జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామక్రిష్ణ రాజు వేసిన పిటిషన్ పై బుధవారం తీర్పు వెలువడ నుంది.
ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్న కేసులలో నమోదు అయిన 11 చార్జి షీట్లను ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకశం ఉన్నదని, అందుచేత ఆయన బెయిల్ ను తక్షణం రద్దు చేయాలని రఘురామక్రిష్ణ రాజు కోర్టులో పిటిషన్ వేశారు.
జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, బెయిల్ షరతులను ఆయన ఉల్లంఘిస్తున్నారని, కనుక తక్షణం రద్దు చేసి.. ఆయన మీద ఉన్న కేసులను సత్వరం విచారించాలనేది ఎంపీ రఘురామరాజు డిమాండ్. సీబీఐ ఈ పిటిషన్ విషయంలో కౌంటర్ వేయకపోవడంతో.. జగన్ తరఫు న్యాయవాదులు, రఘురామరాజు న్యాయవాదులు మాత్రమే కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. జులై 30 నాటికి ధర్మాసనం వాదనలు వినడం పూర్తయింది. ఏ2 విజయసాయిరెడ్డి బెయిల్ ను కూడా రద్దు చేయాలనే పిటిషన్ కూడా విచారణకు రావడంతో రెండింటికీ కలిపి సెప్టెంబరు 15న తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం ప్రకటించింది. ఆ మేరకు మరికొద్ది గంటల్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది.
బెయిల్ రద్దవుతుందా?
జగన్ బెయిల్ రద్దవుతుందా? ఆయన మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందా? అనే ప్రశ్నలకు మాత్రం నిర్దిష్టమైన జవాబు లేదు. కేవలం ఏపీలోనే కాదు, అటు తెలంగాణలో కూడా జగన్ బెయిల్ రద్దు పిటిషన్ లో రాగల తీర్పుగురించి సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. రఘురామరాజు ప్రయత్నం గట్టిదని నెగ్గుతుందని, జగన్ తిరిగి కటకటాల పాలు కాక తప్పదని.. ఆయన వ్యతిరేకులు సోషల్ మీడియా వేదికగా ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ అభిమానుల్లో మాత్రం.. సంశయం, అనుమానం, భయం దోబూచులాడుతోంది. జగన్ వంటి ప్రజా నాయకుడికి బెయిల్ రద్దు చేయడం జరగదని వారు ఎంతగా బింకంగా పలుకుతున్నప్పటికీ.. లోలోన ఏదైనా జరగవచ్చుననే భయం వారిని వెన్నాడుతోంది. జగన్ బెయిల్ రద్దు కాకూడదని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. భయం భయంగానే ఉత్కంఠగా తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.
దీంతో అటు జగన్ వ్యతిరేకులు, అభిమానులలో కూడా.. తీర్పు అనేది అత్యంత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఇవి కూడా చదవండి :
పవన్ కల్యాణ్ పార్టీ ఒక్కటే అసలైన జాతీయ పార్టీనా?
ఎమ్మెల్యే రోజా కార్చిన కన్నీళ్లు చెప్పే వ్యక్తిత్వ వికాస పాఠాలేమిటి?
అసలైన ‘‘శృంగారం’’ అంటే ఏమిటి?
ఏం జరగబోతోంది?
ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఉన్న నేపథ్యంలో.. ఆయన బెయిల్ రద్దు కావడం అసాధ్యం అనే అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. రఘురామ క్రిష్ణ రాజు వేసిన పిటిషన్ జగన్మోహన్ రెడ్డిని చికాకు పెట్టగలిగేదే తప్ప.. ఆయనను తిరిగి జైలుకు పంపించేంత సత్తా ఉన్నది కాదనే అభిప్రాయం న్యాయనిపుణులు వెలిబుచ్చుతున్నారు. ఈ పిటిషన్ ఇప్పటికే జగన్ ను చాలా రకాలుగా చికాకు పెట్టింది.
అనుకున్నది సాధించిన ఆర్ఆర్ఆర్ ..
ఈ పిటిషన్ వేయడం ద్వారా రఘురామక్రిష్ణ రాజు మాత్రం అనుకున్నది సాధించారు. జగన్ బెయిల్ రద్దు కోసం తాను పిటిషన్ వేసినంత మాత్రాన అది జరుగుతుందనే నమ్మకం ఆయనకు కూడా ఉండకపోవచ్చు. కాకపోతే.. జగన్మోహన్ రెడ్డి నిందితుడు, బెయిల్ మీద సీఎంగా ఉన్నాడు, నేరగాడు.. అనే మాటల రూపేణా ఆయన గురించి ప్రజల్లో విపరీతంగా చర్చ జరగడానికి ఆ పిటిషన్ ఉపయోగపడింది. అలాంటి పిటిషన్ గనుక లేకపోతే.. జగన్ బెయిల్ మీద జైలునుంచి బయటకు వచ్చి.. సీఎం కుర్చీలో ఉన్నారనే సంగతినే ప్రజలు మర్చిపోయేవారు. ఎన్నికలలో ఆయనకు అధికారం కట్టబెట్టిన ప్రజల అభిమానం అలాంటిది. అయితే రఘురామ పిటిషన్ ద్వారా.. జగన్ నేరాల గురించి, బెయిల్ గురించి నెలల తరబడి సుదీర్ఘమైన చర్చ అటు ప్రజల్లోను, ఇటు మీడియాలోను సాగింది.
అందరూ అనుకుంటున్నట్టే.. ఇన్నాళ్ల ఈ ఉత్కంఠకు, జగన్ అభిమానులకు ఊరట కలిగించే ముగింపు రాగల అవకాశమే ఎక్కువ.
.

Discussion about this post