కోర్టులో విచారణ జరుగుతూ ఉన్నప్పుడు.. ఆ పిటిషన్ కక్షిదారులతో తనకు వ్యక్తిగతంగా సంబంధాలున్నా, ఆ పిటిషన్ లోని ఉభయుల్లో ఎవరిద్వారానైనా తాను గతంలో లబ్ధి పొంది ఉన్నా.. పొందే అవకాశం ఉన్నా.. న్యాయమూర్తి ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ.. ఆ కేసును విచారించకుండా, మరొకరికి అప్పగించి పక్కకు తప్పుకోవడం.. మన న్యాయ వ్యవస్థలో ఒక గౌరవప్రదమైన సాంప్రదాయం.
ఇదే వ్యవహారం జరగాలంటే.. రివర్సు గేర్ లో మరో మార్గం కూడా ఉంటుంది. కేసులోని ఒక పక్షం వారి నుంచి న్యాయమూర్తికి ప్రయోజనాలు ఉండేవని/ ఉన్నాయని/ ఉండగలవని ఆరోపిస్తూ కక్షిదారులే ఒక పిటిషన్ వేయడం. దాన్ని అనుసరించి సదరు న్యాయమూర్తి ఆ కేసు నుంచి తప్పుకునేలా చేయడం.
ఈ రెండూ సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న వ్యవహారాలు. న్యాయబద్ధంగా.. చట్టం అనుమతించిన నిర్దేశకాలతో జడ్జిలు కేసు విచారణ నుంచి తప్పుకోవడానికి/ తప్పించడానికి వీలవుతుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు మోడల్ కోడ్ ఆఫ్ జుడిషియల్ కాండక్ట్ లో ఉంటాయి.
ఎప్పుడెప్పుడు..
న్యాయమూర్తులే స్వయంగా ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ కేసు విచారణ నుంచి తప్పుకోవడం అనేక సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాను గవర్నరుకు రాసిన లేఖలు లీకైన వ్యవహారంలో వేసిన పిటిషన్ నుంచి జడ్జి తప్పుకున్నారు. రమేష్ హాస్పిటల్ అగ్నిప్రమాదం కేసు నుంచి కూడా ఓ న్యాయమూర్తి తప్పుకున్నారు. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర రావు కేసు నుంచి కూడా.. అప్పట్లో జస్టిస్ లావు నాగేశ్వరరావు ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ తప్పుకున్నారు. ఇలా న్యాయమూర్తులు తప్పుకోవడం చాలా తరచుగా జరుగుతుంటుంది.
న్యాయమూర్తులను తప్పుకోమని అంటూ పిటిషన్ వేయడం అరుదుగా జరుగుతుంది. మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు వ్యవహారాలపై ఏపీ హైకోర్టులో రోజువారీ విచారణలు మొదలైనప్పుడు.. రాష్ట్రప్రభుత్వం ఇలాంటి పిటిషన్ వేసింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనంలో ఇద్దరు గత ప్రభుత్వం నుంచి అమరావతి ప్రాంతంలో ఇంటి స్థలాలు కొనుక్కున్నారని, వారికి ఆర్థిక ప్రయోజనాలున్నాయి గనుక.. వారిని కేసునుంచి తప్పించాలని ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి పిటిషన్ వేశారు.
అయితే.. చీఫ్ జస్టిస్ ఆ వాదనను తోసిపుచ్చారు. తాను ప్రభుత్వం జీతం తీసుకుంటున్నాను గనుక.. తనను కూడా తప్పుకోమంటారా అని నిలదీశారు. మొత్తానికి ఆ పిటిషన్ నెగ్గలేదు గానీ.. అలా మనకు ఇష్టం లేని న్యాయమూర్తులు మన కేసును విచారిస్తూ ఉంటే గనుక.. మన ప్రత్యర్థి పక్షం వారితో వారికి అనుచిత ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని ఏదోతీరుగా ముడిపెట్టి ఈ పిటిషన్ వేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకు నచ్చని న్యాయమూర్తులను పక్కకు తప్పించేలా చేయనూవచ్చు.
తాజాగా మూడో పద్ధతి కూడా బయటకు వచ్చింది..
అంత కష్టం అక్కర్లేదు..
ఓ పిటిషన్ తయారు చేయడమూ.. న్యాయమూర్తికి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నట్టుగా నిరూపించే ప్రయత్నమూ.. ఇంత అవసరం లేదు. చాలా సునాయాసంగా న్యాయమూర్తి కేసు నుంచి తప్పుకునేలా చేయవచ్చు. ఆయనకు అసహనం కలిగిస్తే చాలు! సాధారణంగా న్యాయపీఠానికి, ఆ సీటులోని న్యాయమూర్తికి ఎంతో గౌరవం ఇచ్చే కోర్టులో.. ఆయన మాటలను, నిర్దేశాలను, ఆదేశాలను ధిక్కరించి తనకు తోచిన రీతిగా వ్యవహరిస్తే చాలు. తద్వారా.. అలవిమాలిన అసహనం కలిగిస్తే చాలు! నిజం చెప్పాలంటే, రెక్యుజల్ (జడ్జిని తప్పుకోమనడానికి) పిటిషన్ వేయాలంటే న్యాయశాస్త్ర జ్ఞానం కావాలి గానీ.. ఇలాంటి రౌడీయిజం తరహా ప్రవర్తనతో అసహనం పుట్టించడానికి, న్యాయమూర్తి చిరాకు పడి తప్పుకునేలా చేయడానికి న్యాయశాస్త్ర జ్ఞానం అక్కర్లేదు. కానీ.. ఆ స్పృహ, దూకుడు ఉంటే చాలు. అవి ఉన్నవారే చేయగలరు!
‘కొండపల్లి’ కేసు గొడవ చెప్పే పాఠమేంటి?
కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలకు సంబంధించిన కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ నడుస్తోంది. వైసీపీ కౌన్సిలర్ల తరఫున సీతారాం చాపర్ల అనే న్యాయవాది వాదనలు వినిపించారు. ఆయన ఏ స్థాయిలో వాదనలు వినిపించారంటే.. కేసు విచారిస్తున్న జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాధ్ రాయ్ తాను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు. ఈ కేసును మరొక బెంచ్ కు అప్పగించాల్సిందిగా సూచిస్తానని పేర్కొన్నారు.
also read : జగన్ ను చూసి శత్రువులైనా నేర్చుకోవాల్సిన విషయాలు
ప్రతికక్షి న్యాయవాది వాదనలు వినిపిస్తున్నప్పుడు.. వైసీపీ వారి న్యాయవాది సీతారాం చాపర్ల అడ్డుపడ్డారు. అయితే మీ సమయం వచ్చినప్పుడు చెప్పాలని న్యాయమూర్తి సూచించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మళ్లీ మళ్లీ వైసీపీ కౌన్సిలర్ల న్యాయవాదినుంచి అదే తీరు ఎదురైంది. ఉన్నపళంగా న్యాయపీఠం నుంచి లేచి వెళ్లిపోయిన.. జస్టిస్ మానవేంద్రనాధ్రాయ్.. లంచ్ విరామం తర్వాత తిరిగి రాగానే.. ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించేశారు. న్యాయమూర్తి సూచనలను పట్టించుకోకుండా, ధిక్కరించి.. న్యాయవాది సీతారాం చాపర్ల ఎడాపెడా మాట్లాడినందుకే జడ్జి తప్పుకున్నారు.
మొత్తానికి సీతారాం చాపర్ల.. జడ్జిల పట్ల విముఖత ఉండే వారికి ఒక ‘నయా మార్గం’ చూపించారు. న్యాయమూర్తి మనకు అనుకూలంగా లేరని అనిపిస్తే చాలు.. ఆయనకు చిరాకు పుట్టించేస్తే.. ఆయనే తప్పుకుంటారు. పిటిషన్ వేయక్కర్లేదు. ప్రతికక్షితో ఆర్థిక ప్రయోజనాలున్నాయని చూపక్కర్లేదు. ఎంచక్కా కాగల కార్యం ఈ ‘నయా మార్గం’లో చక్కబెట్టుకోవచ్చు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీతారాం చాపర్ల.. సీనియర్ న్యాయవాది. న్యాయమూర్తులను లెక్క చేయకుండా, ఖాతరుచేయకుండా వెరపు లేకుండా ఎంత మాటైనా అనగల వ్యక్తిగా పేరుంది. ఆయన తాజాగా ఈ బాటను సిద్ధం చేశారు. నచ్చని న్యాయమూర్తులను కేసు నుంచి తప్పించడానికి ఇక ఎవరికైనా.. ఇలా చిరాకు పుట్టించడమే సులువైన దారి అయితే ఆశ్చర్యం లేదు. ఇలాంటి దూకుడు, ఇలాంటి తీరు బహుధా అనుసరణీయం అయితే విస్తుపోవాల్సిన అవసరం లేదు. అసహనానికి గురికాకుండా న్యాయమూర్తులు కొంత సహనం అదనంగా అలవాటు చేసుకుని, సంయమనం పాటించడం తప్ప వేరే మార్గమూ లేదు!
నయామార్గాలు ఇప్పుడు నయా భ్రష్టత్వాలను మనకు అలవాటు చేస్తున్నాయి. కేసులు- విచారణ- అందులో న్యాయాన్యాయాలు- నెగ్గడం/ ఓడడం ఇవన్నీ అప్రధానాంశాలుగా వెనక్కు వెళుతున్నాయి. కేసు విచారణ జరుగుతున్న తీరు.. ఆ రూపేణా ఎవరెవరికి అసహనం కలుగుతుందో, ఎవరెవరి ఆత్మగౌరవాన్ని భగ్నం చేస్తారో.. ఇంకా ఏయే కొత్త పోకడలను ఆచరణలోకి తెస్తారో భయం కలుగుతోంది.
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు
Discussion about this post