ఆశలు ఉండవచ్చు. ఆకాంక్షలు ఉండవచ్చు. ఏదో సాధించేయాలన్న ఆరాటమూ తప్పులేదు. అయితే అత్యాశ పనికిరాదు. అలవిగాని ఆకాంక్షలు నిష్ర్పయోజనం. ఆరాటపడితే అందలమెక్కుతామా?
తెలంగాణలోనూ రాజన్న రాజ్యం తీసుకువస్తామన్న ఏకైక నినాదంతో వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారాలపట్టి షర్మిల ఆర్భాటంగా వై.ఎస్.ఆర్.టి.పి.ని ప్రారంభించారు.
ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శలు సంధిస్తూ వేళ్లూనుకోవటానికి షర్మిల ప్రయత్నిస్తున్నారు.
నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని తమ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే వయోపరిమితి సడలించి అయినా అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. అంతటితో ఆగకుండా మరికాస్త ముందుకు వెళ్లి కరోనా బాధితులు, ఆస్పత్రి బిల్లులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని, తాము అధికారంలోకి రాగానే వాటిని క్లియర్ చేస్తామని ఆశలు కల్పిస్తున్నారు.
గతంలోకూడా కొందరు పార్టీల నాయకులు కరెంటు బిల్లులు చెల్లించవద్దని, తాము అధికారంలోకి రాగానే వాటిని చెల్లిస్తామని చెప్పారు. బహుశా షర్మిల కూడా వారి బాటలోనే నడుస్తున్నట్లు ఉంది.
నిజంగా అంత సానుభూతి ఉంటే
నిరుద్యోగులపట్ల, కరోనా బాధితుల పట్ల షర్మిలకు నిజంగా సానుభూతి ఉంటే కనీసం జిల్లాకు కొంతమంది నిరుద్యోగులను ఎంపిక చేసి పార్టీ తరపున నిరుద్యోగ భృతిని కల్పించవచ్చు. కరోనా బాధితుల వైద్య బిల్లులు కొందరివైనా చెల్లించి ఉండవచ్చు. వై.యస్. తనయకు ఆమాత్రం ఆర్ధిక స్థోమత లేదని ఎవరూ అనుకోరు. ఉత్తుత్తి మాటలు, ప్రగల్భాలు పలకకుండా ఎంతో కొంత సాయం అందిస్తే వారిలో గొప్ప విశ్వాసాన్నిపాదుగొలిపి ఉండేవారు. మద్దతు పొందేవారు.
అన్నపై అలకతో…
జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన కాలంలో ఆయననూ, పార్టీని మరుగున పడకుండా చూసేందుకు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలమ్మ ప్రజల్లోకి వచ్చారు. షర్మిల, అన్నకోసం ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. అన్న అధికారంలోకి రావటానికి ఇంతగా కష్టపడిన తనను పూర్తిగా ఉపేక్షించారని, పదవులకు దూరం పెట్టారని షర్మిల మనస్తాపం చెందారని అంటున్నారు. అన్నపై అలకతోనే తానేమిటో నిరూపించుకోవటానికి తెలంగాణను కార్యక్షేత్రం చేసుకున్నారు. నిజానికి షర్మిల ఆంధ్రప్రదేశ్లోనే పార్టీని నెలకొల్పి ఉంటే రాజకీయాలు మరింత ఆసక్తిదాయకంగా ఉండేవి. కానీ ఆ ధైర్యం చేయలేకపోయారు.
రాజన్న ప్రభావం ఎంత?
వై.యస్.రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నట్లయితే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదని, సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగేదని గట్టిగా నమ్మేవారు ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. అందులో నిజం లేకపోలేదు. వై.యస్. బలమైన నేత అయినందున ఏదో ఒక రకంగా ఢిల్లీ పెద్దలను, ఉద్యమకారులను నచ్చచెప్పి ఉండవచ్చు. ఇప్పుడిదంతా గతం.
కాలం గడిచేకొద్దీ..
వై.యస్.రాజశేఖర రెడ్డి ఇప్పటికీ ఎంతమంది స్మృతిపథంలో ఉన్నారు? ఎంతమంది మళ్లీ ఆ తరహా పాలన కావాలని అనుకుంటున్నారు? అన్నదే అసలు ప్రశ్న. కాలం గడుస్తున్నకొద్దీ పరిస్థితులు మారతాయి. తరాలు మారతాయి. ప్రాధాన్యాలు మారతాయి. కనుక ఎంత పెద్ద నేత అయినా ప్రజల స్మృతిపథంలో అదే స్థాయిలో ఉంటాడనుకోవటం పొరబాటు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ మోహన్ రెడ్డి ఒక దశ వరకు తండ్రిని నెత్తికెత్తుకుని కొన్ని పథకాలకు ఆయన పేరు పెట్టారు. ఆ తర్వాత పథకాలకు తన పేరే పెట్టుకుంటున్నారు. ప్రజల హృదయాల్లో తాను సుస్థిరస్థానం పొందాలన్న ఏకైక లక్ష్యమే ఇందుకు కారణం. అలాంటిది షర్మిల మళ్లీ మొదటి కొచ్చి తెలంగాణలో రాజన్న జ్ఞాపకాలను తట్టి లేపాలని చూస్తున్నారు. ఆమె ఆశయం ఏమేరకు ఫలిస్తుంది?
అన్న బాటలో నడిస్తే చాలా?
అన్న జగన్ మోహన్ రెడ్డిది ప్రూవెన్ ట్రాక్ కనుక తాను కూడా కాపీ-పేస్ట్ మాదిరి ఆ బాటలోనే నడిస్తే విజయం తధ్యం అనే భ్రమలో షర్మిల ఉన్నట్లున్నారు. అన్న మాదిరే షర్మిల కూడా పాదయాత్రలు చేస్తున్నారు. ఏదో ఒక దీక్ష పేరిట నిత్యం ప్రజలమధ్య ఉంటున్నారు. జగన్ మాదిరే షర్మిల కూడా ప్రశాంత్ కిశోర్ సేవలు పొందుతున్నారు. రేపు ఎన్నికల వేళకు అన్నకంటే రెండడుగులు ముందుకు వేసి నవరత్నాల బదులు దశ రత్నాలు ప్రకటించినా ఆశ్చర్యపడనక్కరలేదు.
ఆ పరిస్థితులు వేరు
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావటానికి కలిసొచ్చిన పరిస్థితులు చాలా ఉన్నాయి. వాటిలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తికాకపోవటం, ప్రతిదీ తాత్కాలికం పేరుతో చంద్రబాబు కాలక్షేపం చేయటం జగన్కు కలిసొచ్చింది.
ఇది కూడా చదవండి : తమ్మినేని ఇప్పుడు ఏం చేస్తారు?
‘ఒక్క అవకాశం ఇచ్చి చూడండి’ అనే నినాదం, ప్రజలను ఆలోచనలో పడేసింది. ఒకసారి జగన్ కు ఓటేద్దాం అనుకున్నారు. వీటికి మించి పోల్ మేనేజ్మెంట్లో జగన్ కు ఆర్ధిక శక్తి, యుక్తి – రెండూ ఉన్నాయి.
తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు. టి.ఆర్.ఎస్. పట్ల, కేసీఆర్ పట్ల కొన్ని వర్గాల్లో నెమ్మదిగా అసంతృప్తి నెలకొంటున్న ఛాయలున్నా అది పూర్తిగా మార్పు దిశగా మళ్లుతుందన్న గ్యారంటీ లేదు.
వన్ ఉమన్ ఆర్మీ
షర్మిల పార్టీలో చెప్పుకోదగిన నేతలెవరూ లేరు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి సన్నిహితులుగా పేరుపడిన వారు కూడా షర్మిల పక్షాన నిలబడటానికి సిద్ధంగా లేరు. వన్ ఉమన్ ఆర్మీలా షర్మిల తన పార్టీని నడిపిస్తున్నారు. సంస్థాగత నిర్మాణంపై కూడా పెద్దగా దృష్టి సారిస్తున్నట్లు లేదు.
ఇగ్నోర్ చేయడమే మేలు
కేసీఆర్ పైనా ఆయన ప్రభుత్వంపైనా షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్, నిరంజన్ రెడ్డి వంటి ఒకరిద్దరు మంత్రులు ప్రతి విమర్శలు చేసినా షర్మిలను టి.ఆర్.ఎస్. వారు అంత సీరియస్గా పట్టించుకోవడంలేదు. ఇప్పటివరకు కేసీఆర్ బాహాటంగా షర్మిలపై పెద్దగా విమర్శలు చేయలేదు. షర్మిలను ఇగ్నోర్ చేయటమే మేలన్న అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నట్లున్నారు.
మీడియా మేనేజ్ మెంట్
షర్మిల కార్యకలాపాలకు ఆంధ్రజ్యోతి దినపత్రిక, వారి టీవీ ఛానల్ బానే కవరేజి ఇస్తున్నాయి. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే తాజా సిరీస్2కు షర్మిల ఇంటర్య్వూతోనే శ్రీకారం చుట్టారు. ఫుల్ పేజీ ప్రకటనల్లో ఆంధ్రజ్యోతికి షర్మిల అగ్రతాంబూలం ఇస్తున్నారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సొంత పత్రిక, టీవీ ఛానల్ మాటేమిటి?
సాక్షి టీవీలో, పత్రికలో షర్మిలకు కవరేజి అంతంత మాత్రంగానే ఉంది. అన్నింటా అన్నదారిలో నడుస్తున్న షర్మిల సొంతంగా పత్రికను, టీవీ ఛానల్ను ప్రారంభిస్తారా? అనే చర్చ కూడా మీడియా వర్గాల్లో నడిచింది. సొంతంగా మీడియా సంస్థలను ప్రారంభించటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సాధ్యం కాదు. కోట్లలో పెట్టుబడితోబాటు, భారీ సంఖ్యలో రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఈ పనులన్నీ దగ్గరుండి చూసుకునే సమర్థులు కూడా షర్మిల వెంట ఉన్నట్లు లేదు. ఎన్నికల వేళ ఒకటి రెండు దినపత్రికలతో, టీవీ ఛానళ్లతో పబ్లిసిటీ ఒప్పందాలు కుదుర్చుకుంటారని మాత్రం రూఢిగా చెప్పుకోవచ్చు.
టి.ఆర్.ఎస్.కు అన్నీ మంచి శకునములే
టీ.ఆర్.ఎస్.కు తామే ప్రత్యామ్నాయం అంటూ ఇటు బిజేపీ, అటు కాంగ్రెస్ పోటాపోటీగా ఆందోళనలు. నిరసన కార్యక్రమాలను సాగిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల చతుర్ముఖ పోటీలు జరగవచ్చు. అది టీ.ఆర్.ఎస్.కు లాభం చేకూరుస్తుంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో టీ.ఆర్.ఎస్. ఎంత పోరాడినా ఓటమి పాలు అయింది. ఈటెల రాజేందర్కు ప్రజల్లో ఉన్న పట్టు, సానుభూతే ఇందుకు కారణం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీ.ఆర్.ఎస్.కు ఇదే చేదు అనుభవం ఎదురవుతుందనుకోవడం భ్రమే. అధికారంలో ఉన్న పార్టీకి అంగబలం, అర్థబలం ఉంటుంది. ఆరు నూరైనా అధికారం చేజారకుండా చూసుకోవడం తప్పనిసరి.
ప్రశ్నలు ఎన్నో.. సమాధానం ఒకటే
వచ్చే ఎన్నికల్లో షర్మిల వ్యూహం ఏమిటి? ఒంటరిగానే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా? ఏ కొద్ది నియోజకవర్గాలకో పరిమితమవుతారా? ఎవరితోనైనా బాహాటంగా కాకున్నా లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటారా? షర్మిల ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? షర్మిలపై టి.ఆర్.ఎస్. బలమైన అభ్యర్ధిని నిలిపి ఓడించే ప్రయత్నం చేస్తుందా? షర్మిలను గెలిపించుకుని టి.ఆర్.ఎస్. లోకి ఆహ్వానం పలికి మంత్రి పదవి కట్టబెడతారా?
చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డిని ఆదర్శంగా తీసుకుని రాబోయే టి.ఆర్.ఎస్. ప్రభుత్వంలో మంత్రి అవుతారా?
ప్రభుత్వ ఓటును చీల్చడంలో, తద్వారా టీ.ఆర్.ఎస్.కు ప్రయోజనం చేకూర్చడంలో షర్మిల పార్టీ గట్టి పాత్ర పోషించే సూచనలున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయింది. మొదటినుంచి టీడీపీ పక్షాన నిలుస్తున్న బిసీలు, తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్ర ఓటర్లు, వై.యస్. అభిమానులు కొంతమేర షర్మిల వైపు మొగ్గు చూపవచ్చు.
అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి టీ.ఆర్.ఎస్. తిరిగి ప్రభుత్వ పగ్గాలు చేపడుతుంది. షర్మిలమ్మ జిందాబాద్.
– డాక్టర్ గోవిందరాజు చక్రధర్

.

Discussion about this post