ఏ ఆశ లేకుండా ఈ భూమ్మీదకు వచ్చిన మనిషికి మొదట రుచిని పరిచయం చేసేది అమ్మ. తర్వాత ఒక్కొక్కటిని అందిస్తూ అతనిలో ఆశను కలిగిస్తుంది.
ఆ ఆశే కోరికలకు పునాది.
వయస్సు పెరిగేకొద్దీ తన చుట్టూ ఉన్న పరిసరాలు, పరిస్థితులకు ప్రభావితుడై తనకు నిజంగా అవసరం లేకపోయినప్పటికీ తన స్నేహితులు, బంధువులు కొన్నవాటిని చూసి తనకూ అవి ‘కావాలి’ అనే ఆశను, ఆరాటాన్ని అలవాటు చేసుకుంటాడు మనిషి. ఆ ఆశలో.. ఆ ఆరాటంలో… తను కోరుకున్నది లభిస్తే సంతోషిస్తాడు. లభించకపోతే దుఃఖిస్తాడు. కానీ తను కోరుకున్నది దొరికినా, లేక అనుకున్నది జరిగినా అంతటితో తన ఆశలకు, ఆరాటాలకు చరమగీతం పాడకుండా ‘నిరంతరమూ ఆశాన్వేషణలోనే మనిషి ఎందుకు పయనిస్తున్నాడో?’ అనేది ఎవరికీ అంతుపట్టని ప్రశ్నగానే మిగిలిపోయింది.
మరి ఆశాన్వేషణకు ముగింపు ఉందా..? లేదా…?
ఉదాహరణకు:
కొంతమందికి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని ఉంటుంది. మరికొందరికి వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించాలని ఉంటుంది. తీరా అవి లభించాక అందమైన అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోవాలనిపిస్తుంది. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత మంచి ఇల్లు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇల్లు కట్టుకున్నాక ఎక్కడికైనా వెళ్ళడానికి కారు ఉంటే బాగుంటుందనే మరో కొత్త కోరిక కలుగుతుంది. కారు కొన్నాక ఇంకా డబ్బులు బాగా సంపాదించి మరొక ఇల్లు, మరికొన్ని వాహనాలు, స్థలాలు, పొలాలు కొనాలనే కొత్త ఆశలు మళ్ళీ మన మనస్సులో ఉదయిస్తాయి. ఇలా.. ఈ కోరికల పరంపర నదీప్రవాహంలా… నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది.
దీనిని బట్టి చూస్తే అసలు మనిషికి నిజంగా ఏంకావాలి? అనే సందేహం మనలో సహజంగానే కలుగుతుంది. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా కోరుకున్న తర్వాత అది లభించినప్పుడు అంతటితో సంతృప్తి పడిపోవాలి. మరి ఇన్ని లభించినా కూడా మనిషి ఎందుకు సంతృప్తి చెందడంలేదు? అని ఆలోచిస్తే మనకు ఒక విషయం బోధపడుతుంది. ఈ భూమ్మీద లభించే వాటిల్లో దేనిలోనూ అసలైన సుఖం లేదనే విషయం మన మనస్సుకు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ ఆ దిశగా ఎవరూ ఆలోచించరు. అంతేకాకుండా అందంగా కనిపించే అశాంతి మార్గంలోనే అడుగులు వేసుకుంటూ వెళ్తారు.
మరి మనిషికి… నిజంగా ఏంకావాలి…?
కూడు, గూడు, గుడ్డ. నిజానికి ఈ మూడు అవసరాలే మనిషికి కావాల్సింది. మిగిలినవి అన్నీ బోనస్సే. కానీ మనిషి వాటిని సమకూర్చుకోవడానికే తన జీవితానంతా వృధా చేసుకుంటాడు. చివరకు దేనిలోనూ సుఖం లేదనే విషయం తెలుసుకునేలోపు జీవితం ముగిసిపోతుంది.
అయితే ఇప్పుడు ఏంచెయ్యాలి?
సత్తుగిన్నెలో సద్దనం దొరికినా
చింపిరి చాప మీద పడుకున్నా
చిరిగిన చొక్కా వేసుకున్నా
చింత పడకుండా చిరునవ్వు చిందిస్తూ
బతుకు బండిని నడిపేవాడే
మహా ఐశ్వర్యవంతుడు.
అంటే… భూత, భవిష్యత్తు కాలాల గురించి ఆలోచించకుండా తనకు లభించిన దానితోనే సంతృప్తి చెంది సదా వర్తమానంలో జీవించేవాడే సదానంద స్వరూపుడు.
మరి అందంగా కనిపించే అశాంతి మార్గంలోనే నడుస్తామా? లేక సదా వర్తమానంలోనే జీవిస్తామా? అనేది ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాలే తప్ప వేరే వాళ్ళ సూచనలు, సలహాలు ఇక్కడ పనికిరావు. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరి అవసరం వాళ్ళది.
రచయిత మొబైల్ : 98662 51159.
Read this also :
వాలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడేస్తాం అంటున్న నాయకుడు
మమతా బెనర్జీని గాడిద అన్నది ఎవరు?
.
Discussion about this post