తన కలాన్ని ఒక ప్రబోధనాత్మక అస్త్రంగా ప్రయోగిస్తూ.. వ్యక్తిత్వ వికాస పాఠాలను సినిమా పాటలలోకి కూర్చి తెలుగు జాతికి అందించిన అద్భుతమైన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన మరణానికి ముందు చరమాంకంలో రాసిన ఒక పాట.. ఫిబ్రవరి 2న విడుదల కాబోతోంది. యాదృచ్ఛికంగా ఆ పాట కూడా జనన మరణాల మీదనే కావడం విశేషం.
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో.. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాలోని మొదటి సింగిల్ ఫిబ్రవరి 2న విడుదల కానుంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి జాలువారిన స్ఫూర్తి దాయక గీతం పక్కా కమర్షియల్ లో ఉంది.
ఫిబ్రవరి 2 పూర్తి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. సిరివెన్నెల గారు చివరిసారి రాసిన జీవిత సారాంశం ఈ పాటలో ఉండడంతో దర్శకుడు మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు.
‘జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు’ అంటూ సిరివెన్నెల ఒక అందమైన, అద్భుతమైన పాట రాశారు. ఈ పాటలోని సాహిత్యం, అది అందిస్తున్న సందేశం తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు.
తన మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ.. సిరివెన్నెల గారిని గుర్తు చేసుకున్నారు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని.. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్ లో ఉంటాయని మారుతి చెప్పారు.
సిరివెన్నెల గారి కలం నుంచి జాలువారిన చిట్టచివరి స్ఫూర్తిదాయక గీతం ఇదే కావడం గమనార్హం. యువి క్రియేషన్స్ గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Discussion about this post