిన్నతనం నుంచే విద్యార్థులలో అవగాహన కలిగించకపోవడం, సుమతి శతకం, వేమన పద్యాలు, పంచతంత్ర కథలు..వంటి నైతికవిలువలు పెంచే విషయాలను విద్యార్థుల అంతరంగాలలో స్థిరస్థాయిగా నిలచిపోయేలా బోధించకపోవడం, పాశ్చాత్య సంస్కృతి, సంప్రదాయాల పట్ల మనం ఆకర్షింపబడడం, విపరీతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం…తదితర కారణాలతో మనకు తెలియకుండానే మనలో విషబీజాలు నాటుకుపోయాయి. అంచేతనే మన మధురస్మృతులు మసకబారాయి.
మరి ఆ మధురస్మృతులు మళ్ళీ మన ముందు సాక్షాత్కరింపబడాలంటే… ఏంచెయ్యాలి…?
తిరుగుప్రయాణం చెయ్యాల్సిందే. అంటే.. మళ్ళీ మన గురుకులాలను పునర్మించడం, అవగాహనతో కూడిన అభ్యసనం, గురువులు – పెద్దలపట్ల గౌరవభావం కలిగిఉండడం, మన సంస్కృతి, సంప్రదాయాలను పాటించడం, మన సాహిత్య గ్రంథాలు (సుమతి శతకం, వేమన పద్యాలు, భగవద్గీత, పంచతంత్ర కథలు..) వంటివి పఠనం చేయడం, సాంకేతికతను భారతీయ సంస్కృతికి విఘాతం కలగకుండా సరైనమార్గంలో వినియోగించడం… వంటివి చేయగలిగితే మళ్ళీ ఆ మధురస్మృతులు మన కళ్ళ ముందు ఖచ్చితంగా సాక్షాత్కరింపబడతాయి.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
.
Discussion about this post