ప్రధాని నరేంద్రమోదీ.. తన సొంత నియోజకవర్గం వారణాశిలో పర్యటించారు. ఆలయాలను, మఠాలను సందర్శించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దీనదయాళ్ ఉపాధ్యాయ 63 అడుగుల విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఆయన ఎంతటి ప్రధాని అయినప్పటికీ.. వారణాశికి ఎంపీ. ఆ హోదాలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ఆయన బాధ్యత, అవసరం కూడా. ఈ సందర్భంగా సీఏఏ గురించి కూడా ఆయన తన అభిప్రాయాలను మరోమారు నిష్కర్షగా వెల్లడి చేశారు.
సీఏఏ, 370 రద్దుపై ఎలాంటి పునరాలోచన ఉండదని.. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగేది లేదని మోడీ ప్రకటించారు. నిజానికి ఆయనను ఎవరు ఒత్తిడి చేస్తున్నారు. ఒత్తిడి చేయగల స్థితిలో ఎవరున్నారు? ఈ దేశ ప్రజలు నరేంద్రమోడీకి రెండోసారి కూడా అపరిమితమైన మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు. అనేకులు అంచనా వేస్తున్నట్లుగా.. మోడీ తన ఇష్టానుసారం వ్యవహరించడానికి ప్రజలు ఆయనకు లైసెన్సు ఇచ్చారు. పర్యవసానంగా ఆయన చెలరేగిపోతూ ఉన్నాసరే.. ఈ ప్రజాస్వామ్యదేశం నిర్నిమిత్తంగా ప్రేక్షకపాత్రలో చూస్తూఉండడానికే పరిమితం అవుతోంది.
మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తలాక్ నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. 370 అధికరణం రద్దు చేశారు. కాశ్మీరు విషయంలో దేశం ఆయన వెన్నంటి నిలిచింది. కాంగ్రెసు వంటి విపక్ష పార్టీలు కూడా.. మొక్కుబడిగా దానిని వ్యతిరేకించాయి గానీ.. తాము అధికారంలోకి వస్తే.. తిరిగి 370 అధికరణం తెస్తాం అనే తరహా మాటలు చెప్పలేకపోయాయి. ముస్లిం సమాజం ఆ నిర్ణయాల పట్ల కొంత కినుక వహించినప్పటికీ.. ఆమోదించింది.
ఆ రెండు నిర్ణయాలు వేరు. పౌరసత్వ సవరణ చట్టం వేరు!
ఈ పౌరసత్వ సవరణ చట్టం.. దేశంలోని ముస్లింల అస్తిత్వాన్ని భయవిహ్వలతలో పడేస్తోంది. వారిలో గుబులును పెంచుతోంది. మత ప్రాతిపదిక మీద ఒక సమూహాన్ని అడ్డుకునే ధోరణి దీనితో వస్తోంది. ముస్లింగా బతుకుతున్నందుకు.. తమను యావద్దేశమూ అనుమానంగా చూసే వాతావరణాన్ని మోడీ ప్రభుత్వం కల్పిస్తున్నదని వారు బాధపడుతున్నారు. ఇలాంటి పోకడ సమాజానికి హితం కాదు.
ఎన్నార్సీ వంటి చట్టాలైనా భవిష్యత్ భద్రతావసరాల దృష్ట్యా సుస్థిర భద్రతకు కొంత బాటలు వేస్తాయేమో గానీ.. సీఏఏ ప్రస్తుతం ఉన్న రూపంలో.. సమాజంలోని సుహృద్భావ జీవనాన్ని దెబ్బతీస్తుంది. కలుషితం చేస్తుంది. మతకలహాలు చెలరేగకపోవచ్చు. కానీ.. మతం ప్రాతిపదికమీద మనుషులు ఒకరినొకరు అనుమానంగా చూసుకునే దుర్మార్గం ప్రబలుతుంది. ఇది సమర్థనీయం కాదు.
ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని నరేంద్రమోడీ చాలా ఘనంగా ప్రకటించారు. అసలు ఆయనను ఒత్తిడి చేస్తున్నది ఎవరు? ప్రధాన ప్రతిపక్షం అనే ట్యాగ్ లైన్ తగిలించుకున్న కాంగ్రెస్ పార్టీ.. జవసత్వాలు ఉడిగిపోయి.. పోరాడే ఆలోచన కూడా చచ్చిపోయినట్లుగా.. మూలనపడింది. ప్రాంతీయ పార్టీలు ఒకటిరెండు చోట్ల గట్టిగానే ప్రతిఘటిస్తున్నాయి… వాటి స్వరానికున్న బలం తక్కువ.
ఇక పోతే ముస్లింలు మాత్రం అడపాదడపా ఆందోళనలు చేస్తున్నారు. ఆ మతం వారినుంచి జనాన్ని తరలించే అవసరం లేకుండా.. అలాంటి ఆందోళనలు, ప్రదర్శనలకు జనసమీకరణ ‘స్వచ్ఛందంగా’ జరుగుతోంది. మోడీ వ్యతిరేకులు, లౌకికవాదులు అయిన.. హిందూ సమాజం నుంచి కూడా వారికి మద్దతు లభిస్తోంది. హైదరాబాదులో లక్షల మంది తరలివచ్చిన ప్రదర్శన అలాంటిదే. అయితే ఇలాంటి ప్రదర్శనలను- ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేత అయిన నరేంద్ర మోడీ ‘ఒత్తిళ్లు’గా భావించడం తప్పు.
అవి ఒత్తిళ్లు కావు.. విజ్ఞప్తులు. ఈ నేలపై పుట్టి ఇక్కడే బతుకుతున్న తమ అస్తిత్వాన్ని భయంలో, అనుమానంలో పడేయవద్దని వారు చేస్తున్న వేడికోళ్లు. పొరుగుదేశాలనుంచి వలస వచ్చిన వారిలో ఒక్క ముస్లింలను మాత్రం మినహాయించి మిగిలిన వారికి పౌరసత్వం ఇవ్వాలని అనుకోవడమే తప్పు. ఉగ్రవాదం గానీ, కుట్రలు గానీ వ్యక్తుల్లో ఉంటాయి తప్ప… మతంలో కాదు!
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు సహకరిస్తూ.. పార్లమెంటు మీద దాడికి తన వంత తోడ్పాటు అందించిన జమ్మూ కాశ్మీర్ పోలీసు డీఎస్పీ దవీందర్ సింగ్ ముస్లిం కాదు. ఇతర మతస్తుడు. ఈ ఉదాహరణ ఎందుకు గుర్తుచేసుకోవాల్సి వస్తున్నదంటే.. పొరుగుదేశాల నుంచి వలసలు వచ్చే వారిలో.. ముస్లిమేతర మతాల వారందరికీ అడ్డగోలుగా పౌరసత్వాలు ఇచ్చేస్తే.. (మతం వేరైనప్పటికీ) వారిలో ఉగ్రవాద మూలాలు, భావజాలాలు లేవని ఎలా నమ్మడం?
ఇవాళ్టి రోజుల్లో ఉగ్రవాదానికి మతమూలాలు అనవసరం. లక్షరూపాయలు పారేస్తే ఆత్మాహుతి దళంగా ప్రాణాలర్పించడానికి సిద్ధపడే వ్యక్తులు ప్రపంచదేశాల్లో చాలా మతాల్లో చాలా మంది ఉన్నారు. అవేవీ కొత్త సంగతులు కాదు. చరిత్ర చెబుతున్న సాక్ష్యాలే. అలాంటప్పుడు కేవలం ముస్లింలను మాత్రం వేరుచేసి… సీఏఏ చట్టం చేయడం ఖచ్చితంగా తప్పే. ముస్లింలా కనిపించే ప్రతివ్యక్తినీ దేశం అనుమానంగా చూడకుండా ఉండాలంటే.. ఇప్పుడున్న సామరస్య వాతావరణం కలకాలం మిగలాలంటే.. సీఏఏ విషయంలో మోడీ పునరాలోచన చేయాల్సిందే.
ఇది ఒత్తిడి కాదు.. విజ్ఞప్తి.
.
Discussion about this post