‘అన్నా… తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ వీక్ గా అర్థం చేసుకున్నారమ్మా’ అంటూ రేసుగుర్రం సినిమాలో పోసాని కృష్ణమురళి మీడియా వాళ్ల మీద ఒక సెటైరు వేస్తాడు. అలాంటి సెటైర్లు వేయడంలో స్వయంగా రచయిత, దర్శకుడు, నటుడు కూడా అయిన పోసాని సిద్ధహస్తుడు. ఆయన పేర్కొన్నట్టుగా సదరు ‘తెలుగూ టూ తెలుగూ ట్రాన్స్లేషన్’ సంగతేమో గానీ.. ఆయన విషయానికి వస్తే.. ‘కన్ను టూ నోరూ.. ట్రాన్స్లేషన్లో మాత్రం ఆయన చాలా వీక్ అని అర్థమైపోతోంది. తెలంగాణ అభివృద్ధిని ఆయన ఏం చూశారో.. ఆయన నోటితో ఏం చెబుతున్నారో గమనిస్తే ఎవరికైనా ఈ సందేహం వస్తుంది.
పోసాని కృష్ణమురళి అనగానే మనకు ఆయన వే ఆఫ్ డైలాగ్ డెలివరీ… ’అన్నా…‘, ‘ఐ లవ్ యూ రాజా’ వంటివి గుర్తుకొస్తాయి. ఏ విషయంలోనైనా తన మనసులో ఉన్నది (?!) ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం ఆయన నైజం. అలాగే అధికారంలో ఉన్న పార్టీకి బాకాలు ఊదడం కూడా ఆయన స్వభావం. అటు ఆంధ్రాలోనైతే జగన్ మోహన్ రెడ్డి ఎంతో చేశాడని గొప్పగా అక్కడి సిఎంను ఆకాశానికి ఎత్తేస్తాడు. ఇటు తెలంగాణలో కేసీఆర్ ను మించిన సిఎం లేడంటూ ఈయనను ఆకాశానికి ఎత్తేస్తాడు. మొత్తానికి పోసాని నోట్టోకి వెళ్తే ఆయనకు ఇష్టమైతే ఆకాశానికే… లేదంటే… చిత్తం వచ్చినట్టు విమర్శించేస్తారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ… రానున్న గ్రేటర్ ఎన్నికల్లో అందరూ కూడా తెరాసకు ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు.
అయితే తెరాసకే ఎందుకు ఓటు వేయాలనే విషయంలో కూడా ఆయన ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు గడచిన ఆరేళ్ల కాలంలో హైదరాబాద్ ఎంతగానో అభివృద్ధి సాధించిందని, ఇదే అభివృద్ధి ఇంకా కొనసాగాలంటే తెరాసకే ఓటు వేయాలని ఆయన చెబుతున్నారు. అయితే అభివృద్ధి అంటే ఏ రకమైన అభివృద్ధి అనే విషయం పోసాని కాస్త క్లారిటీ ఇవ్వాలి. అసలు అలాంటి క్లారిటీ ఆయనకైనా ఉందో లేదో తెలియదు.
అసలు హైదరాబాదే కాదు.. మొత్తం తెలంగాణకు సంబంధించి ఏ విషయంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే విషయం అసలు పోసానికి తెలుసా అనేది సందేహించాల్సిన విషయం. బంగారు తెలంగాణ వస్తే… ఇంటికో ఉద్యోగం అని అప్పట్లో కేసీఆర్ ఎన్నికల హామీ ఇచ్చారు… మరి ఈ ఆరేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగ నియామకాలు జరిగాయో పోసానికి తెలుసా..? ఎందరో నిరుద్యోగులు ఏజ్ బార్ అయిపోవడంతో సర్కారీ నౌకరీ వస్తుందని చూసి చూసి… చివరికి ఏదో చిన్న కంపెనీ ఉద్యోగాల్లో కుదురుకున్నారు.
ప్రజలకు గొర్రెలను, బర్రెలను పంచుతున్నారు. చదువు గురించి పెద్దగా శ్రద్ధ చూపింది లేదు… ఆయన పంచే గొర్రెలు, బర్రెలను చూసుకోవడానికి కుటుంబంలో పెద్దవాళ్లకు కుదరదు… కాబట్టి బడికి వెళ్లాల్సిన పిల్లలు వాటిని కాచుకోవడానికి వెళ్లిపోతున్నారు. అంటే చదువుకుని జ్ఞానం సంపాదించుకుంటే… మళ్లీ వాడు మేధావి అయిపోతాడు కాబట్టి ఇలా పిల్లలను చదవుకు దూరం చేస్తున్నారు. విద్యాభివృద్ధి విషయంలో ఏదో తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, నిధుల కొరత కారణంగా ఇవి మందకొడిగా సాగుతున్నాయని పోసాని చెబుతున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే సంపన్న రాష్ట్రాల్లో చోటు సంపాదించుకున్న తెలంగాణ అప్పుడే ఆరేళ్ల కాలంలోనే దివాళాతీసేసిందా…? ఎందుకు దివాళాతీసింది…? కారణం ఏంటి…? ఈ విషయం గురించి పోసానికి తెలుసా…?
వరదలు వస్తే కేసీఆర్ ఏదో చేశాడని పోసాని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగారు ఏం చేశారు? కనీసం తన బంగళాలోంచి అడుగు బయటపెట్టి.. ఒక్క ముంపు ప్రాంతానికైనా వెళ్లి ప్రజలను పరామర్శించారా? వరదలు వచ్చి పోయిన రెండు నెలలకు వరద బాధితులకు నష్ట పరిహారం ఇవ్వడానికి చర్యలు ప్రారంభించారు.
తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక గురించిన ప్రత్యేక కథనాలుచదవండి : దుబ్బాక ఓటమి జగన్మోహనరెడ్డికి పాఠం నేర్పిందా? కొత్త ఆలోచన ఇచ్చిందా? జగన్ నిర్ణయంతో ప్రత్యర్థులు ఆత్మరక్షణలో పడిపోయారా ఎవరీ గురుమూర్తి.. ఎంపీ కేండేటు ఎలా అయ్యాడు?
అయితే ఇందులో కూడా మతలబు ఉంది. ఇప్పుడు ఈ వరద నష్టపరిహారం పంచడం అనేది గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి ప్రారంభించారు అని చెప్పవచ్చు. సరిగ్గా పంపిణీ సమయంలోనే ఎన్నికల కోడ్ రావడంతో పాపం పంపిణీకి బ్రేక్ పడింది. దీంతో తెరాసకు ఓటు వేస్తే వరద నష్టపరిహారం వస్తుందని ప్రజలు భావించిఓటు వేస్తారని అందరూ అనుకుంటారు. అయితే ప్రజలేమంత పిచ్చోళ్లు కారు… వారు కూడా ఆలోచిస్తున్నారు. ప్రతిఎన్నికల్లోననూ తమదైన ప్రత్యేకతను చూపిస్తూ…. నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. తమకు నచ్చిన వారిని ఎన్నుకుంటున్నారు. ఈ విషయాన్ని పోసాని గుర్తుంచుకుంటే మంచిది.
అయినా… మీకు సీఎం భజన చేయాలంటే ఆయన వెంటనే తిరుగుతూ భజిస్తే మంచిది… అంతేకానీ… తెలిసీ తెలియని విషయాల గురించి ప్రజలకు చెప్పాలనుకుంటే వాళ్లు సినిమాలో మిమ్మల్ని చూసి నవ్వినట్టే…ఇప్పుడు కూడా నవ్వుకుంటారు. అంతే…!
జీహెచ్ఎంసీ ఎన్నికల సమగ్రా వార్తా విశ్లేషణల కోసం CLICK చేయండి :
.

Discussion about this post