మనం పురాతనకాలం నుండి ఓంకారాన్ని పలుకుతున్నాం. చాలామంది ఓంకారం అనేది కేవలం ఒక మతానికి సంబంధించిన శబ్దంగా భావిస్తారు. కానీ అది మతాలకు అతీతమైనదిగా చెప్పవచ్చు.
ఓంకారాన్ని పలకడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని అనేక పరిశోధనలో వెల్లడయింది. అందుకే కేవలం భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాల్లో కూడా ఓంకార నాదాన్ని పలుకుతూ, తమ ఆరోగ్యాలను పదిలంగా పదికాలాలపాటు ఉండేలా ప్రజలు చూసుకుంటున్నారు.
ఇంతకీ ఓంకారాన్ని పలకడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేమిటో చూద్దామా..
మనలో చాలామందికి రోజూ ధ్యానం చేయాలని, యోగా చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ సమయాభావం వల్లనో, లేక ఓపిక లేకపోవడం వల్లనో, పనుల ఒత్తిడి వల్లనో ఏదేమైనాకావచ్చు.. కానీ చాలామంది ధ్యానం చేయడం అనేది జరగదు. కానీ కొందరు ఏదో ఒక సమయంలో ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారు ధ్యాన స్థితిలో ఉన్న సమయంలో ఓంకారాన్ని పలకడం వల్ల చాలా లాభాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
సాధారణంగా మనం ధ్యాన స్థితికి కూర్చున్న తరువాత చాలామందికి ధ్యానస్థితిలో స్థిరంగా కూర్చోలేకపోతారు. అంటే వారు తమ మనసును ఏకాగ్రతగా ఉంచలేకపోతారు. అలాంటి వారు చాలామంది సంగీతాన్ని వింటూనో.. లేదా మరేదైనా వాయిద్యానికి సంబంధించిన ధ్వనిని వింటూనో ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు. అలాకాకుండా కేవలం ఓంకార నాదాన్ని చేస్తూ ధ్యానానికి ప్రయత్నించి చూడండి. మీకు వెంటనే ఏకాగ్రత కుదురుతుంది. ఇలాంటి స్థితిలో మన మనసును ఓంకారం అదుపులో ఉంచి, ఇతర విషయాలేవీ మన మనసులోకి రాకుండా చేస్తుంది.
ఓంకార జపం చేస్తూ మన ధ్యానస్థితికి కూర్చోవడం వల్ల ఒకవైపు ధ్యానం చేయడానికి ఏకాగ్రత కుదరడంతోపాటు మరోవైపు మనకు చక్కటి ప్రాణాయామం జరిగి మన ఊపిరితిత్తులు కూడా పరిశుభ్రమవుతాయి.
కాసేపు ఓంకారనాదం చేస్తూ మనం ధ్యానం చేసినట్లయితే దాని ప్రభావం వల్ల మనకు మానసికమైన ప్రశాంతత లభించడంతోబాటు మనలోని ఒత్తిడిని దూరం చేస్తుంది. మనం ఎలాంటి ఒత్తిడికి లోనైనా కొద్దిసేపు ఓంకారనాదంతో ధ్యానం చేసి చూడండి.. మీకు ఎంతటి ప్రశాంతత లభిస్తుందో గమనించండి..
ఓంకారాన్ని కాసేపు పలకడం వల్ల మన మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఓంకారాన్ని పలకడం వల్ల మెదడులో రక్తసరఫరా మెరుగుపడి, మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుందట. మనలోని ఆలోచనలకు మూలం మెదడు. అలాంటి మెదడు ఆరోగ్యంగా ఉండడం వల్ల మనకు చక్కటి ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆలోచనల వల్ల మన ప్రవర్థన కూడా చక్కగా ఉంటుందని వేరే చెప్పాలా..
ఓంకారాన్ని నిత్యం చెబుతూ ఉండడం వల్ల మన మనోభావాలను అదుపులో ఉంచుకోగలుగుతాము. అలాగే ఓంకారాన్ని సక్రమంగా పలకగలిగితే దాని ప్రభావం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా దూరం కాగలవు.
ముఖ్యంగా యోగా, లేదా ధ్యానం చేయాలనుకునేవారు ముందుగా ఓంకార జపాన్ని చేయడం వల్ల వారికి చక్కటి ఏకాగ్రత కుదురుతుంది. అలాగే శ్వాసకు సంబంధించి చక్కటి వ్యాయామం కూడా జరుగుతుంది.
మనం బాహ్య శారీరక ఆరోగ్యం కోసం యోగా, లేదా వేరే రకాలైన వ్యాయామాలను మనం చేస్తుంటాం. దానివల్ల మన శారీరక ఆరోగ్యం దృఢంగా తయారవుతుంది. కానీ మన శరీరాన్ని చక్కగా నడపడానికి మన శరీరంలో ప్రధానమైన భాగం మన గుండె. దానిని చక్కగా పనిచేయించేలా చేసేది ఊపిరితిత్తులు. మరి బాహ్య ఆరోగ్యం గురించి ఆలోచించే మనం అంతర ఆరోగ్యాన్ని గురించి కాస్త పట్టించుకోవాలికదా.. ఓంకార నాదాన్ని చేయడం వల్ల మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఫలితంగా మన శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ఇటీవల మనందరినీ భయభ్రాంతులకు గురిచేసే మహమ్మారి కరోనా.. ఈ వ్యాధి సోకిన వారికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మరణాలు సంభవించడం మనం రోజూ పేపర్లలో చూశాం.. చదివాం. అదే సమయంలో ఓంకారాన్ని పలకడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరిగినట్లు చూసే వీడియోలు వైరల్ కావడం కూడా మనం చూశాం. ఏతా వాతా తేలిందేమంటే.. ఓంకార నాదాన్ని పలకడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడి, మన ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయని చెప్పవచ్చు.
మన ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని ఓంకార నాదాన్ని ప్రారంభించడం వల్ల ఊపిరితిత్తులు కూడా వ్యాకోచించి, శ్వాసకోస సంబంధ సమస్యలను నుండి బయటపడవచ్చు.
ఇంతటి లాభాలను మనకు అందించే ఓంకార నాదాన్ని మనం కూడా చేయడం వల్ల మనకు చక్కటి ఆరోగ్యం, అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఓంకార నాదం చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. కాబట్టి ఇది కేవలం ఒక మతానికి సంబంధించినది అనుకోకుండా అందరూ కాస్త సాధన చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చుకదా..! ఏమంటారు?
-అన్నపూర్ణ
.

Discussion about this post