జర్నలిస్టుగా, రచయితగా, ప్రచురణకర్తగా డాక్టర్ గోవిందరాజు చక్రధర్ ది సుదీర్ఘ ప్రస్థానం. రచయితగా, ప్రచురణకర్తగా ఆయనకు ఎదురైన స్వానుభవాలు ఈ Writer’s Blues. నలభైకి పైగా పుస్తకాలు తీసుకువచ్చిన వ్యక్తిగా.. ఆయన అనుభవాలను adarsini.com పాఠకులకోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఆ వ్యాసపరంపరలో ఇది రెండవది.
‘రామోజీరావు.. ఉన్నది ఉన్నట్టు’ అనే పుస్తకం తెలుగు మీడియా మొఘల్గా గుర్తింపు ఉన్న రామోజీరావు గురించి వెలువడినది. ఆయన వ్యక్తిత్వం, వ్యాపార నిర్వహణ మెళకువలపై చక్రధర్ తన అభిప్రాయాలతో పాటు, రామోజీరావు సన్నిహితులు అనేకమందిని ఇంటర్వ్యూ చేసి ఆ వివరాలను గుదిగుచ్చి అందించినది. ఈ పుస్తకంపై అనుభవాలను ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
‘‘నాకు అంతా భయమయం. కవిత భయం, కథ భయం. వినను భయం, చూడనూ భయం. తలుపు భయం, నీడ భయం, గోడ భయం, గూడు భయం..’’ అంటూ తెనాలి సినిమాలో కథానాయకుడు కమల్ హాసన్ పలికిన డైలాగ్ కాస్తంత అటూ ఇటూగా నాకూ వర్తిస్తుంది.
ఈనాడులో బితుకు బితుకుమంటూ భయం భయంగా గడిపిన కాలం. ఏరోజు ఉద్యోగం ఊడుతుందో రోడ్డున పడతామో తెలియని అభద్రత. మొదటివారానికే జీతం మొత్తం అద్దెకూ, సరుకులకూ, పాలకూ హరించుకుపోగా మూడు వారాలపాటు ప్రతి పైసాకోసం కటకటలాడిన దైన్యం. ఒకటి రెండు కాదు, ఏకంగా పన్నెండేళ్లపాటు సాగిన బతుకు భయం.
మరికాస్త మంచి జీతమొస్తే మరికాస్త మంచి స్కూళ్లలో పిల్లల్ని చదివించే వాణ్నిగదా అని తండ్రిగా ఆరాటం. మరికాస్త మంచి జీతమొస్తే మరికాస్త సౌకర్యంగా ఉండే ఇంట్లో అద్దెకుండేవాణ్నిగదా అనే నిస్సహాయ నిర్వేదం. పన్నెండేళ్ల వనవాసంలో వ్యక్తిత్వం పూర్తిగా తలకిందులై చేవచచ్చి, నీరుగారి, ధైర్యం సన్నగిల్లి, ఉత్సాహం కొరవడి భారంగా గడిచిన కాలం.
ఈ భయాలు ఈనాడు నుంచి ఉదయంలోకి మారిన తర్వాతా కొనసాగాయి. అయిదేళ్ల తర్వాత ఉదయం నుంచి రచన కాలేజీలోకి వచ్చాకే కాస్తంత ధైర్యం కూడగట్టుకోగలిగాను. ఆర్ధికంగా పెద్ద వెసులుబాటు రాకున్నా, ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా స్వేచ్ఛగా మనసుకు నచ్చిన పనులు చేయగలిగాను.
ఈనాడులో పనిచేసిన కాలపు చేదు జ్ఞాపకాలు బుర్రలో ఊడలమర్రిలా పాతుకునిపోయి, పెనవేసుకుపోయి వెంటాడుతూరాగా రెక్క విప్పిన పుస్తకమే ‘రామోజీరావు : ఉన్నది ఉన్నట్టు’.
జీవితంలో ఇంతకంటే పోగొట్టుకునేదేమీ లేదు అనే మొండి ధైర్యం మఠం వేసుకుని కూచోగా ఏదైతే అదికానీ అనే తెగువతో రాసి ప్రచురించిన పుస్తకం ఇది. ఈ పుస్తకానికి ఇంత నేపథ్యం ఉందిమరి.
ఏది ముందు? ఏది తర్వాత?
పుస్తకంలోని విషయాల గురించి నేను ప్రస్తావించటం లేదు. వాటిని చదివి తెలుసుకోవచ్చు. రాతపని మొత్తం పూర్తయ్యాక పెద్ద సంఖ్యలోనే జమ అయిన స్క్రిప్టు కాగితాలను నేలమీద ముందేసుకుని కూర్చున్నాను. పేకముక్కలు పరచినట్లుగా స్క్రిప్టును అధ్యాయాలుగా పరిచి పరిశీలన మొదలుపెట్టాను. పుస్తకాన్ని ఎన్ని ప్రధాన భాగాలు చేయవచ్చు, ఒక్కో ప్రధాన భాగంలో ఏయే చాప్టర్లు ఏ క్రమంలో పేర్చాలి అనే ఆలోచనలతోనే రెండు రోజులు గడిపాను. నలుగురు ప్రముఖులతో చేసిన ఇంటర్వ్యూలను పుస్తకం చివరిలో కంటే మధ్యలో ఇస్తేనే ఎక్కువ రీడబిలిటీ ఉంటుందని భావించి ముందుకు తెచ్చాను.
అడిగితే చెప్పేవాణ్ని
పుస్తకాన్ని క్షుణ్నంగా చదివి చక్కటి భూమికను సమకూర్చారు తన పరిచయ వాక్యాలతో ఆత్మీయ మిత్రులు డాక్టర్ దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి. ఈనాడు రామోజీరావుతో సుదీర్ఘ అనుబంధం ఉన్న పెమ్మరాజు రవికిషోర్ కవర్ ను పండించారు. అక్షరాల కూర్పులో ఓర్పుకు నిలువెత్తు రూపు అయిన నల్లమోతు రఘురామయ్య తోడ్పాటు మరవలేను.
కొందరు అడగ్గానే ఆనందంగా తమకు తెలిసిన సమాచారాన్ని, అభిప్రాయాలను పంచుకున్నారు. ఒకరిద్దరు ముఖం చాటేశారు. నన్నడిగితే ఆ విషయాలు ఇంకా లోతుగా చెప్పేవాణ్నిగదా! అని పుస్తకం వచ్చాక అన్నవారూ ఉన్నారు.
పుస్తకం ప్రమోషన్ కోసం తిప్పలు
కరోనా పతాకస్థాయిలో ఉన్నప్పుడు 2020 నంబర్ 16న, రామోజీరావు పుట్టినరోజు నాడు పుస్తకం వెలువడింది. పుస్తకం పెద్ద సంచలనం సృష్టిస్తుందని, టీవీ చానళ్లవారు పోటాపోటీగా నన్ను ఇంటర్వ్యూలకు పిలుస్తారని, ఆటోగ్రాఫ్లకోసం పాఠకులు క్యూ కడతారని ఆశించి, భ్రమించి భంగపడ్డాను. ప్రసిధ్ధ సంపాదకులు కె.రామచంద్రమూర్తి తన సకలం యూట్యూబ్ ఛానల్ కోసం ఇంటర్వ్యూ చేశారు. మిర్రర్ టీవీలో కూడా రెండు భాగాలుగా ఇంటర్వ్యూ వచ్చింది. మంచి పుస్తకం యూట్యూబ్ ఛానల్ లో స్వయంగా పరిచయం చేశాను.
మీడియా బాసులంతా ఒకటే
మీడియా యజమానులంతా ఒకే క్లాస్ అని అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. కొన్ని పత్రికల్లో సమీక్షలు రావని ముందే ఊహించాను. సాక్షి పత్రికవారు సైతం సమీక్షకు జంకడం నన్ను విస్మయపరిచింది. దీంతో పుస్తకం గురించి నలుగురికి తెలియజేయడం ఎలా? అనే ప్రశ్న తలెత్తింది. జర్నలిస్టు మిత్రులు కొందరిని ఒకటికి రెండుసార్లు పోరగా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు రాశారు. ఒక మిత్రుడైతే పుస్తకంలోని అసలు స్పిరిట్ ను వదిలేసి సేఫ్ గేమ్ ఆడుతూ యూ ట్యూబ్ లో పరిచయం చేశాడు. నేను క్రిటికల్గా రాసిన విషయాల ఊసే ఎత్తలేదు.
ఇవి కూడా చదవండి :
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
‘ఒక పత్రికాధిపతి గురించి బ్లాక్ అండ్ వైట్ కథనం’ శీర్షికతో కల్లూరి భాస్కరం పుస్తకంలోని విషయాలను ధైర్యంగా చర్చిస్తూ ఫేస్ బుక్లో రాశారు. జర్నలిస్టు సర్కిల్లో సాహితీవేత్తలలో ఆయనకున్న విశ్వసనీయత, గౌరవం కారణంగా కల్లూరి భాస్కరం సమీక్షకు మంచి స్పందన వచ్చింది. చాలామంది కాపీలు తెప్పించారు. టెక్నాలజీ పుణ్యమా అని గూగుల్ పే, ఫోన్ పే ద్వారా తేలిగ్గా డబ్బు పంపి దేశంలోని ఏ ప్రాంతం వారయినా పుస్తకం తెప్పించుకోగలగడం రచయితలకు వరం. నవోదయ బుక్ హౌస్ వారితోపాటు నేనూ నేరుగా కొంతమందికి పోస్టులో పుస్తకాలు పంపగలిగాను.
ప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మ ద్వారా పుస్తకం గురించి తెలుసుకుని చదివిన ఆమె అభిమాన పాఠకుడు జె.యు.బి.వి.ప్రసాద్ మాత్రం 70 కాపీలకు ఆర్డరు ఇచ్చి వివిధ లైబ్రరీలకు పంపమన్నారు తన కానుకగా. ఇది సంతోషాన్నిచ్చింది. ప్రముఖ కవి అందెశ్రీ, పోస్టులో పంపిస్తానన్నా వినకుండా స్వయంగా ఇంటికి వచ్చి కాపీ కొనుగోలు చేశారు. మంచి పుస్తకం అని గుర్తించి పదిమందికి చేరేలా చూసి ప్రోత్సహించారు పావన్, శిరంశెట్టి కాంతారావు.
టైటిల్ స్పీక్స్ వాల్యూమ్స్
‘టైటిల్ స్పీక్స్ వాల్యూమ్స్’ అని ఈనాడు ఫౌండర్ ఎడిటర్ ఎ.బి.కె.ప్రసాద్ కితాబునిచ్చారు. నిన్ను నువ్వు కట్టడి చేసుకుని స్పీడ్ బ్రేకర్లు వేసుకుని నడిపావు. ఇదే ఇంగ్లీషు రచయితలైతే, జంకు లేకుండా పూర్తి ఎగ్రెసివ్గా, క్రిటికల్గా వెళ్లి ఉండేవారని జర్నలిస్టు మిత్రుడు మందలపర్తి కిషోర్ అభిప్రాయపడ్డారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
నాణేనికి బొమ్మ – బొరుసులా రామోజీరావులోని భిన్నకోణాలను ఆసక్తిగా చదివించేలా విశ్లేషించారు అని రంగనాయకమ్మ వ్యాఖ్యానించారు. మీరు కేవలం జర్నలిస్టే కాకుండా మంచి రచయిత కూడానని ఈ పుస్తకం చదివితే అర్థమయింది అని అన్నారు.
రచయితగా బాహుబలి
మీరు ఎలా ఉంటారో నాకు తెలీదు. కానీ ఈ పుస్తక రచయితగా మాత్రం మీరు బాహుబలి’ అని ప్రసిద్ధ కథకుడు శిరంశెట్టి కాంతారావు అభినందించారు.
ఈ పుస్తకం నాకేమీ నచ్చలేదు. అన్నీ తెలిసిన విషయాలే ఉన్నాయి అంటూ చప్పరించాడు ఒక పాఠకుడు.
పుస్తకం చదువుతుంటే వైబ్రేషన్స్ వచ్చాయి. ఓ పదిహేనేళ్ల ముందే మీరు పరిచయం అయివుంటే ఇంకా బావుండేది అని తిరుపతికి చెందిన లెక్చరర్ (చిట్టి) మునిప్రసాద్ స్పందించారు.
‘ఉన్నది ఉన్నట్టు’ అని కాకుండా ‘అనుకున్నది అనుకున్నట్టు’ అని టైటిల్ పెడితే ఇంకా బాగుండేది అని ఒక సీనియర్ ఎడిటర్ చురక. నాకు తోచినట్టు, నాకు నచ్చిన పద్ధతిలో రాశానన్నది ఆయన అసంతృప్తి, అభ్యంతరం.
పొగడ్తలను, తెగడ్తలను ఒకే రీతిలో ఆస్వాదించటం అలవాటు చేసుకున్నాను. లోకో భిన్నరుచి అని సర్ది చెప్పుకున్నాను. ఎవరేమన్నాసరే ఈ పుస్తకం కొన్నేళ్లయినా నిలబడుతుందా? అక్కరకు వస్తుందా? నా ప్రయత్నం వృథా అవుతుందా? ఫలిస్తుందా? వంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.
రామోజీరావు గురించి మాట్లాడుకోవలసిన అవసరం ఉన్నంతకాలమూ తెలుగు మీడియా తీరు తెన్నులపై అధ్యయనాలు సాగినంతకాలమూ ఈ పుస్తకంతో అవసరం పడుతూనే ఉంటుంది.
కొసమెరుపు
‘‘అమ్మా! పుస్తకం ఎన్ని పేజీలు చదివావు?’’ అనడిగాను మా అమ్మ గోవిందరాజు రుక్మిణిని.
‘‘ఈనాడులో నువ్వు ఇన్ని బాధలు పడ్డావా? ఒక్కనాడైనా మీ నాన్నతోగానీ, నాతోగానీ మాట మాత్రమైనా చెప్పలేదేం? నా మనసుకు కష్టం వేసి మధ్యలోనే పుస్తకం పక్కన పెట్టేశాను’’ అంది అమ్మ.
నాన్న చేత చదివించి అభిప్రాయం తెలుసుకోవడానికి ఇప్పుడాయన ఈ లోకంలోనే లేరు.
– గోవిందరాజు చక్రధర్
98498 70250
Discussion about this post