శ్రీకాళహస్తి ప్రజలకు శుభవార్త. జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిని రెవిన్యూ డివిజనుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్యాలయ ఏర్పాటుకు అనుకూలమైన భవనాలను పరిశీలించాలని శ్రీకాళహస్తి తహసీల్దారు జరీనాబేగంను జిల్లా అధికారులు ఆదేశించారు.
వారి ఆదేశాల మేరకు బుధవారం ఆమె శ్రీకాళహస్తిలోని విస్తరణ శిక్షణా కేంద్రం, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సమీపంలోని తుడా భవనం, దానికి పక్కనే ఉన్న ఆర్ అండ్ బీ అతిథి గృహం పరిశీలించారు. వీటిలో ఆర్డీవో కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది జిల్లా అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభన చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన జిల్లాల్లో మొదట ఉగాది నుంచి అనగా… ఏప్రిల్ 2వ తేదీ నుంచి పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే రెండు రోజులు వరుసగా సెలవులు రావడంతో… ఏప్రిల్ 4వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని కొద్దిగా మార్పు చేశారు. 4న ఉదయం 9.05 నుంచి 9.45 గంటల మధ్య నూతన కార్యాలయాలు ప్రారంభించాలని కూడా ముహూర్తం ఖరారు చేశారు.
1911లో ఏప్రిల్ లో ఏర్పడిన చిత్తూరు జిల్లా పునర్విభజనలో భాగంగా మూడు ముక్కలు అవుతోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలుగా విడిపోతున్నాయి. చిత్తూరు, తిరుపతి, రాయచోటి జిల్లా కేంద్రాలుగా ఉండనున్నాయి.
రెవిన్యూ డివిజన్లలో స్వల్పంగా మార్పు
క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర మంత్రి వర్గం రెవిన్యూ డివిజన్లలో మార్పుకు ఆమోదముద్ర వేసింది. చిత్తూరు జిల్లాలో నూతనంగా శ్రీకాళహస్తి, నగరి, కుప్పం, పలమనేరు పట్టణాలను రెవిన్యూ డివిజను కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నెరవేరిన శ్రీకాళహస్తి వాసుల కల
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిని రెవిన్యూ డివిజనుగా ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ఈ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు. అయితే సాంకేతిక కారణాలతో ఇంతకాలం శ్రీకాళహస్తిలో రెవిన్యూ డివిజను ఏర్పాటు చేయలేదు.
జిల్లాల పునర్విభజన చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో శ్రీకాళహస్తిని రెవిన్యూ డివిజను చేయాలనే డిమాండు మళ్లీ తెరమీదకు వచ్చింది. అయితే మొదట శ్రీకాళహస్తిని రెవిన్యూ డివిజనుగా చేయకుండా… శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజవర్గాలను నాయుడుపేట రెవిన్యూ డివిజనులోకి కలిపారు. ఈ నిర్ణయం పట్ల ఈ రెండు నియోజకవర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
ఈ విషయమై శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి, సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం కూడా శాసనసభలో చర్చించారు. ప్రజల సౌకర్యార్థం శ్రీకాళహస్తిని రెవిన్యూ డివిజనుగా చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుంది.
శ్రీకాళహస్తిని రెవిన్యూ డివిజనుగా చేయడానికి మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. ప్రాథమిక సమాచారం మేరకు శ్రీకాళహస్తి రెవిన్యూ డివిజను పరిధిలో శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట, సత్యవేడు, బుచ్చినాయుడుకండ్రిగ, వరదయ్యపాళెం, కేవీబీపురం, పిచ్చాటూరు. నాగలాపురం మండలాలు ఉండే అవకాశం ఉంది.
.