పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ కొత్త చీఫ్ ఎగ్జి క్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) కాగానే ‘ఓహో.. ఆహో.. మావోడు సీఈఓ అయ్యాడోచ్’ అని బనియా/ వైశ్య కులానికి చెందిన కొందరు సామాజిక మాధ్యమాల్లో ఎగిరి గంతేశారు. పరాగ్ స్వయంకృషితో కష్టపడి ఆ స్థాయికి చేరుకుంటే, అతని ప్రతిభను, ఘనతను కులానికి ఆపాదించి సామాజిక మాధ్యమాల్లో సంబరం చేసుకున్నారు.
పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న ఒక ఉన్నత విద్యావంతురాలు, డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ ‘బనియా పవర్ ఇన్ ద హౌస్’ అని పెట్టిన పోస్టు, చర్చ రచ్చరచ్చయింది. మన పక్కవాడు, ఎదుటివాడు, అటుగా వాడిమానాన పోతున్నవాడు ఏ కులస్థుడన్నదీ తెలుసుకోవాలన్న తీట.. ఎవరైనా ఏ రంగంలోనైనా ఘన విజయం సాధించినా, అసాధారణ ప్రతిభ కనబరిచినా వారు ‘మనోళ్లౌనా? కాదా??’ అని తెలుసుకోవాలన్న జిల ఘోరంగా పెరుగుతున్నాయి.
మూర్ఖపు గొడ్డు అడాల్ఫ్ హిట్లర్ జాత్యహంకారంతో రెచ్చిపోయినట్లు కులాహంకారంతో, ఇప్పుడు.. ఈ ఆధునిక కాలంలో, నిత్యం రగిలిపోయేవాళ్లు మనచుట్టూ బాగా తయారవుతున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో కుల విభజన బైటికి కనిపించేదిగా ఉండగా, ఆధునికత ముసుగులో నగరాల్లో కాస్త స్టైల్ గా ముస్తాబయింది. మొన్నీ మధ్యదాకా ఎవరి కుల హద్దుల్లో వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ప్రతిదీ కులం కోణమే అయ్యింది. ఒక కులంలో పుట్టిన ప్రతి వ్యక్తికీ ఆ కులానికి ఉంటాయని తాను అనుకున్న లేదా ఆపాదించబడిన లక్షణాలే కచ్చితంగా ఉంటాయని అనుకోవడం సాధారణమయ్యింది.
మొత్తమ్మీద కులం దురద అన్ని చోట్లా ఏదో ఒక రూపంలో వర్ధిల్లుతోందన్నది చారిత్రిక, వర్తమాన వాస్తవం. చావు, పుట్టుక, ఆకలి బాధలు, ఇతర మనోవికారాలు అందరికీ ఒకటే, మనుషులంతా ఒకటే.. అని అనుకోకుండా ‘నా కులం ఒక్కటే గొప్పది’ అన్న భావనతో రగిలిపోతూ, ఇతర కులాలపై దుమ్మెత్తి పోస్తున్న జనం తీరు బాధకలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేంద్రంగా ప్రతి రోజూ సోషల్ మీడియాలో రెడ్డి-కమ్మ కులాలకు చెందిన వ్యక్తులు సాగిస్తున్న దూషణలు భూషణలు చూడండి.. ఎంత జుగుప్సగా తయారయ్యాయో. సంకుల సమరం ప్రతిక్షణం విసుగూ విరామం లేకుండా సాగిపోతోందక్కడ.
పాలకుల విధానాలు, నేతల నిర్ణయాల నాణ్యత ప్రాతిపదికన కాకుండా కేవలం కులం ఆధారంగా వీడియోలు, వ్యాఖ్యలు పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తున్నాయి. ప్రజా తీర్పుతో ఏర్పడిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ క్షణానే అర్జంటుగా గద్దెదింపాలని గట్టిగా కాంక్షిస్తూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ ఇక ఏమాత్రం లేవకుండా చేయాలని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ చూసినా కులం కంపే!
ఎన్నికలప్పుడు, అధికారం దగ్గరికొచ్చేసరికి ఈ కుల పిచ్చ ఇంకా ముదిరి తలలకు రోకళ్ళు చుట్టే పరిస్థితికి వచ్చింది. ప్రతిదీ కులం సమీకరణాల చుట్టూనే నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో రెండు ఆధిపత్యకులాల (రెడ్డి, కమ్మ) మధ్యన పోరాటం ఇప్పటిది కాకపోయినా.. తమ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయి, అయన బద్ధ వ్యతిరేకి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కమ్మ కులస్థులు బాగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని ఒక కొత్త సంకట స్థితి కులతీట ఉన్న వారిని బాగా బాధిస్తోంది.
గతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, కమ్మ నాయకులకు రెడ్ల నుంచి సెగ తగిలేది. తెలుగుదేశం పార్టీ ఏ కులానిదని జనం భావిస్తారో ఆ కమ్మ కులానికి చెందిన నేతల నుంచి మంటలు అంటుకుంటున్నాయి. జగన్ పార్టీ రాజకీయ వ్యూహమో, కాకతాళీయమో గానీ ఈ తంతు (తన వేలుతో తన కంటినే పొడిపించే) అధికార పార్టీకి ఆనందం కలిగిస్తోంది.
అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఒక రకంగా పర్వాలేదు. మంత్రి కొడాలి నాని మహా ఘోరాతి ఘోరంగా కుమ్మేస్తున్నాడు. ఒక మనిషి ఇంకో మనిషిని అనలేని మాటలతో- తన మాజీ బాసు చంద్రబాబు నాయుడును నిత్యం తన్మయత్వంతో అంటూ, కుళ్ళబొడుస్తున్నాడు. బాగా నోరున్న నేతలను చిన్నచూపు చూసి మంత్రి పదవి ఇవ్వకపోతే జరిగే నష్టాన్ని అప్పట్లో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం సాధించి నిరూపిస్తే, ఇప్పుడు నాని తిట్ల పురాణం, బూతు దండకంతో బాబు గారికి తెలియజేసారు.
నానికి తోడు వల్లభనేని వంశీ. రాయవీలుగాని ఒక పిచ్చి మాటతో వంశీ పెద్ద దుమారం లేపి.. అప్పటికే అవకాశాలు దొరక్క విలవిల్లాడుతున్న చంద్రబాబుకు ఒక మంచి ఆయుధం ఇచ్చాడు. ఏది ఏమైనా, చివరకు వంశీ నాలుక కరుచుకోవడం మంచి విషయమే. నాని, వంశీ లని రోల్ మోడల్స్ గా తీసుకుని వివిధ పార్టీలలో ఉన్న యువనేతలు కూడా చెలరేగిపోతే రాజకీయాలు పాతాళానికి దిగజారడం ఖాయం.
అధికార పక్షం అన్న మాటకు మనసు గాయపడి, తన ఇల్లాలిని రాజకీయ రొచ్చులోకి లాగారని చంద్రబాబు కన్నీటిపర్యంతం కావడం రెండు తెలుగు రాష్ట్రాలను- ముఖ్యంగా యావత్ కమ్మ కులాభిమానులను- ఒక్క కుదుపు కుదిపింది. అసలే అధికారం కోల్పోయి ప్రభుత్వ ధాటికి విలవిల్లాడుతున్న వారు, అమరావతి భూముల విషయంలో దెబ్బతిన్నవారు జీర్ణించుకోలేని విషయం: తమ కులానికి చెందిన నాయకుడ్ని, ఒక రకంగా కులదైవాన్ని, ఒకప్పుడు అయన పెంచి పోషించిన స్వకులస్థులే ఇప్పుడు వైరి కులం వారి అధికార పక్షంలో చేరి మాటలతో తూట్లు పొడవడం. సాధారణ చర్చల్లో, వనభోజనాల సందర్భంగా జరిగిన కుల సమావేశాల్లో ఈ తాజా పరిణామం రెండు రాష్ట్రాల్లో చాలా చోట్ల పెద్ద చర్చకు దారితీసినట్లు భోగట్టా. నాని, వంశీలను పెళ్లిళ్లకు, చావులకు పిలవకూడదని, వీళ్ళను కులం నుంచి వెలివేయాలని పెద్దలు తీర్మానించినట్లు వార్తలు వచ్చాయి.
కమ్మ కులస్థులు విశేష ప్రాబల్యం కలిగి ఉన్న ఖమ్మం జిల్లాలో ఒక స్థానిక కమ్మ నాయకుడు ఇంకో అడుగు ముందుకేసి బాబుపై పేలుతున్న సొంత కుల నేతలను భౌతికంగా లేకుండా చేయాలని, అందుకు తన వంతుగా ఒక యాభై లక్షల రూపాయలు ఇస్తానని మైకు ముందు మొహమాటంలేకుండా చేసిన ప్రకటన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. సరే, అలా తాను అనలేదని ఆ నాయకుడు చెప్పారు కాబట్టి నమ్ముదాం.
వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీ మీదనో, రచయిత్రి తస్లీమా నస్రీన్ మీదనో మత పిచ్చోళ్ళు ఇచ్చిన ఫత్వా లాగా ఈ ఖమ్మం జిల్లా నాయకుడి వైఖరి ఉంది. ఈ కమ్మ నేత నిజంగానే సుపారీకి ఆఫర్ ఇచ్చినా, ఫత్వా జారీ చేసినా ఇది మంచి పరిణామం కాదు. కుల ఉన్మాదంతో చేసే ఇలాంటి ప్రేలాపనలు చేయడం మంచిది కాదు. అన్ని కుల సంఘాల నేతలు చొరవ చూపి ఇలాంటి విపరిణామాలను నిలువరించే ప్రయత్నం చేయడం మనకు మంచిది.
కులం సమీకరణలు గమ్మత్తుగా ఉంటాయి. ఉదాహరణకు, రెడ్లలో గుటాటి, మటాటి అనే రెండు వెరైటీలున్నాయి. కాస్త ఆర్థికంగా బాగున్న దొరల టైపు మటాట్లు! రెడ్డి కులానికే చెందిన గుటాట్లతో వియ్యమందడానికి కూడా వెనకాడతారు. కమ్మోళ్లలో పెద్ద కమ్మ (చౌదరి), చిన్న కమ్మ అని ఉన్నారు. బ్రాహ్మల్లో వైదికులు, నియోగుల వంటి అనేక విభజనలు అన్ని కులాల్లో భారీగానే ఉన్నాయి. ‘నేను- నా కులం’ నుంచి ‘నేను మా ఉప కులపోళ్లు’ నుంచి ‘నేను-మా ఇంటి పేరోళ్ళు’ నుంచి ‘నేను-మా కుటుంబం’ నుంచి ‘నేను- నా సొంత కుటుంబం’ నుంచి అటు తిరిగి ఇటు తిరిగి కథ ‘నేను-కేవలం నేను- నేను మాత్రమే’ దగ్గర ఆగిపోతుంది. చివరాఖరికి ‘ఈ చిన్ని నా బొజ్జ శ్రీరామ రక్ష’ అన్నదే ఫైనల్.
ఇదంతా కాకుండా, డబ్బు, అధికారం, పలుకుబడి ఉంటే కులం హుష్ కాకి! బ్యాంకు బాలెన్స్ లేని కారణంగా గరీబోడి విషయంలో బాగా వచ్చే కులం పట్టింపు అదే కులానికి చెందిన క్యాష్ రిచ్ పార్టీ దగ్గరకు వచ్చే సరికి దూదిపింజంలాగా ఎగిరిపోతుంది. అదీ కులం మతలబు, మహాత్మ్యం.
ఏ మాటకా మాటే, కులం కోణంలో జగన్ మోహన్ రెడ్డిని కొట్టడం బాబు తాతకైనా కుదరదు. జగన్ కు ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది. రెడ్డి ట్యాగ్ తో రెడ్లు, మతం మారిన కారణంగా క్రిస్టియన్లు, రాజకీయ వారసత్వం తో సంప్రదాయ ఓటర్లు, నవ రత్నాల వల్ల ఇతర వర్గాలు అక్కునచేర్చుకుంటారు. మహా అయితే అవినీతి కార్డు వాడవచ్చుగానీ అది ఇప్పుడు జనాల దృష్టిలో ఒక సమస్యే కాదు. ఎందుకంటే, అన్నీ ఒక తాను ముక్కలే కదా!
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
అసెంబ్లీలో చంద్రబాబు భీషణ ప్రతిన, విలేకరుల సమావేశంలో దుఃఖం నేపథ్యంలో కమ్మ కులస్థుల ఏకీకరణ ప్రయత్నాలు మాత్రం ఊపందుకున్నట్లు కనిపిస్తున్నది. కమ్మ కులస్థుల గుణగణాలను, ప్రాశస్త్యాన్ని, శౌర్య పరాక్రమాలను, కీర్తి వైభవాలను, విజయాలను ప్రస్తుతిస్తూ 2018 లో విడుదలైన ‘ది చౌదరి ఆంథమ్’ అనే పాట ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతున్నది.
ఆత్మస్తుతి కావచ్చు గానీ, పరనింద మాత్రం కచ్చితంగా కాదంటూ, ఇతర కులాలను కించపరచడం దీని ఉద్దేశం కాదంటూ ఒక డిస్క్లెయిమర్ కూడా ఉన్న ఈ వీడియోలో ‘పౌరుషమే మెలిపెట్టిన మీసం.. చౌదరి’ అన్న మాటతో దానవీరశూరకర్ణ లో పెద్దాయన మీసం మెలివేస్తున్న సీన్ తో మొదలవుతుంది. ‘అలనాటి సైన్యాలకు నేతలు చౌదరి, యుగమేదైనా.. ఎదురేమైనా.. సరిలేనోడే చౌదరి.. చౌదరి.. చౌదరి’ తో ముగుస్తుంది. మిగిలిన కులాలు కూడా ఇలాంటి సాంగ్స్, ఆంథమ్స్ నిర్మించి ప్రచారం చేసుకుంటూ ఉండవచ్చుననుకుంటా, చూడాలి.
తమ కులాన్ని విపరీతంగా ప్రేమిస్తూ, తమ కులస్థులు మాత్రమే గ్రేట్ అని ఫీలవుతూ ఉండేవారు ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాలో తమ కుల ఆధిపత్యాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. అగ్రకులాల ఆధిపత్యం వల్ల తరతరాల వెనుకుబాటుకు గురైన కులాల వారు తమ హక్కుల సాధన కోసం కులం గురించి మాట్లాడడం అర్థంచేసుకోదగ్గదే కానీ, ఇప్పటికే కులం మూలంగా లాభపడిన కులాల వారు కూడా రోజూ అరిచి గీపెట్టి గోలగోల చేయడం, విద్వేషపూరితంగా వ్యవహరిస్తూ ఇతరులను చిన్న చూపు చూస్తూ సామరస్య భావనను చెడకొట్టడం ఏ మాత్రం బాగోలేదు.
.. డాక్టర్ ఎస్. రాము
సీనియర్ పాత్రికేయుడు, జర్నలిజం బోధకుడు

.

Discussion about this post