దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి గ్రహణం ఎప్పుడు వీడుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశావహులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని మిగతా ప్రధాన ఆలయాలకు ధర్మకర్తల మండలి ఏర్పాటు ప్రక్రియ పూర్తయినా.. శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయానికి మాత్రం ధర్మకర్తల మండలిని నియమించలేదు.
ఈ ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుంచి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంతలోపు ‘మండలి’ నియమించడం అనుమానమే. ఈ నెల 3న శ్రీశైలం ఆలయానికి కూడా 14మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియమించారు. అయితే శ్రీకాళహస్తి ఆలయం గురించి మాత్రం వదిలేశారు. ప్రభుత్వ తీరుపై ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
చిత్తూరు జిల్లాలో తిరుమల తర్వాత శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఖ్యాతి గాంచింది. నిత్యం వేలాది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఏకైక వాయులింగేశ్వర క్షేత్రం ఇది. రాహు-కేతు పూజల కోసం దేశ విదేశాల నుంచి ఇక్కడకు వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సుమారు ఐదేళ్లుగా ధర్మకర్తల మండలి లేదు.
తెలుగుదేశం హయాంలో నియమించిన ధర్మకర్తల మండలి పదవీ కాలం 2017 సెప్టెంబరు నాటికి ముగిసింది. అప్పటి నుంచి ఈ ఆలయానికి ‘మండలి’ నియమించలేదు. గత ఏడాది జూలైలో సత్యవేడు మాజీ జడ్పీటీసీ బీరేంద్రవర్మను ధర్మకర్తల మండలి ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించింది.
అయితే ధర్మకర్తల మండలి చైర్మన్ పదవిని స్థానికులకు ఇవ్వాలని డిమాండ్ రావడం.. స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా బీరేంద్ర వర్మ నియామకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులను ఆపేసింది. ఈ నేపథ్యంలో బీరేంద్ర వర్మ నియామకం ఆగిపోయింది. ఆ తరువాత వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు పేరు తెరమీదకు వచ్చింది.
ఎమ్మెల్యే బియ్యపు మధు కూడా ఈయనకు మద్దతు ప్రకటించినట్లు జోరుగా ప్రచారం సాగింది. ఇందుకు అనుగుణంగానే బీరేంద్రవర్మకు టిటిడి పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితునిగా స్థానం కల్పించారు. దీంతో ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పదవి అంజూరు శ్రీనివాసులుకు దక్కుతుందని అందరూ భావించారు. అయితే టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో వారి నియామకానికి బ్రేక్ పడింది.
దీంతో ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నియామకం కథ మళ్లీ మొదటికి వచ్చింది. బీరేంద్ర వర్మ ఏదో ఒక పదవి ఇచ్చేవరకు ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి నియామకం జరపకూడదని జిల్లాకు చెందిన ఓ ప్రముఖ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
గత నెలలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి ఆమోదముద్ర వేస్తారని అందరూ భావించారు. అయితే ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున మంత్రిమండలి ప్రత్యేక ఆహ్వానితులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసి ఉంటే ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి విషయం ఒక కొలిక్కి వచ్చి ఉండేది. అయితే ఈ విషయమై మంత్రిమండలి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆశావహులు ముక్కంటి భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతోంది. మొదటి ఏడాదే ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి నియామకం జరుగుతుందని అందరూ భావించారు. అయితే రాజకీయ కారణాల వలన ధర్మకర్తల మండలి నియమించలేదు. వైసీపీ విజయం కోసం పనిచేసిన పలువురు నేతలు ధర్మకర్తల మండలి పదవి కోసం ఆశ పెంచుకున్నారు.
శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి పదవి కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. తమకు అవకాశం కల్పించాలని పలువురు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పై ఒత్తిడి చేస్తున్నారు. కొంతమంది కుల సంఘాల నేతలు తమ బంధువులను ఎమ్మెల్యే వద్దకు తీసుకు వచ్చి వినతులు చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా న్యాయం చేస్తానని బియ్యపు మధు హామీ ఇస్తున్నారు.
అయితే ఆశావహులు ఎక్కువమంది ఉండటంతో పాటు… ప్రధాన ఆలయాలకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారికి కూడా అవకాశం కల్పిస్తుండటంతో ఈ పదవి తమకు దక్కుతుందో లేదోనని కొందరు లోలోన మదన పడుతున్నారు. ‘మండలి’ పదవి తమకు తప్పకుండా దక్కుతుందని కొంత మంది నేతలు మాత్రం ధీమాగా ఉన్నారు.
ఏడాదికి రూ.120కోట్లకు పైగా వార్షిక ఆదాయం ఉండే ముక్కంటి ఆలయానికి ధర్మకర్తల మండలి నియమించి సుమారు ఐదేళ్లు అవుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నపుడు 2015లో పోతుగుంట గురవయ్య నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి నియమించారు. రెండేళ్లపాటు ఈ మండలి కొనసాగింది. వారి పదవీకాలం ముగిసిన తరువాత మళ్లీ పాలకమండలి నియమించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధర్మకర్తల మండలి నియమిస్తారని అందరూ భావించినా రాజకీయ కారణాలతో జాప్యం జరుగుతోంది.
ఈ కారణంగా ఆలయ విషయాల్లో సమగ్ర చర్చ జరగకుండా అధికారులే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాలకుల తీరు కారణంగా శ్రీకాళహస్తిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ధర్మకర్తల మండలి లేకుండా నిర్వహించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ముక్కంటి ఆలయానికి ధర్మకర్తల మండలి వీలైనంత త్వరగా నియమించాల్సిన అవసరం ఉంది.
.

Discussion about this post