‘అమరావతిలో మట్టీ నీళ్లు తప్ప ఏమున్నాయి’ అంటూ సమాచార మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు పార్టీకి చేటు చేయబోతున్నాయా? అసలే కార్పొరేషన్ జరగబోతున్న సమయంలో.. ఒకవైపు అసంపూర్తి భవనాల నిర్మాణాలను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి తన సంకల్పాన్ని ప్రకటించి.. విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజల్లో అమరావతి మీద కాస్త ఆశలు పెంచి.. రాజకీయంగా లాభపడాలని చూస్తోంటే.. అదే సమయంలో.. అమరావతిలో అసలేమీ లేదంటూ నెగటివ్ వ్యాఖ్యలు చేయడం ద్వారా పేర్ని నాని కొత్త అనుమానాలు సృఫ్టిస్తున్నారు. తెలుగుదేశాన్ని నిందించడానికే ఆయన ఈ మాటలు అన్నిప్పటికీ.. అంతిమంగా అధికార పార్టీకేచేటు చేసే ప్రమాదం కనిపిస్తోంది.
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి విజయం సాధించి పెట్టే క్రమంలో మంత్రులంతా చాలా కష్టపడుతున్నారు. చంద్రబాబు స్వయంగా విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. పేర్ని నాని చంద్రబాబును విమర్శించే క్రమంలో తమ పార్టీకే గొయ్యి తవ్వేలా మాట్లాడుతున్నారు.
70 శాతం పూర్తయిన నిర్మాణాలను పూర్తి చేయడానికి జగన్ ప్రభుత్వం మూడువేల కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి మంత్రిగారికి కూడా తెలుసు. అంటే ముప్పయి శాతానికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారంటే.. దాని అర్థం.. జరిగిన పనుల విలువ కనీసం ఏడు వేల కోట్లకు పైగా మాటే అని.. ప్రభుత్వం స్వయంగా ఒప్పుకున్నట్లే కదా అనేది తెలుగుదేశం వాదన. ఇన్ని పనులు జరుగుతూ ఉండగా.. అసలక్కడ ఏమీ లేనేలేదంటూ మంత్రి చెప్పిన మాటలు.. గుంటూరు, విజయవాడ వాసుల్లో ఆగ్రహం కలిగించేవే.
అమరావతి గురించి నెగటివ్ కామెంట్స్ ద్వారా.. చంద్రబాబును కార్నర్ చేయాలని పేర్ని నాని అనుకుని ఉండొచ్చు గానీ.. వాస్తవంలో.. ఆ మాటలు ఆయన పార్టీకే చేటు చేసేలా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
.


Discussion about this post