భారతీయ జనతా పార్టీ ఆఫ్గనిస్తాన్ లోని తాలిబన్లనే ఆదర్శంగా తీసుకుంటోందా? మతం ప్రాతిపదికగా.. తమకు కిట్టని మతానికి చెందిన వారి ఆనవాళ్లను సమూలంగా తుడిచిపెట్టేయడమే ధ్యేయంగా చెలరేగుతోందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాటలు వింటే మాత్రం అవుననే అనిపిస్తుంది.
గుంటూరులో జిన్నాటవర్ ను కూల్చేయాలని అంటున్న భారతీయ జనతా పార్టీ తాలిబన్లను ఆదర్శంగా తీసుకోరాదని తాలిబన్లు బౌద్ధమత విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో మత విద్వేషం తో ప్రాచీన కట్టడాలను ధ్వంసం చేయడం భారతీయ ధర్మానికి విరుద్ధమని కృష్ణదేవరాయలు హితవు చెబుతున్నారు.
బీజేపీ వ్యతిరేక శక్తులు రకరకాల రూపాల్లో మార్గాల్లో ఏకం కావడానికి బీజేపీ సోము వీర్రాజు చక్కటి అవకాశం ఇచ్చారు. జిన్నా సెంటర్ పేరు మార్చడం, జిన్నా టవర్ కూల్చడం అనే వివాదాలను ప్రారంభించి.. ఆయన ప్రత్యర్థుల్ని ఏకం చేస్తున్నారు. గుంటూరులో జనవిజ్ఞానవేదిక వాళ్లు.. డైరక్టుగా ఈ అంశంపై అన్నట్టుగా కాకుండా.. మద్యవిమోచన కమిటీ ఆధ్వర్యంలో.. ప్రాచీన కట్టడాల పరిరక్షణ కోసం ఒక సమావేశం నిర్వహించారు. అయితే అందులో ప్రధాన ఎజెండా మాత్రం జిన్నా టవరే.
ఆ కార్యక్రమానికి వచ్చిన ఎంపి శ్రీకృష్ణ దేవరాయలు.. బీజేపీని మతవాద పార్టీగా ఒక రేంజిలో విమర్శించారు. ఇండోనేషియా, మలేషియా, జపాన్ లాంటి దేశాలలో హిందూ దేవాలయాలు హిందూ సంస్కృతిని కొనసాగిస్తున్నాయని తెలిపారు. ముస్లింలు అధికంగా ఉన్న ఇండోనేషియాలో సైతం హిందూ దేవాలయాలను కాపాడడం గొప్ప పరిణామమన్నారు. గుంటూరు నగరంలోని జిన్నా టవర్ సెంటర్ ను మతోన్మాదుల నుండి కాపాడుకోవడం పౌరసమాజ కర్తవ్యం అంటూ.. డైరక్టుగానే బీజేపీ పరువు తీశారు.
జిన్నా సెంటర్ వివాదం కంటె.. చీప్ లిక్కర్ వివాదంలో మునిగి ఉండడమే తమకు తక్కువ నష్టం చేసేది.. అని బీజేపీ నాయకులే అనుకునేలాగా పరిణామాలు మారుతున్నాయి. సోము వీర్రాజు పుణ్యమాని అందరూ గుంటూరులో ఎగబడి మరీ జిన్నాను కీర్తిస్తున్నారు. జిన్నా స్వాతంత్ర్యపోరాటంలో ఈ దేశానికి చేసిన సేవ గురించి.. కష్టపడి వివరాలు తెలుసుకుంటున్నారు. జిన్నా మహానుభావుడని.. ఆయన గురించి ఏమీ తెలియని వారు కూడా.. జనాంతికంగా కామెంట్ చేసేస్తున్నారు. ఈ రీతిగా.. హఠాత్తుగా, అసందర్భంగా.. మహ్మద్ ఆలీ జిన్నాకు ఎనలేని కీర్తిని కట్టబెట్టడమే లక్ష్యంగా.. సోము వీర్రాజు ఈ ప్రకటనను చేసినట్టుగా వ్యవహారం పరిణమిస్తోంది. హతవిధీ!
.

Discussion about this post