ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి చాలా దృఢమైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. ఒకసారి కమిటైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గడు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనతీరులోని అలాంటి లక్షణాలు ఆయనకు కూడా అలవడ్డాయి.
ప్రభుత్వాధినేతగా తాను ఇచ్చిన హామీలను ఆయన ఏమాత్రం తేడా లేకుండా నెరవేరుస్తారు. పార్టీ పరంగా కూడా ఎవరికైనా టికెట్ ఇస్తాననే మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని అందరూ అంటారు.
‘‘జగన్.. అప్పుడలా.. ఇప్పుడిలా.. ఉండరు సార్? జగన్ మడమ తిప్పని నాయకుడు’’ అని ఆయన అభిమానులు అంటుంటారు. అది నిజమే అని చాలా సందర్భాలు నిరూపిస్తాయి.
కానీ అంతటి దృఢమైన నాయకుడు కూడా.. మాట మార్చేస్తాడు. చాలా సునాయాసంగా, మొహమాటం లేకుండా, ఎవరైనా గుర్తించేస్తారు కదా అనే వెరపు లేకుండా.. మాట మార్చేస్తాడు. ఆ విషయం ఇప్పుడే అమరావతి రాజధాని విషయంలోనే చాలా స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ సందర్భంలో పురాతన కాలం నాటి జగన్మోహన్ రెడ్డి ప్రకటన, అసెంబ్లీలో ఆయన మాటలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. నారా లోకేష్ కూడా అప్పట్లో విజయవాడలో రాజధానిని సమర్థించిన జగన్ మాటల వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. అదంతా కూడా పాత సంగతి. కానీ జగన ఇవాళ చెప్పిన కొన్ని మాటలు గమనిస్తే.. ఇంత ఈజీగా మాట మార్చేస్తారా? మాటల్ని ట్విస్టు చేస్తారా అనిపిస్తుంది.
పాత అసెంబ్లీ ప్రసంగం నాటికి- రాజధాని విజయవాడ ప్రాంతం అనే విషయంలో ఆయన అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ.. 2019 ఎన్నికల సమయానికి ఆయన మదిలోకి విశాఖ వచ్చేసింది. అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించే పరిస్థితిలో లేరు. కాకపోతే ఎటుపోయి ఎటు వస్తుందో అనే భయంతో.. ఆయన అమరావతి నుంచి రాజధాని తరలించడం గురించి ఎక్కడా పెదవి విప్పలేదు. కానీ అప్పటికే జగన్ గెలిస్తే రాజధాని తరలించేస్తాడనే ప్రచారం ముమ్మరంగా ఉంది. ఆ రకంగా గుంటూరు జిల్లాలో మైలేజీ కోసం తెలుగుదేశం ప్రయత్నిస్తోంది.
తుగ్లక్ 3.0! మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేసారు. ఇళ్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానులు చెయ్యమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని. pic.twitter.com/iuNkJIyVNz
— Lokesh Nara (@naralokesh) November 22, 2021
అయినా సరే.. అమరావతి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం సాగించినప్పుడు.. జగన్- ‘రాజధాని తరలించను’ అనే మాట చెప్పలేదు. ‘అమరావతిలో మాత్రమే ఉంటుంది’ అనే సంగతి కూడా చెప్పలేదు. కానీ ఇవాళ ఆయన పూర్తిగా.. ‘‘2019 నాటి ప్రజల తీర్పు.. అధికార వికేంద్రీకరణకు అనుకూలంగానే వచ్చిందని.. ఆ తీర్పు ఇచ్చిన ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నాం’’ అని అంటున్నారు. ఇది పూర్తిగా మాటల గారడీ.
రాజకీయం అంటేనే మాటల గారడీ. కానీ, జగన్మోహన్ రెడ్డి కి ఉండే సహజాతమైన మొండి వైఖరిలో మాటలగారడీ పాళ్లు తక్కువ! సూటిగా, కావాలంటే కఠినంగా, మాట్లాడతారు గానీ గారడీగా మాట్లాడడం ఆయనకు అలవాటైన విద్య కాదు. కానీ ఇవాళ తన సహజశైలికి భిన్నంగా.. తనను ముఖ్యమంత్రిని చేసిన 2019 ప్రజల తీర్పు మూడు ప్రాంతాల్లో రాజధానులు రావడం కోసమే అన్నట్లుగా ఆయన పలకడం తమాషాగా ఉంది.
సభలో ఆయన మాటలు ఇలా సాగాయి..
“రాజధానుల బిల్లు ఆమోదం పొందగానే మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే మంచి ఫలితాలు ఈపాటికే వచ్చి ఉండేవి. శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో వెనుకబడిన ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలని అనుకున్నాం. వికేంద్రీకరణ ఆలోచన చేశాం. గతంలో కేంద్రీకరణ ధోరణులను ప్రజలు ఎంత వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్చడరాదని, ప్రజల తీర్పు స్పష్టం చేసింది. అందుకే వికేంద్రీకరణ సరైన విధానమని నమ్మి అడుగులు వేశాం.
అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలు వీరందరి ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నది కాబట్టే ఈ రెండేళ్ల కాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రభుత్వాన్ని గెలిపించారు.’’
ఇదీ ఆయన ప్రకటనలోని కొంత భాగం.
ఇది ఎలా నిజం అవుతుంది? ‘ఒక్క ఛాన్స్’ ఇవ్వమని అడిగిన నలభయ్యారేళ్ల యువకుడిగా ఆయన ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఆ ఒక్క ఛాన్స్ పొందారు. ప్రజలు ఆయనకు అనుకూలమైన తీర్పు ఇవ్వడానికి ఇతర కారణలేమీ పెద్దగా పనిచేయలేదు. ఈ విషయం ఆయనకు కూడా స్పష్టంగా తెలుసు.
కానీ ఇప్పుడు తన విజయాన్ని.. ‘‘అధికార వికేంద్రీకరణ’’ అనే- అప్పటికి సోదిలో కూడా లేని పదానికి దక్కిన విజయంగా ఆయన ముడిపెడుతున్నారు. మాట మార్చుతున్నారు. ఇక ఈ రెండేళ్లలో జరిగిన ఎన్నికల్లో తీర్పులను ప్రస్తావించడమే అనవసరం. అవేవీ కూడా రాజధాని నిర్ణయంతో ప్రభావితం అయ్యే ఎన్నికలు కావు. అయినా సరే.. అవి ఎలా జరిగాయో అందరికీ తెలుసు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
రాష్ట్రాధినేతగా రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవడం జగన్మోహన్ రెడ్డి పరిధిలోని అధికారం అనడంలో తిరుగేలేదు. ఆయన దానిని హక్కుగా భావించవచ్చు కూడా. ‘నా నిర్ణయానికి చెల్లుబాటు దక్కినంత కాలమూ.. నేను మూడు రాజధానులకు అనుకూలంగానే ఉంటాను’ అని ఆయన తెగేసి చెప్పొచ్చు. కానీ.. ఇలా అప్పట్లో ప్రజలు మూడు రాజధానులు కావాలనే ఉద్దేశంతోనే నన్ను గెలిపించారు- అనే డొంకతిరుగుడు మాటలు చెప్పనక్కరలేదు. ఆయన సహజమైన వైఖరికి అవి నప్పవు.
జగన్ మాటల్లో హైదరాబాదు వంటి సూపర్ కేపిటల్ అన్నారు. అంతవరకు నిజమే కావొచ్చు. కానీ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాంటి సూపర్ కేపిటల్ వద్దనుకుంటున్నారా? లేదా, అలాంటిది చంద్రబాబునాయుడు త్వరితగతిన చేయలేకపోతున్నాడని.. జగన్ వంటి యువకుడు వస్తే.. దానిని త్వరగా పూర్తిచేస్తాడని ఆశపడి ఆయనకు అధికారం అప్పగించారా? అనేది కూడా చర్చనీయాంశమే.
ఒక్క విషయం నిజం. తాను తీసుకున్న నిర్ణయానికి న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కుల గురించి సీఎం జగన్ ఆందోళన చెందారు. ఆ విషయం ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. ‘‘ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించేందుకు, చట్ట, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లులను మరింత మెరుగు చేసేందుకు బాగా వివరించేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తాం’ అనే మాటలే ఇందుకు రుజువు.
మరో బిల్లు తెచ్చినా సరే.. దాన్ని చట్టం చేసినా సరే.. న్యాయపరమైన చిక్కు ఏమీ లేకుండానే గట్టెక్కగలమని ఆయనకు అంత నమ్మకం ఉందా? బహుశా ‘అవు’నని వైసీపీ నాయకులు ఎవ్వరూ కూడా తమ అంతరాత్మతో అనలేరు.
.. సురేష్ పిళ్లె
సంపాదకుడు

.