జనసంద్రమైన తిరుపతి
అలిపిరి వద్ద ముగిసిన పాదయాత్ర
అమరావతి రాజధానిగా కొనసాగించాలి
నేడు తిరుమలకు రైతులు, మహిళలు
17న తిరుపతిలో బహిరంగ సభ
తిరుపతి నగరం జనసంద్రంగా మారింది. అమరావతి రాజధాని నినాదాలతో మారుమోగింది. అమరావతి మహా పాదయాత్రకు తిరుపతి నగరం బ్రహ్మరథం పట్టింది. వేలాది మంది ప్రజలు పాదయాత్రకు స్వాగతం పలికారు. బస్టాండ్ వద్ద సిపిఐ కార్యకర్తలు ఎర్ర చొక్కా లు, మహిళలు ఎరుపు సారీలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాణసంచా పేలుస్తూ, పాదయాత్ర లో పాల్గొన్న మహిళలు రైతులపై పూలవర్షం కురిపించారు. మంగళవారం ఉదయం తనపల్లి క్రాస్ నుండి ప్రారంభమైన పాదయాత్ర అలిపిరి వద్ద విజయవంతంగా ముగిసింది. 44వ రోజు 12 కిలోమీటర్లు పాదయాత్ర జరిగింది. అఖిల భారత మహిళా సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి అనీ రాజా పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు.
అమరావతి రాజధానిగా కొనసాగించాలి: అనీ రాజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని అఖిల భారత మహిళా సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి అని రాజా డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం మహా పాదయాత్ర లో పాల్గొని అమరావతి ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వానికి రైతులు 33 వేల ఎకరాలు భూములు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం మారిందని రాజధాని మార్చడం సరైంది కాదని చెప్పారు.
పార్టీలు మారినంత మాత్రాన ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాలు మారవని అన్నారు. దాదాపు 25 వేల మంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రం కోసం, రాజధాని కోసం తమ భూములు అప్పగించారని అన్నారు. భూములు ఇచ్చిన రైతులలో అర ఎకరం నుండి 10 ఎకరాలు కలిగిన వారు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రైతుల త్యాగాన్ని గుర్తించుకొని జగన్ ప్రభుత్వం రాజధాని విషయంలో పునరాలోచన చేయాలని కోరారు. రాష్ట్ర రాజధానిని అన్ని హంగులతో అమరావతి నే అభివృద్ధి చేయాలని సూచించారు. బస్టాండ్ నుండి అలిపిరి వరకు జరిగిన పాదయాత్రలో అనీ రాజా చివరి వరకు పాల్గొన్నారు.
స్పష్టమైన ప్రకటన చేయాలి: తులసి రెడ్డి
రాజధాని విషయంలో జగన్ మొండి వైఖరి విడనాడి అమరావతిని కొనసాగిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు తులసి రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి నగరంలో జరిగిన మహా పాద యాత్ర లో పాల్గొని మద్దతు తెలియజేశారు. అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని మహిళలు చేపట్టిన పాదయాత్ర చారిత్రాత్మకం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల త్యాగాలను గుర్తించాలన్నారు.
పాదయాత్ర సాగిందిలా..
అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి లో ప్రారంభమైన పాదయాత్ర మంగళవారం తిరుపతిలో విజయవంతంగా ముగిసింది. నవంబర్ ఒకటో తేదీ తుల్లూరు లో ప్రారంభమై 44 రోజులపాటు 440 కిలోమీటర్లు నిరాటంకంగా సాగింది. గుంటూరు ఒంగోలు నెల్లూరు జిల్లాల మీదుగా కొనసాగి మంగళవారం తన పల్లి క్రాస్ వద్ద ప్రారంభమై తిరుచానూర్ రోడ్డు, పూర్ణకుంభం సర్కిల్, రైల్వే స్టేషన్, గాంధీరోడ్డు, మున్సిపల్ ఆఫీస్, వి వి మహల్ రోడ్డు, భవాని నగర్, కపిల్ తీర్థం రోడ్డు మీదుగా అలిపిరి పాదాల వరకూ సాగింది. వందలాది మంది మహిళలు రైతులు పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. బుధవారం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళతారు. పాదయాత్రలో పాల్గొన్న వారికి 500 మందికి 300 రూపాయల టికెట్లు టిటిడి మంజూరు చేసింది.
పాదయాత్రలో ప్రముఖులు..
44వ రోజు తిరుపతి నగరంలో జరిగిన మహా పాదయాత్ర లో పలువురు ప్రముఖులు పాల్గొని తమ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని, డాక్టర్ రజనీ, క్రిష్ణ కుమారి, మాలతి, రాణి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంజుల,నదియా తదితరులు వున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, గోపాల్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు అమర్నాథ్ రెడ్డి, పరసారత్నం, కోటేశ్వరరావు, సుగుణమ్మ, పులివర్తి నాని, నరసింహ యాదవ్, దొరబాబు, చిన్న బాబు, దంపూరి భాస్కర్ యాదవ్, బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు పసుపులేటి హరి ప్రసాద్, కిరణ్ రాయల్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, జనార్ధన్, పెంచలయ్య, నాగరాజు, నరసింహులు,విశ్వనాథ్, కుమార్ రెడ్డి, రాధాకృష్ణ శివారెడ్డి తదితరులు ర్యాలీలో అగ్రభాగాన నిలిచారు.
పాదయాత్రలో ప్లెక్సీలు చించివేత
సోమవారం అర్ధరాత్రి తిరుపతి నగరంలో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మాకు మీతో గొడవలు వద్దు. మీకు స్వాగతం మూడు రాజధానులు కావాలి అంటూ పాదయాత్ర సాగే వీధుల్లో తిరుపతి ప్రజల పేరిట ఫ్లెక్సీలు వెలిసాయి. వీటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు కార్యకర్తలు చించివేశారు. పోలీసులు అడ్డుకోవడంతో లక్ష్మీపురం సర్కిల్, నాలుగుకాళ్ల మండపం వద్ద కొద్దిపాటి ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
17న బహిరంగ సభ .. ప్రముఖుల రాక..
పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 17వ తేదీన తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అమరావతి జేఏసీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తిరుపతిలో జరిగే బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది తరలిరానున్నారు. ఈ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, జనసేన, బిజెపి, ఆర్ పి ఐ అగ్రనాయకులు హాజరుకానున్నారు.
.

Discussion about this post