భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని, వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్థానం సాగించాలని అనుకన్న జనసేనాని పవన్ కల్యాణ్ కు అప్పుడే వారి మైత్రి పట్ల మొహం మొత్తిందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ అనేది ఇక ఎప్పటికీ చచ్చిన పాము వంటిదే అని.. దానిని మెడలో వేసుకుని ఊరేగితే.. తనకు నష్టం తప్ప లాభం లేదని ఆయన అనుకుంటున్నారా? కమలదళంతో స్నేహం అనేది ముందుముందు గుది బండ అవుతుందని భావిస్తున్నారా?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవునో కాదో గానీ.. విశాఖ ఉక్కు పరిశ్రమ వేదికగా.. భారతీయ జనతా పార్టీపై యుద్ధం ప్రకటించడానికి జనసేనాని పవన్ కల్యాణ్ సిద్ధం అయిపోయారు. స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ మెడలు వంచి పవన్ కల్యాణ్.. విశాఖ వాసుల కల నెరవేరుస్తారని ఆల్రెడీ జనసేనానికి రాజకీయ మార్గదర్శకుడు అయిన నాదెండ్ల మనోహర్ విశాఖలోనే ప్రకటించేశారు కూడా.
విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ అనేది చాలా పెద్ద రగడగా మారుతోంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరిన అన్యాయం చేస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును.. ధారాదత్తం చేసేయడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో రాష్ట్రంలో పాలకపక్షంగానీ, ప్రతిపక్షంగానే.. కేంద్రంతో సున్నం పెట్టుకునే ధైర్యం లేక చేతులెత్తేశాయనే చెప్పాలి.
ఇలాంటి నేపథ్యంలో, కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారుతో స్నేహం, ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీగా హోదా ఉన్నప్పటికీ కూడా.. వాటన్నింటినీ కాలదన్ని, విశాఖ ఉక్కు కోసం.. ప్రత్యక్ష కార్యచరణలోకి దిగాలని జనసేనాని పోరాటానికి రానున్నారనే వార్త.. విశాఖవాసులకు మాత్రమే కాదు, యావత్ తెలుగు ప్రజలకు సంబరం కలిగిస్తుంది. నాదెండ్ల మనోహర్.. వారికి అలాంటి శుభవార్తను ప్రకటించేశారు.
స్టీల్ ప్లాంట్ విషయంలో చాన్నాళ్లుగా మోడీ విధానాలపై పోరాటం జరుగుతూనే ఉన్నప్పటికీ.. పవన్ కల్యాణ్ తరఫు నుంచి నామమాత్రపు స్పందన మాత్రమే ఉంది. ఈ విషయంలో ప్రజలు అసంతృప్తితోనూ ఉన్నారు. అయితే.. నాదెండ్ల మనోహర్ రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ ఎంత తీవ్రంగా బీజేపీపై పోరాడుతారో సంకేతం ఇచ్చేశారు. ‘‘ఇన్ని రోజులు వేచి చూసారు..ఇంకొద్ది రోజులు వేచి చేస్తే స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా పోరాడతారో అందరూ చూస్తారు’’ అన్న ఆయన మాటలు కమలదళానికి హెచ్చరిక లాంటివే.
పైగా నాదెండ్ల మనోహర్.. ‘ఇతర పార్టీలన్నీ అధికార పార్టీపై పోరాటానికి భయపడుతున్నాయని. తాము భయపడడం లేదని’ కూడా ప్రత్యేకంగా చెప్పారు. వచ్చేనెలలోనే విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటన ఉంటుందని కూడా నాదెండ్ల అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాటాన్ని పవన్ ముందుకు తీసుకువెళ్తారని చెప్పారు.
అమిత్ షాను కలిసినప్పుడు కూడా పవన్ దీని గురించి చెప్పారని, తమ నాయకుడిమీద కేసులేమీ లేవని, మాఫీ కోసం ఢిల్లీ వెళ్లరని.. పరోక్షంగా సీఎం జగన్ ను దెప్పిపొడిచారు.
ఇవి కూడా చదవండి
అసలు సిసలు జాతీయ పార్టీ జనసేన మాత్రమే
పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్… సాహిత్య చర్చాప్రవాహం
మౌనంగా ఉండడమే నీ జ్ఞానార్జనకు బాటలు వేస్తుంది.
‘ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఉపాధి వచ్చే విధంగా మంచి నిర్ణయాలు కేంద్రం తీసుకోవాలని’ నాదెండ్ల అనడం.. కేంద్రం వైఖరిని దెప్పిపొడవడమే. గతంలో ఎన్నడూ ఇంత స్పష్టంగా సూటిగా మోడీ సర్కారు వైఖరిని జనసేన తప్పుపట్టింది లేదు. జనసేనకు సంబంధించినంత వరకు.. నాదెండ్ల మనోహర్ విధాన నిర్ణాయక కర్త అనేది అందరికీ తెలుసు! నాదెండ్ల మనోహర్ సూచనలు, సలహాల ప్రకారమే.. పవన్ కల్యాణ్ రాజకీయ పోరాటాల్ని డిజైన్ చేసుకుంటూ ఉంటారు.
ఈనేపథ్యంలో మనోహర్ మాటలను గమనిస్తే.. బీజేపీతో స్పష్టంగా కయ్యం పెట్టుకోవడానికి, వారి విధానాల మీద కాలు దువ్వడానికి పవన్ కల్యాణ్ ఫిక్సయిపోయినట్లు కనిపిస్తోంది.
బీజేపీ అంటే మొహం మొత్తిందా..?
దేశంలో ఉండే ప్రభుత్వ రంగ ఆస్తులు అనేకం ప్రెవేటు రంగానికి విక్రయించేయడానికి మోడీ సర్కారు కంకణం కట్టుకున్న తరుణంలో.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను మాత్రం మినహాయిస్తారని అనుకోవడం భ్రమ. ఆ విషయం తెలిసి కూడా స్పష్టమైన పోరాటానికి పవన్ కల్యాణ్ నడుం బిగిస్తున్నారంటే.. కొత్త సందేహాలు కలుగుతున్నాయి. పవన కల్యాణ్ కు భారతీయ జనతా పార్టీ అంటే మొహం మొత్తిందా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
2019 ఎన్నికల అనంతర పరిణామాల్లో పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కేంద్రంలో మోడీ- అమిత్ షాలతో పవన్ సఖ్యంగానే ఉంటున్నప్పటికీ, రాష్ట్రంలో నాయకులు పవన్ ను పట్టించుకోవడం లేదు.
తిరుపతి ఎంపీ సీటనుంచి జనసేన పోటీచేయాలని గట్టిగా అనుకుంది. పవన్ అందుకోసం ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దలను కలిసివచ్చార కూడా. కానీ.. బీజేపీ రాష్ట్రనాయకులు పొసగనివ్వలేదు. తమ అభ్యర్థిని రంగంలోకి దింపాక, పవన్ తప్పుకున్నారు. కానీ, ప్రచారానికి కూడా వెళ్లారు. బీజేపీకి దారుణమైన అవమానకరమైన పరాజయం ఎదురైంది. మొన్నటికి మొన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కూడా జనసేన అంతో ఇంతో ప్రజాదరణ చూపగలిగింది గానీ.. బీజేపీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంతగా అసహ్యించుకుంటున్నారో బయటపడిపోయింది.
కలిసి నడిస్తే నష్టపోతాం..
ఇలాంటివన్నీ బేరీజు వేసుకున్న తరువాత.. బీజేపీతో కలిసి ముందడుగు వేస్తే.. తమ పుట్టి మునుగుతుందని పవన్ కల్యాణ్ ఫిక్సయినట్టుగా తెలుస్తోంది. సరిగ్గా ఈ సమయంలో.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నడుస్తోంది. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వినతుల్ని ఆమోదించే అవకాశం లేని ఆ అంశాన్ని నెత్తికెత్తుకుని పోరాటం సాగిస్తే.. బీజేపీతో తెగతెంపులు చేసుకోడానికి ఈజీ అవుతుందని పవన్ కోటరీ భావిస్తున్నట్టు సమాచారం.
ఆ రకంగా మోడీ దళానికి రాంరాం చెప్పేస్తే.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే, రాష్ట్ర ప్రజలకోసమే.. ఎంతో బలవంతుడైన మోడీ ప్రభుత్వంతో ఉన్న అపారమైన స్నేహాన్ని త్యాగం చేశానని చెప్పుకోవచ్చునని పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా రాష్ట్రంలో తమ బలం మరింత పెరుగుతుందని.. బీజేపీతో లేని జనసేనను జనం మరింతగా ఇష్టపడతారని పవన్ నమ్ముతున్నట్టుగా ఉంది.
ఆయన వ్యూహం, ఆశిస్తున్న ప్రయోజనం ఏమైనా కావొచ్చు గాక… కానీ.. పవన్ కల్యాణ్ వంటి ఉద్యమశీలి అయిన నాయకుడు స్వయంగా రంగంలోకి దిగి, ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటూ విశాఖ ఉక్కు కోసం సాగుతున్న ఉద్యమం ఇంకో దశకు వెళుతుంది. అది సత్ఫలితాలు సాధిస్తే అంతకంటె కావాల్సింది ఏముంది.
Discussion about this post