ప్రతికూల భావాలు, మానసిక లోపాలు ప్రగతికి అవరోధాలుగా పరిణమిస్తాయని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి చెప్పారు. గురువారం తిరుపతి సమీపంలోని శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ” ప్రతికూల భావాలు – అధిగమించే మార్గాలు” అన్న అంశంపై అవగాహన కల్పించారు.
మన సమాజంలో అధిక శాతం మంది నిరంతరం ప్రతికూల భావాలతో బాధ పడుతుంటారని తెలిపారు.
“నా వల్ల కాదు, నా జాతకం బాగాలేదు, నాకే అన్ని అనర్థాలు జరుగుతాయి” లాంటి భావాల వల్ల ప్రయత్నంలోనే విఫలం చెందు తుంటారని చెప్పారు. దీని వల్ల అనుకున్న లక్ష్యాలు సాధించ లేక పోతున్నారని తెలిపారు
విద్యార్ధులు, యువత అర్థం లేని భయం, ఆందోళన, ఆత్మన్యూనత వల్ల మానసిక ఒత్తిళ్లకు గురవుతుంటారని తెలిపారు. దీనివల్ల ఏకాగ్రత లేమి, మతిమరుపు, పరధ్యానం, ఉద్వేగ లోపాలు కలుగుతాయని చెప్పారు. అలాగే లక్ష్య సాధనలో వెనుక బడుతుంటారని వివరించారు.
అపజయాలు ఎదురైనపుడు, మరో మార్గం తెలియక డిప్రెషన్, ఆత్మహత్యా భావనకు గురవుతుంటారని వివరించారు. అయితే మానసిక ఆరోగ్యం, వికాసం పెంపొందించుకుంటే మహోన్నతికి మార్గం ఏర్పడుతుందని వివరించారు.
సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం, తార్కిక గుణం, సమతుల ఆహారం, తగినంత నిద్ర మానసిక ఆరోగ్యానికి బాటలు వెస్తాయన్నారు. ఆధునిక సమాజంలో ఒత్తిళ్ల నిర్వహణ అలవర్చుకోవాలని చెప్పారు. మానవ సంబంధాలు, శారీరక వ్యాయామాలు, నిర్ణయాత్మక శక్తి, ఉపశమన పద్ధతుల ద్వారా ఒత్తిడిని జయించ వచ్చని తెలిపారు.
అవరోధాలు ఎదురైనపుడు పరిష్కార మార్గాలు వెదగాలన్నారు. శారీరక సామర్ధ్యం, చైతన్యం, సమయస్ఫూర్తి చురుకుదనం విజయానికి మూలమని చెప్పారు. ప్రతి వ్యక్తి మానసిక లోపాలను గుర్తించి తమను తాము సరుదిద్దు కోవాలని సూచించారు. ధ్యానం, స్వీయ సమ్మోహనం ద్వారా ఒత్తిళ్లను తగ్గించి మనో శక్తిని పెంచుకోవచ్చని డాక్టర్ రెడ్డి చెప్పారు
కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ బి ఎం సతీష్ ,ఇంచార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్ గురునాధ నాయుడు, కన్వీనర్ ఎం బాలాజి, విద్యార్థులు పాల్గొన్నారు.
.

Discussion about this post