అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలనుకోవడం అవివేకం. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికి అధికార పార్టీ వారు చేస్తున్న ప్రయత్నాలు కూడా అంతే. మహా పాదయాత్రకు అధికార పార్టీ వారు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారో… అదే రెట్టింపు ఉత్సాహంతో అమరావతి రైతులు ముందుకు సాగుతున్నారు.
అదే స్థాయిలో ప్రజల నుంచి వారికి అపూర్వ స్వాగతం లభిస్తోంది. మహాపాదయాత్రను అడ్డుకోవడానికి యత్నించినా… అది ఆగదని అధికార పార్టీ నేతలకు తెలుసు. అయినా వారు అవివేకంతో అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు. ఇలా చేయడం వలన పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు మరింత మద్ధతు.. సానుభూతి లభిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండు చేస్తూ ఆ ప్రాంత రైతులు ఉద్యమం చేపట్టి 700 రోజులు దాటింది. అమరావతిలో నిరాహార దీక్షలు కొనసాగిస్తూనే.. కొంతమంది రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర ప్రారంభమై నేటికి 38 రోజులు అయింది. ఈ 38 రోజుల్లో అనేక చోట్ల అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారులు మహాపాదయాత్రకు అడ్డంకులు సృష్టించారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పాదయాత్ర ప్రవేశించిన తరువాత ఈ అడ్డంకులు ఎక్కువయ్యాయి.
పాదయాత్ర చేసే వారికి రాత్రి వేళలో వసతి లేకుండా చేశారు. మధ్యాహ్నం వేళ భోజనం చేయడానికి కూడా ఇబ్బందులు కలిగించడంతో… పాదయాత్ర చేసే వారు రోడ్డు పైనే భోజనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే జిల్లాలో పాదయాత్రలో పాల్గొంటున్న ఓ వలంటీరుపై ఓ పోలీసు అధికారి లాఠీ ఝుళిపించడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సదరు వలంటీరు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్ఫడింది. ఇన్ని అడ్డంకులు అధిగమించి నెల్లూరు జిల్లాలో అమరావతి రైతులు మహాపాదయాత్ర పూర్తి చేశారు.
అమరావతి రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహాపాదయాత్ర 37వ రోజైన మంగళవారం చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించగానే అధికార పార్టీ నేతలు అడ్డంకులు సృష్టించడం మొదలు పెట్టారు. శ్రీకాళహస్తి మండలం ఎంపేడు వద్ద పాదయాత్ర చేసే రైతులకు భోజన వసతి కల్పించడానికి ఓ స్థలం ఎంపిక చేశారు.
చదును చేసిన భూమిని అధికార పార్టీ వారు యంత్రాలతో దున్నేశారు. ఈ నేనథ్యంలో మరోచోట భోజన వసతికి ఏర్పట్లు చేసుకోవాల్సి వచ్చింది. స్థలం ఇచ్చినందుకు సదరు రైతును ఓ పోలీసు అధికారి మానసికంగా వేధించారు. అంతేగాకుండా ఆయన్ను బెదిరించినట్లు కూడా తెలిసింది. అయినా ఆ రైతు లొంగకుండా అమరావతి రైతులకు అండగా నిలిచి… తన మానవతను చాటుకున్నాడు. ఆ రైతును అందరూ అభినందించారు.
అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 38వ రోజైన బుధవారం ఏర్పేడు మండలం చింతలపాళెం నుంచి రాజులపాళెం, పంగూరు, కాట్రకాయలగుంట, విష్ణు కెమికల్స్, గుంటకిందపల్లె, జింగిలిపాళెం, ముళ్లపూడి గిరిజన కాలనీ, ఊరందూరు, శిశాలాక్షి కాలనీ, పానగల్, రైల్వే స్టేషన్ వరకు సాగింది. బుధవారం రాత్రి అమరావతి రైతులు శ్రీకాళహస్తిలోనే బస చేయడానికి కల్యాణ మండపాలను తీసుకున్నారు.
అయితే ఈ కల్యాణ మండపాల యజమానులను అధికార పార్టీ నేతలు బెదిరించినట్లు అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల బెదిరింపుల కారణంగానే కల్యాణ మండపాలు యజమానులు తమకు ఇవ్వలేదని అమరావతి రైతుల ఆరోపణ. అమరావతి రైతులు ఊహంచిందే జరిగింది. వారు బస చేయడానికి కల్యాణ మండపాలు ఎవరూ ఇవ్వలేదు. దీంతో శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ సమీపంలో మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి కుటుంబానికి సంబంధించిన స్థలంలో అమరావతి రైతులు బస చేయడానికి ఏర్పాట్లు చేశారు.
గురువారం శ్రీకాళహస్తి పట్టణంలో పాదయాత్ర చేయడానికి పోలీసులు మొదట అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టణ వీధుల్లో పాదయాత్ర చేసి తీరుతామని అమరావతి రైతులు పట్టు బట్టారు. ఆ తరువాత పోలీసులు పాదయాత్రకు అనుమతించారు.
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాయాత్ర తిరుపతికి 35కి.మీ. దూరంలో ఉంది. ఈ నెల 15,16వ తేదీల్లో శ్రీవారి దర్శనానికి అనుమతి తమకు అనుమతి ఇవ్వాలని టీటీడీ అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు. అయితే వారి నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదు. దేవుని దర్శనానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానానికి పరాకాష్ట. ఇక మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో భారీ బహరంగ సభ ఏర్పాటు చేయడానికి అఖిలపక్ష నేతలు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే సభకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు మీన వేషాలు లెక్కిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగానే సభకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. సభకు అనుమతి ఏ నిబంధనలతో ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.
అమరావతి రైతులు చేపట్టిన మహాపాద యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. ఒక దశలో పాదయాత్రకు అనుమతి ఇవ్వమని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ తేల్చి చెఫ్పారు. అయితే రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అనుమతి ఇవ్వక తప్పలేదు. శాంతియుతంగా చేస్తున్న మహాపాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం వలన అధికార పార్టీకి ఒరిగేది శూన్యం.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
అలా చేయడం వలన రైతులకు మరింత మద్దతు పెరుగుతుంది. ఆ విషయం కూడా తేలిపోయింది. జగన్ పాదయాత్ర చేసినపుడు అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం ఇదే తరహాలో వ్యవహరించి ఉంటే పరిస్థితి ఎలా డేదో వైసీపీ నేతలు ఒకసారి ఆలోచిస్తే మంచిది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం జగన్ పాదయాత్రకు ఎలాంటి నిబంధనలు విధించలేదు. సభలకు ఆటంకం కలిగించచలేదు. అయితే నేడు అదే జగన్ అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుండటం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
పాదయాత్ర చేస్తున్నది అన్నదాతలు. వారేమీ ఉగ్రవాదులు కారు. అంతకంటే దేశ ద్రోహులు కారు, అలాంటపుడు జగన్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో వారి అంతరాత్మకే తెలియాలి. ప్రజాస్వామ్యం లో శాంతియుతంగా ఇతరులకు ఇబ్బంది కలుగకుండా నిరనస తెలియచేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ హక్కును కూడా కాలరాస్తోంది. ఇలా చేయడం ప్రజల హక్కులను హరించడమే. ఇందుకు పాలకులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.
.

Discussion about this post