పురాణగాథలు జరిగాయా? లేదా? అని సందేహం అవసరం లేదు. జరగడం-జరక్కపోవడం ఈ రెంటికీ ఆవలి విషయం అది. అది తాత్త్విక విషయం. మన తేదీలకు, మన ప్రాంతాలకు ఇమడని విషయం. యోగులు యోగపరంగా దర్శిస్తారు. జ్ఞానులు తత్త్వపరంగా దర్శిస్తారు. మిగతావారు “పురాణ కాలక్షేపంగా” ఉపయోగిస్తారు.
ప్రస్తుతం మనం కూడా జ్ఞానాంబ కథను చందమామ కథలా చెప్పుకుందాం. చంద్రుడూ చేతికి అందడు, దేవుడూ చేతికి అందడు. కానీ వెన్నెలను మనం ఆస్వాదించగలిగినట్లు దేవుని అనుగ్రహాన్ని మనం అనుభవించగలం.
* * *
శివపంచాక్షరీమంత్రాన్ని తనకు ఉపదేశించమని శివుని చేరి గోముగా కోరింది పార్వతి. వద్దు పార్వతీ.. నీవు చంచలవు.. నీకు మంత్రం ఇవ్వడం కుదరదు అన్నాడు శివుడు. పార్వతి అలిగింది. కైలాసంలో ఆనంద తాండవాలకు సెలవయ్యింది. శివుడు ఎంత నచ్చచెప్పినా వినలేదు. శివుడు మంత్రాన్ని ఇవ్వక తప్పలేదు.
అచంచలంగా ఆ మంత్రాన్ని ఉపాసించడం మాని చంచలయై చెలికత్తెను చేరి నా అందచందాలకు మోహితుడై శివుడు నాకు మంత్రమిచ్చాడని మిడిసిపడింది పార్వతి. శివుడు రుద్రుడయ్యాడు. శాపం పెట్టాడు. భూలోకంలో మతిలేనిస్థితిలో పడి ఉండు అని. పార్వతి పశ్చాత్తాపపడింది. శివుణ్ణి శాప విమోచనం కోరింది.
దక్షిణకైలాసమైన శ్రీకాళహస్తిలో సువర్ణముఖరీ నదీ తీరాన శ్రీకాళహస్తీశ్వరుడు అనే పేరుతో నెలకొని ఉన్న నన్ను ఉపాసించి తిరిగి నీ స్వస్థితిని పొందు అన్నాడు శివుడు. పార్వతి తన దివ్యదేహాన్ని తక్షణం వదిలిపెట్టింది. అది శ్రీకాళహస్తిలో ఈశ్వరసన్నిధిలో మారేడు వృక్షమయ్యింది.
మానవ శరీరంతో భూలోకం చేరి, దారి తెలియక అటూ ఇటు తిరుగాడుతూ ఉంటే, మన బుజ్జిగణపతి తల్లి చేయిపట్టుకుని శ్రీకాళహస్తిలో తపోభూమికి చేర్చాడు. అందరికీ దారి చూపే అమ్మకు దారి చూపాడు జ్ఞానశిశువు గణపతి. పార్వతీదేవి తీవ్రతపస్సుతో శివానుగ్రహం సంపాదించి శివజ్ఞానం పొంది “జ్ఞానప్రసూనాంబ” గా శివుని చెంత చేరింది.
* * *
అరుణాచలం భౌతికప్రపంచానికి హృదయం.
అనిలాచలం ఆధ్యాత్మికప్రపంచానికి హృదయం.
* * *
శ్రీకాళహస్తి దేవాలయంలోని అమ్మవారి మూలవిగ్రహం శివపంచాక్షరీ మంత్రాన్ని వింటున్నట్లుగా ఒకవైపు వంగి ఉంటుంది. అందువలన ఈ క్షేత్రంలో అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతుంటాయి. ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించి, జ్ఞానాంబ సన్నిధిలో శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేశారు. పూజారులు కుంకుమార్చనలను శ్రీచక్రంపై వేసి భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఆ కుంకుమ నుదుటన ధరించినవారికి జ్ఞానప్రసూనాంబ సదా తమ వెంటే ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. తత్ఫలితంగా వారికి సకల శుభాలు కలుగుతాయి.
“కాశీలో కనుమూస్తేగానీ రాని మోక్షం కాళహస్తిలో కాలు పెడితే వస్తుంది” అన్న సామెత అక్షర సత్యం. జ్ఞానాంబయే సద్గురువు. జ్ఞానమే శ్రీకాళహస్తి క్షేత్రంలో అధిష్ఠానదేవతై “జ్ఞానప్రసూనాంబిక” గా జ్ఞానప్రకాశాన్ని వెదజల్లుతోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల జ్ఞాని అవతరించినా అది జ్ఞానప్రసూనాంబ జ్ఞానప్రకాశంలోని కిరణమే. ప్రపంచంలోని అందరి జ్ఞానులకూ, అన్ని జ్ఞానాలకూ కేంద్రస్థానం శ్రీకాళహస్తి.
ప్రతీ జ్ఞానీ జ్ఞానాంబ అవతారమే.
ప్రతీ అవతారమూ జ్ఞానాంబ అంశమే.
అటువంటి జ్ఞానావతారములలో ఒకరు – సద్గురు సుబ్రహ్మణ్యం.
* * *
అవతారం దాల్చిన ప్రతి ఒక్కటీ జగన్మాత అయిన పార్వతీ అంశమే. అన్ని ప్రకృతులకు(స్వభావాలకు) ఆధార తత్త్వమై నిరాకార పరబ్రహ్మ స్వరూపమై ఉన్న ఆ పరమపురుషునికి అవతారం దాల్చవలసిన అవసరంగాని, అవకాశంగాని లేదు. రంగులరాట్నానికి మధ్యభాగములో అన్ని గుర్రాల పరుగులకు ఆధారమై, అచలమై ఉన్న స్తంభం వంటివాడు పరమేశ్వరుడు.
* * *
ఊరక ఉండడం పార్వతికి తెలియదు.
కదలడం శివునికి తెలియదు.
ఇద్దరి స్పర్శతో పుట్టినవాడే జీవుడు.
జీవుడు నాణేనికి బొమ్మ బొరుసు వలె చల-అచల ప్రవృత్తులను కలిగి ఉంటాడు. అందువల్లనే జీవుడు బంధ-మోక్షముల మధ్య ఊగిసలాడుతుంటాడు. జీవుడికి శాశ్వతమైన బంధమూ లేదు, శాశ్వతమైన మోక్షమూ లేదు. ఈ లీల అనంతం. “ఎందుకు?” అన్న ప్రశ్న అనవసరం.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
* * *
ఈ అనంతమైన (ఎప్పటికీ ముగింపు లేని) లీలలో భాగంగానే అమ్మ పార్వతి ఈ భువిపై అవతరించి దక్షిణకైలాసమను శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రమున జ్ఞానప్రసూనాంబికయై విరాజిల్లుతోంది. సద్గురు సుబ్రహ్మణ్యుని రూపంలో జ్ఞానప్రబోధం చేస్తూ జిజ్ఞాసువులకు జ్ఞానార్తిని తీరుస్తోంది.
* * *
సముద్రంలో కలిసేవరకు నదికి ఒడిదుడుకులతో కూడిన ప్రవాహం ఉన్నట్టు దేవునిలో కలిసేవరకు జీవునికి సుఖదుఃఖరూపంతో కూడిన సంసారం ఉంటుంది. ‘దేవునికి విడిగా నాకు ఉనికి లేదు, నేను పరిపూర్ణుడను’ అని జీవునికి పూర్ణానుభవం కలిగేవరకు జీవుడు పడే తపనే ఆధ్యాత్మికం అయ్యింది. జీవుని తపన తపస్సుగా మారడానికి ఆ దేవుని ‘శక్తి’ అనేక రూపాలతో ఈ భూమ్మీద అవతరించి అనుగ్రహిస్తుంటుంది.
అందులో ఓ రూపమే – సద్గురు సుబ్రహ్మణ్యం.
శ్రీకాళహస్తి క్షేత్ర అధిష్ఠాన దేవత అయిన జ్ఞానప్రసూనాంబికా దేవి సద్గురువుగా అవతరించి అనుగ్రహించిన దివ్యోపదేశ సుమాలే ఈ జ్ఞానప్రసూనాలు. అమృతపానం చేసిన క్షణమే అమరుడైనట్లు ఈ దివ్యగ్రంథాన్ని పారాయణం చేసిన క్షణమే జ్ఞానానుభవం కలగడం తథ్యం.
* * *
సాధారణంగా పాఠకుడు గ్రంథాన్ని ఎన్నుకొంటాడు. కానీ ఈ గ్రంథం పాఠకుణ్ణి ఎన్నుకొంటుంది.
-జ్ఞానశిశువు
9533667918

.

Discussion about this post