ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తనకు తెలుసునని ప్రధాని నరేంద్రమోడీ నిరూపించుకున్నారు. ఏడాది రోజులుగా అన్నదాతలు సాగిస్తున్న అవిరళ పోరాటానికి తలొగ్గారు. రైతులకు ఇష్టం లేనప్పుడు.. తాను తీసుకున్న నిర్ణయం తప్పు అని ఒప్పుకోవడానికి, దాన్ని ఉపసంహరించుకోవడానికి ఎలాంటి సంకోచం లేదని ఆయన నిరూపించుకున్నారు. ‘రైతు వ్యతిరేక’ ముద్రను సొంతం చేసుకున్న మూడు వ్యవసాయ చట్టాలను బేషరతుగా రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.
శుక్రవారం నాడు జాతినుద్దేశించి ప్రసంగిచిన నరేంద్రమోడీ వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఈ చట్టాల రద్దు జరుగుతుందని కూడా వెల్లడించారు.
ఏడాదిగా పోరాటం సాగిస్తున్న రైతులు అంతిమ విజయం సాధించారు. ప్రభుత్వం ఎన్ని రకాలు నచ్చజెప్పాలని చూసినా, వారికి తెలియజెప్పాలని అనుకున్నా.. చట్టాల రద్దు తప్ప.. మరొక ప్రత్యామ్నయా డిమాండ్ లేనేలేదని భీష్మించుకున్న అన్నదాతలదే ఈ విజయం. ప్రభుత్వంతో చర్చలకువెళ్లి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనాలు కూడా తినకుండా వారు తమ పంతం ప్రదర్శించారు. లాఠీచార్జీలు, కాల్పులతో భయపెట్టాలని చూసినా వెనక్కు తగ్గలేదు. ఏడాది పాటు పోరాటం సాగినా.. ఎక్కడా అది హింసాత్మక రూపు సంతరించుకోకుండా రైతులు జాగ్రత్తలు తీసుకున్నారు. వారి కష్టానికి విలువ, పోరాటానికి ఫలితం, సంయమనానికి గౌరవం దక్కేలా.. ప్రధాని తన నిర్ణయం ప్రకటించారు.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా విస్పష్టంగా ప్రకటించినప్పటికీ.. ఆ చట్టాలను మాత్రం నరేంద్రమోడీ సమర్థించుకున్నారు. తాము ఏం చేసినా రైతుల మేలుకోసమే చేస్తామని.. ఆ చట్టాలు కూడా రైతులకు మేలే చేస్తాయని చెప్పుకొచ్చారు. అయితే వీటి విషయంలో రైతులకు సర్ది చెప్పలేకపోయినందున రద్దు చేస్తున్నామన్నారు. ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతులు ఉద్యమాన్ని విరమించుకుని స్వగ్రామాలకు వెళ్లాలని కోరారు. రైతులకు క్షమాపణ చెప్పారు.
Discussion about this post