పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరి నడుమ సుదీర్ఘంగా సాగిన ఆత్మీయ సంభాషణకు.. ఆలంబన, వేదిక ఏమై ఉండగలదు? సినీ ప్రపంచపు విశేషాలా? చేస్తున్న సినిమాలో లోపాలా? కొత్త సినిమా కథా చర్చలా?
ఇవేమీ కాకుండా.. వారిద్దరూ కేవలం సాహిత్యం గురించి మాత్రమే మాట్లాడుకునే సందర్భం ఎలా ఉంటుంది? సాహితీ పిపాసి- సాహితీ మూర్తి కలిస్తే ఎలా ఉంటుంది? సాహిత్యమే స్ఫూర్తిగా తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే పవన్ కల్యాణ్- సాహిత్యమే శ్వాసగా, ఆలంబనగా తన జీవితాన్నే తీర్చిదిద్దుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరి భేటీ సాహిత్యం మీదనే సాగితే.. ఆ అపురూప సందర్భం ఎలా ఉంటుంది?
అలాంటి అపురూపమైన సందర్భానికి శ్రీశ్రీ మహాప్రస్థానం గురించిన చర్చ వేదిక అయింది.
మనకు మామూలుగా ఇద్దరు వ్యక్తులు కలిస్తే.. ఏం జరుగుతుంది! మూడో వ్యక్తి గురించి నెగటివ్ గా మాట్లాడు కోవడం మాత్రమే ఉంటుంది. లేదా తమతమ రంగాల గురించిన కామన్ విషయాలను మాట్లాడుకోవడం ఉంటుంది. కష్టసుఖాలు, బాధానందాల చర్చ కూడా ఉంటంది.
కానీ ఒక నిరుపమాన సాహిత్య శిఖరం గురించి చర్చించుకోవడం అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది. అది కూడా.. ఒక రంగంలో శిఖరాయమానంగా ఉన్న వ్యక్తులు.. తమ రంగంలో తిరుగులేని కీర్తిని సముపార్జించిన వారు.. కలిసి తమ రంగానికి సంబంధం లేని మరో అభిరుచిని పంచుకోవడం విశేషమే.
పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ల భేటీలో అదే జరిగింది.
శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేక స్మరిణికపై జనసేనాని పవన్ – దర్శక దిగ్గజం త్రివిక్రమ్ సాహిత్యముచ్చట్లే పంచుకున్నారు.
పవన్ కల్యాణ్ గారు… త్రివిక్రమ్ గారు కలసినప్పుడుల్లా ఏం మాట్లాడుకుంటారు? ఏం ముచ్చట్లు చెప్పుకుంటారు? ఏ సంగతులు వారి మాటల ప్రవాహంలో దొర్లుతుంటాయి?
గడియారంలో ముళ్లు సెకన్లు, నిమిషాలు, గంటలు దాటిపోతున్నా వారి చర్చలకు తెరపడదు. జనసేనాని, త్రివిక్రమ్ ల మధ్య సంభాషణా స్రవంతి గోదారి ప్రవాహంలా సాగుతుంది. వారిద్దరూ లోతుగా చర్చించేది సినిమాల గురించా… రాజకీయాల గురించా?
పవన్ కల్యాణ్ , త్రివిక్రమ్ గురించి బాగా తెలిసినవారు – ఆ ఇద్దరూ మాట్లాడుకొంటుంటే అనే మాటలోని అంతరార్థం ఎప్పటికైనా ఒకటే ‘ఆ ఇద్దరూ సాహితీ చర్చల్లో ఉన్నారు’ అని. వారితోనే ఆ మాట అంటే ఈ సాహితీ మిత్రులు కూడా సరదాగా అంటూ ఉంటారు – ‘ఔను… మేం సాహితీ చర్చల మధ్య సినిమాలు చేస్తుంటాం’ అని.
శ్రీశ్రీ సాహిత్యం నుంచి శేషేంద్ర ఆధునిక మహాభారతం వరకూ… చిన్నయసూరి వ్యాకరణం నుంచి తెలుగు శతకాల వరకూ… జాషువా కవిత్వం నుంచి చలం రచనల వరకూ, కొడవటిగంటి కథల నుంచి మధుబాబు డిటెక్టివ్ నవలల వరకూ తెలుగు సాహిత్యం గురించి కబుర్లు సురగంగా ప్రవాహంలా సాగిపోతుంటాయి.
సాహితీ మిత్రులు పవన్ కల్యాణ్, త్రివిక్రం శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం ‘భీమ్లా నాయక్’ సెట్లో మహాకవి శ్రీశ్రీ రచనా వైశిష్ట్యం గురించి… పదాల పరుగులతో పోహళింపుతో చదువరులను చైతన్యపరచడం గురించి, యువతరం రక్తాన్ని వేడెక్కించడం గురించి మాట్లాడుకున్నారు. శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న మహా ప్రస్థానం ప్రత్యేక స్మరణికను పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కు జ్ఞాపికగా అందచేశారు. ఆ పుస్తక ముద్రణ, అందులోని అరుదైన చిత్రాల గురించి వీరు చర్చించుకున్నారు. ‘శ్రీశ్రీ కవిత్వం గురించి రెండు మాటలు చెప్పండి… మీరు చెబితే వచ్చే అందం వేరు’ పవన్ కల్యాణ్ కోరడంతో.. త్రివిక్రమ్ శతాబ్దికే తిరుగులేని సాహిత్యం మహాప్రస్థానం గురించి తన మనసు విప్పి చెప్పారు.
“కవి తాలూకు ప్రయాణం అంటే ఒక జాతి తాలూకు ప్రయాణం. ఆయన వేసిన ఒక అడుగు.. రాసిన ఒక పుస్తకం.. ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటుంది.. చాలా శతాబ్దాలపాటు మాట్లాడుకొంటూనే ఉంటుంది.
ఆయన తాలూకు జ్ఞాపకం మన జాతి పాడుకునే గీతం. శ్రీశ్రీ తెలుగువాళ్లు గర్వించదగ్గ కవి.. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు.. కవికుండాల్సిన ధిషణాహంకారం ఉన్నవాడు.. తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ఆయన పుస్తకం చూడడం నిజంగా గొప్ప విషయం. ఆయన ఆత్మ ఎక్కడున్నా స్వతంత్రం అనే సరికి అక్కడికి వచ్చి ఆగుతుంది” అన్నారు.
ఇందుకు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘ఒక కవి గురించి మరో కవి చెబితే వచ్చే సొబగు ఇది’ అంటే కితాబు ఇవ్వడం విశేషం. వెంటనే శ్రీ త్రివిక్రమ్ గారు స్పందించి ‘శ్రీశ్రీ అంటే ఒక సమున్నత శిఖరం. మనందరం ఆ శిఖరం దగ్గరి గులక రాళ్లు’ అన్నారు.
ఇలా సాగింది… జనసేనాని – త్రివిక్రంల మధ్య చిన్నపాటి సాహితీ చర్చ.
కానీ విద్వత్తు ఎక్కడ ఉన్నా సరే.. దానిని సమున్నంగా గౌరవించే అసమానమైన పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం.. తనలో ఎంత విద్వత్తు ఉన్నా సరే ఇతరులను గౌరవిస్తూ ఒదిగి ఉండే త్రివిక్రమ్ వినయం రెండూ ఈ భేటీలో గొప్పగానే పరిమళించాయి.
.

Discussion about this post