ఆయన పిలుపిస్తే ఒక్కతాటిపై ప్రపంచ మహమ్మరి కరోనాపై రాజీలేని పోరాటం కోసం దేశ ప్రజలంతా స్వీయ నిర్బంధం విధించుకుంటారు.. ఆయన అడిగితే భారతావని నలుచెరగులా 130 కోట్ల దీపాలు దేదీప్యమానంగా వెలుగుతాయి, యావత్ జగతికీ చెవులు పిక్కటిల్లేలా శంఖారావాలు ఘంటా నాదాలు హోరెత్తుతాయి.. ఆయన కోరితే దేశప్రజలు క్రమశిక్షణతో దేశపునర్నిర్మాణంలో నిశబ్ద భాగస్వాములయ్యారు.. ఆయన నేతృత్వం భారతీయులకు అండ.. ఆయన విశ్వగురువు భారత కీర్తి జెండా. ఆయనే భారత మాత ముద్దు బిడ్డ… సమకాలీన ప్రపంచంలో శిఖర సమాన నేత నరేందర్ దామోదర్ దాస్ మోడీ.. నేడు 71వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.
జాతీయవాద స్ఫూర్తి, అసమానమైన దార్శనికత, అంత్యోదయ ఆలోచనావిధానం, సుపరిపాలన మంత్రం నరేంద్రమోడీ గారిని అత్యున్నత నాయకుడిగా నిలబెట్టింది. గతంలో ఏ ప్రభుత్వమూ చేయనంతగా సకలజనుల సంపూర్ణాభివృద్ధికి మోడీ నిజాయితీగా కృషి చేస్తున్నారు. నమో నేతృత్వం అభివృద్ధికి బలమైన పునాదిగా మారి స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు జరుపుకునేనాటికి మనం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తామనే నమ్మకాన్ని దేశ ప్రజల్లో నెలకొల్పింది.
ప్రముఖ రచయిత స్వర్గీయ గొల్లపూడి మారుతీరావు చెప్పినట్లు నాయకత్వం కొందరికి సాకు, కొందరికి దోపిడీ, కొందరికి అవకాశం అతి తక్కువమందికి సేవ. అందుకే మోడీ గర్వంగా ‘‘నేను మీ చౌకీదారుని’’ అని చెప్పుకోగలిగాడు. కొంచెం సెలబ్రటీ హోదా రాగానే.. హిపోక్రసీ ముసుగులో బతుకుతూ ఉండే ఇవాళ్టి తరం రాజకీయ నాయకులకు భిన్నంగా.. తన పేదరికపు, బాల్యంలోని వెనుకబాటు తనపు మూలాలను దాచుకునే ప్రయత్నమేమీ చేయకుండా.. అదే రీతిలో తాను ఎన్నటికీ ఈ దేశానికి సేవచేసే బిడ్డగానే ఉంటానని ప్రకటించడం మోడీలోని అద్భుతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం.
ఇవి కూడా చదవండి :
షట్ సత్ గుణ సంపన్నుడు నరేంద్ర మోడీ
సైదాబాద్ కిరాతకుడు రాజుది పోలీసు హత్యేనా?
కష్టపడే స్వభావం, టెర్రరిజంపై రాజీ లేని పోరాటం, పాలనలో అధికారుల, రాజకీయనాయకుల అనవసర జోక్యాన్ని వీలైనంత మేరకు తగ్గించడం, పెట్టుబడులు పోత్సహించడం, మౌలిక సదుపాయాల కల్పన వంటివాటిపై దృష్టి పెట్టడం, పాలనకు కుటుంబాన్ని దూరంగా ఉంచడం, పాలనకు అవినీతి మరకలు లేకపోవడం వంటి ప్రత్యేకతలు నేడు మోడీ గారిని దేశంలోనే తిరుగులేని నేతగా నిలబెట్టాయి.
రాజకీయ ప్రత్యర్థులు కూడా వేలెత్తి చూపలేని నిష్కళంకమైన పరిపాలనను అందించడంలో ప్రధాని నరేంద్రమోడీ గారు తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. యావత్ భారతదేశాన్ని సంస్కరణల పర్వంతో అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడానికి ఆయన అహరహమూ శ్రమిస్తున్నారు. తన జీవితాన్ని పూర్తిగా భరతమాత పాదాల చెంత సమర్పించిన నరేంద్రమోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ప్రపంచంలోనే అజేయమైన శక్తిగా.. భవిష్యత్ భారత్ ఎంతటి సముత్కృష్టమైన ప్రగతి శిఖరంగానైనా ఆవిష్కృతం కావచ్చు గాక.. దిగంతాలను స్పృశించే మహాద్భుత స్వయం సమృద్ధిగల అభివృద్ధి సౌధంగా ఆవిర్భవించవచ్చు గాక.. కానీ.. ఆ శిఖరాల, ఆ సౌధాల పునాదుల్లో మాత్రం.. తన సంకల్ప బలంతో, చిత్తశుద్ధితో.. ఇవాళ్టి నరేంద్ర మోడీ శాశ్వతంగా ఉంటారు.
.. ఎం.ఎల్.ఎన్. మూర్తి
సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త
.

Discussion about this post