ఒక రకంగా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి- ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనల్పమైన స్ఫూర్తిని అందించారు. అత్యంత సాధారణమైన సందర్భాన్ని కూడా ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రేరణ అందించారు. ఇంకాస్త జాగ్రత్తగా గమనిస్తే వైయస్ జగన్మోహన్ రెడ్డిని పనిగట్టుకుని అప్రతిష్ట పాలు చేయడానికి, ఆయనను టార్గెట్ చేయడానికి మరొక మంచి అవకాశాన్ని చేజేతులా చంద్రబాబుకు అందించారు. రాజకీయ దురంధరుడు, రాజనీతి చాణక్యుడు అయిన చంద్రబాబుకు జగన్ ప్రేరణ ఇవ్వడం ఏమిటి? జగన్ స్ఫూర్తి ఇవ్వడం ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే ఈ కోణంలో గమనించాల్సిందే..!
రెండు రోజుల కిందట 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు వచ్చింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ సందర్భాన్ని అత్యంత ఘనంగా వేడుకల్లాగా నిర్వహించుకోలేదు గానీ అలాగని ఊరుకోనూ లేదు. మే 30వ తేదీ నాడు.. మీడియా పరంగా ఘనమైన ప్రచారం నిర్వహించారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజును రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తూ సాక్షి మీడియా సంస్థలలో ప్రత్యేక కథనాలను అందించారు. ‘జగన్ పరిపాలనను ప్రజలు కోరుకున్న రోజు’ అంటూ అభివర్ణించారు. మళ్లీ అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారంటూ పేర్కొన్నారు. మొత్తానికి ఇలాంటి ప్రత్యేక కథనాలు చంద్రబాబు నాయుడు సర్కారుకు స్ఫూర్తి ఇచ్చినట్లు ఉన్నాయి. మరో పది రోజుల్లో నాలుగో సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాబోతోంది.
మామూలు పరిస్థితుల్లో అయితే.. It is like any other day అన్నట్లుగా, పనిచేసే క్రమంలో ఇదొక తేదీ మార్పు తప్ప మరొకటిగా పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ప్రచారం చూసిన తర్వాత చంద్రబాబు సర్కారు ఊరుకుంటుంది అనుకోలేం. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12వ తేదీన భారీ స్థాయి కార్యక్రమాలు నిర్వహించడానికి చంద్రబాబు ఆల్రెడీ పిలుపు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భం అనడం కంటే- జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలనను అంతమొందించడానికి ప్రజలు ముహూర్తం పెట్టిన క్షణం అంటూ ప్రచార కార్యక్రమాలు సాగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తనకు సంబంధించిన వేడుకను కూడా ప్రత్యర్థిని టార్గెట్ చేసే లాగానే చంద్రబాబు వాడుకుంటుండడం గమనార్హం.
వైఎస్సార్ సీపీ అనేది ‘గొడ్డలి పార్టీ’ అనే మాట ఇప్పటికే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. ఈ ప్రచారంలో తెలుగుదేశం అండ్ కో బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు జగన్ వ్యతిరేక ప్రచారం చేయడానికి, స్వయంగా జగన్ అండ్ కో వారికి మరో అవకాశం అందించారు. జూన్ 12న జరిగే ప్రతి వేడుకలోనూ.. ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలు, రాబోయే మూడేళ్లలో చేయబోయే ఘనకార్యాలకంటె మిన్నగా.. జగన్ పాలనను అంతమొందించడానికి ప్రజలు కంకణబద్ధులైన రోజు అనే యాంగిల్ ప్రచారమే మిన్నగా జరిగే అవకాశం ఉంది.
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు

.
Discussion about this post