వైఎస్సార్ కాంగ్రెస్ మీద తొలినుంచి విరుచుకుపడుతున్న పవన్ కల్యాణ్.. ఆ పార్టీ ఎన్డీయేలో చేరి కేంద్రంలో భాగస్వామి అవుతుందనే తాజా పుకార్ల మీద స్పందించారు. వాటిని ఆయన కొట్టి పారేశారు. అలాగే అమరావతి తరలింపు అసాధ్యం అని కూడా సెలవిచ్చారు.
రాజధాని అమరావతి పై జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. ఆంధ్రుల రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించే విషయమై బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని పవన్ కళ్యాణ్ ఆదివారం వెల్లడించారు.
అంతేకాక మరో బాంబు పేల్చారు. ఎన్డీఏ లోకి వైసిపి రాదని స్పష్టం చేశారు. ఎన్డీఏలో వైసిపి చేరుతోందని కేవలం ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారమే నని కొట్టిపారేశారు. ఒకవేళ ఎన్డీఏలోకి వైసిపి వస్తే తాను బీజేపీతో తెగతెంపులు చేసుకుంటానని స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి ని కొనసాగించే విషయమై బిజెపి పెద్దలతో కలిసి ఉద్యమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ రాజధానిని మరో చోటుకు తరలిస్తే తాము మళ్లీ అమరావతికి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటనపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. బిజెపి అధిష్టానం నుంచి గట్టి హామీ లేనిదే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరు. దీనిని బట్టి రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి. ఎన్డీఏ లోకి వైసిపి వస్తే బిజెపికి జనసేన రాం రాం చెబుతుంది. రాజధానిగా భవిష్యత్తులో అమరావతి కొనసాగుతుంది. ఈ రెండు విషయాల్లో బిజెపి నేతల కంటే పవన్కళ్యాణ్ స్పష్టత ఇవ్వడం గమనార్హం. జనసేన పార్టీని వదులుకొని వైసీపీతో బిజెపి జత కలిసే అవకాశం ఉందో లేదో త్వరలోనే తేలిపోతుంది.
పవన్ చెబుతున్నది నిజమే అయితే.. రాజధాని తరలింపునకు కేంద్రం వ్యతిరేకంగా ఉన్నట్లే అనుకోవాలి. అలాంటి హామీ పవన్ కు ముందుగానే దక్కిఉంటే గనుక.. ఏదో ఒక రకంగా రాజధాని ఆగుతుంది. రాజధాని తరలడం గురించి, ఢిల్లీ వెళ్లి పెద్దలను కలవడం ద్వారా ఉండగల ఇతర ప్రయోజనాల గురించి.. వైకాపా నాయకులు ఆశపడుతున్నదంతా నీరుగారిపోతుంది.
.