జనంలోనే జడత్వం వచ్చేసింది. ఎవరిని నిందించి ఏం ప్రయోజనం! సామాన్యుడిని మరింత కుంగదీసేస్తూ.. మధ్యతరగతి అనే వర్గాన్ని మొత్తం పేదలుగా మార్చేస్తూ.. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వలన ఎడాపెడతా ధరలు పెరుగుతూ పోతుండగా.. నిర్దిష్టమైన, నిలకడైన కార్యచరణతో స్పందించేవారు కనిపించడం లేదు.
తాజాగా మళ్లీ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగాయి. పెట్రోలు 110, డీజిలు 100 కంటె పైధరకు చేరుకున్నాయి. గ్యాస్ సిలిండర్ పై 15 రూపాయలు పెరిగాయి. మరోవైపు సబ్సిడీ తగ్గిపోతూ వస్తోంది. 40 రూపాయల వరకు వచ్చిన సబ్సిడీ అంతకంటె తగ్గిపోతోంది. విపక్షాల గగ్గోలు, నిరసన అనేది మరణించిన నాయకుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు జరిపినట్లుగా ఒకరోజు కార్యక్రమంగా మారిపోయింది. దానికితగ్గట్టే ప్రభుత్వాలు కూడా ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయి.
ఇదివరకటి రోజుల్లో పరిస్థితి వేరుగా ఉండేది. లీటరు పెట్రోలు ధర 7 రూపాయలు ఉన్నప్పుడు, లీటరు మీద 2 పైసలు లేదా 5 పైసలు ధర పెరిగితే.. బీభత్సంగా ఉద్యమాలు జరిగేవి. ప్రతిపక్షాలు పోరాటాలు చేయడం వల్ల ధరల పెంపు విషయంలో ఆనాడు గానీ, ఈనాడు గానీ సాధిస్తున్నది ఏమీ లేదు. కానీ.. అప్పట్లో 2 పైసలు ధర పెరిగినందుకే.. ప్రజలు వారంలో ఒకరోజు వాహనం వాడేయడం ఆపేయాలి.. లేకపోతే ఖర్చులతూకం తట్టుకోలేం అని స్వీయనియంత్రణ పాటించేవారు. ఇప్పుడు ఆ స్వీయనియంత్రణ అనేది పూర్తిగా తగ్గిపోయింది. అందరూ వాహనాల మీదనే తిరుగుతున్నారు. పూలింగ్ అనేది కూడా తక్కువే అయింది. పెరిగే ధరలకు జనం అలవాటు పడిపోతున్నారు. పోరాడి ప్రభుత్వాల కొమ్ములు వంచి సాధించుకోవాలనే తీరిక ఎవ్వరికీ లేదు. జనం ఇలా జడత్వంలో పడడం అనేది సమాజానికి అన్నింటికంటె చాలా పెద్ద ప్రమాదం.
అవకాశవాద వడ్డనల సంగతేంటి?
పెట్రోలు ధర పెరిగినప్పుడు భారం పెరుగుతుంది.. దానివలన బస్సు టికెట్ ధర పెంచుతారంటే ఓకే.. అర్థం చేసుకోవచ్చు. కానీ.. పండగల సీజన్లో ధర పెంచడం సంగతేమిటి? పండగ వస్తే ధర ఎందుకు పెరుగుతుంది. ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు కాబట్టి.. ఆ సీజన్ ను సద్వినియోగం చేసుకోవడానికి వారి నడ్డి విరిగేలా అదనపు ధరలు వడ్డించేస్తాం అంటే ఎలాగ? అది దోచుకోవడమే లక్ష్యంగా ఉండే ప్రెవేటు వ్యాపారుల ధోరణి అవుతుంది గానీ.. ప్రభుత్వ రంగ సంస్థల తీరుగా ఎలా ఊహించగలం? కానీ ప్రస్తుతం జరుగుతున్నది మాత్రం అదే.
పండగల సీజను రాగానే బస్సు, రైలు టికెట్లు అన్నీ ధరలు పెరుగుతున్నాయి. తిరుపతినుంచి తిరుమలకు నిండా 20 కిలోమీటర్లు కూడా లేని దూరానికి బస్సు టికెట్ యాభై రూపాయలు అనేదే ఎక్కువ. ఇప్పుడు దసరా సీజను గనుక.. ఆ టికెట్ ను వంద రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తిరుమలకు భక్తులను పరిమితికి మించి అనుమతించడం లేదు. అయినాసరే పండగ రద్దీ పేరుతో అదనపు ధరలు వసూలు ఏమిటి? ఇదివరకటి రోజుల్లో ఆర్టీసీ బస్సు టికెట్ ఒక పైసా, రెండు పైసలు పెరిగినా నానా రాద్ధాంతం జరిగేది. ఇప్పుడు అలాంటి ఉద్యమాలు కూడా కనుమరుగైపోయాయి.
ఇవి కూడా చదవండి :
satire : అర్ధరాత్రి గునపం దరువులు
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
కేంద్రప్రభుత్వ ధోరణులు ఇంకా ఘోరం. కరోనా సీజను వచ్చాక జనజీవితాలు ఎలా కుదేలైపోయాయో అందరికీ తెలుసు. రైలు సర్వీసులు అన్నింటినీ రద్దు చేసేశారు. పునఃప్రారంభించే సమయానికి ఉన్న రైలు సర్వీసులకే ఆ పేర్లు తొలగించి.. స్పెషల్ రైళ్ల పేరుతో నడపడం ప్రారంభించారు. పాత పేర్లు తీసేశారు గనుక.. పాత ధరలు కూడా మంటగలిసిపోయాయి. స్పెషల్ పేరుతో తిరిగే రైలులో స్లీపర్ టికెట్ మీద అదనంగా 200 రూపాయల వరకు ధర పెంచుతూ.. దోచుకుంటున్నారు.
రైల్వే విషయంలో ప్లాట్ ఫారం టికెట్ల విషయం కూడా ఇంకో దోపిడీ. సీజనును బట్టి.. ప్లాట్ఫారం టికెట్ ధర పెంచేస్తున్నారు.
ఉద్యమశీలత గోవిందా?
ప్రభుత్వాలు ధరలు పెంచినప్పుడెల్లా.. విపక్షాలు ఆందోళన చేయడం మొక్కుబడి కార్యక్రమమే అవుతోంది. అధికారంలేని పార్టీలు రాజకీయ ప్రయోజనాలను లక్ష్యించిన కార్యక్రమాలతో ఏదో నామమాత్రపు పోరాటాలు చేస్తున్నాయే తప్ప.. ప్రజలను ఛిద్రం చేసేస్తున్న ధరలపెంపు నిర్ణయాలపై అంతు తేల్చేవరకు మడమ తిప్పని పోరాటం సాగించాలనే స్ఫూర్తి ఎవ్వరిలోనూ కనిపించడం లేదు. ఎవరికి వారు.. గట్టిగా ఉద్యమాలు చేస్తే తమ భవిష్యత్ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయేమో అనే ముందుచూపుతో.. నాటకాల తరహాలో ప్రజా ఉద్యమాలను నడిపిస్తున్నారు.
ఎందుకిలా జరుగుతోంది? ప్రజల్లోంచి పుట్టిన నాయకులు ఇప్పుడు తగ్గిపోయారు. లగ్జరీల్లో పుట్టి పెరిగి, వ్యాపారాలతో వర్ధిల్లి.. నాయకులుగా కొత్త అవతారం ఎత్తిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరికి సామాన్యుల కష్టాలు తెలియవు. సామాన్యుల జీవితాల్లోని ఎగుడుదిగుడులు తెలియవు. కాబట్టి ఈ తరహా లగ్జరీ నాయకులు, నిజమైన ప్రజాసమస్యల మీద పోరాడడం అనేది తూతూమంత్రంగానే ఉంటోంది.
అన్నీ పెరగడమే కదా..
పెట్రోలు, డీజిలు ధరలు పెరగడం అంటే.. సమాజంలో సమస్త వస్తువుల ధరలు పెరగడం కిందే లెక్క. ఈ ఇంధన ధరల పెంపు యొక్క ప్రత్యక్ష ప్రభావం తక్షణం రవాణా టికెట్ల మీద ఉంటుంది. కానీ.. పరోక్ష ప్రభావం మనకు అవసరమైన అన్నిరకాల వస్తువుల మీద అనివార్యంగా ఉంటుంది. దినుసులు, కూరగాయలు, పాలు సమస్తం ధర పెరుగుతాయి. చివరికి స్థానికంగా మనకు సేవలు అందించే ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వంటివారు కూడా రేట్లు పెంచేస్తారు. మధ్యతరగతి మొత్తం కుదేలైపోతుంది.
ఇవి కూడా చదవండి :
పవర్ స్టార్ పవన్ = గ్యాంగ్స్టర్ నయీమ్.. ఎలాగో తెలుసా?
అభిమానులు ఊహించని స్టెప్ వేసిన జనసేనాని
అధికారంలో లేనప్పుడు ప్రజలపక్షాన నిలవడం అనేది తమ మౌలిక లక్ష్యం అనే సూత్రాన్ని పార్టీలు విస్మరించాయి. వారికి రాజకీయ నష్టం కలిగేప్పుడు, ఖాళీ దొరికినప్పుడు అప్పటికి- దేనిమీద స్పందించగలమో వారు సమస్యలను దేవులాడుతున్నారు తప్పితే, నిజంగా ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను తమ భుజానికెత్తుకుని పోరాడడం మరచిపోయారు.
ప్రజలు జడత్వంలో కూరుకుపోవడం కూడా మరో కారణం. ఎన్నిసార్లు ధరలు పెరుగుతున్నా.. వాళ్లు దానికి అలవాటు అయిపోతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచే.. లీటరు పెట్రోలు మీద 20 రూపాయలకు పైగా పెరిగింది. గత పదేళ్లలో ఇంధన వాడకం, ధరల పెంపు ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం రెట్టింపు అయిందంటే.. దోపిడీ ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.
.. బీరక రవి
సీనియర్ పాత్రికేయులు

.

Discussion about this post