ఒకటి సిటింగ్ స్థానం.. మరొకటి కూడా కాస్త కాన్సంట్రేట్ చేసి గెలుచుకుంటే.. టీఆర్ఎస్ పతనం ప్రారంభమైనట్టే అని రాష్ట్రమంతా టముకు వేయొచ్చునని ఆశించిన కమలానికి గులాబీ ముళ్లు గుచ్చుకున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీలకు జరిగిన ఎన్నికల్లో రెండింటినీ.. అధికార పార్టీ దక్కించుకోవడం వారికి మింగుడుపడని విషయం. ఏ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మీద అయితే వారు బోలెడు ఆశలు పెట్టుకుని, మరో ఎమ్మెల్యే సీటు కావాలని ఆశపడుతున్నారో.. అదే సాగర్ ను కూడా కలుపుకుని జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీనే విజయం సాధిస్తోంది.
హైదరాబాదులో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె.. వాణి ఎమ్మెల్సీగా విజయం సాధించింది. నిజానికి ఈ విజయం.. దుబ్బాకలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం అనుకోవాలి. దుబ్బాకలో సిటింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని తెరాస, బీజేపీకి కోల్పోగా.. హైదరాబాద్ ఎమ్మెల్సీ విషయంలో సిటింగ్ బీజేపీ స్థానాన్ని తాము కైవశం చేసుకున్నారు. అటు రెండో ఎమ్మెల్సీ స్థానాన్ని.. టీఆర్ఎస్ కే చెందిన పల్లా రాజేశ్వరరెడ్డి దక్కించుకున్నారు.
ఈ విజయాలు.. తెలంగాణ బీజేపీ కొత్తగా అలవాటు చేసుకుంటున్న అహంకారానికి గట్టి ఎదురుదెబ్బ. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత.. తెలంగాణ వ్యాప్తంగా.. తెరాస పని అయిపోయినట్లే అని ప్రచారం చేసుకుంటూ.. తమ బలం పెరిగినట్లుగా భావనల్లో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఇవి మింగుడుపడని ఫలితాలు. అందుకే కమలానికి గులాబీ ముళ్లు గుచ్చుకున్నట్లయిందని.. అంతా వ్యాఖ్యానించుకుంటున్నారు.
Discussion about this post