మానవత్వం మంట కలిసింది. పేగు బంధం మరిచారు. అభంశుభం తెలియని పురిటి బిడ్డను మురుగు కాలువ పక్కన చెత్త కుప్ప వద్ద వదిలేసి వెళ్లారు. అక్కడ ఎపుడు… ఎందుకు వదిలారో తెలియదు. చివరకు ఆ శిశువు శవంగా మారాడు. ఆ నోటా… ఈ నోటా పడి పోలీసుల వరకు సమాచారం వెళ్లింది. వారు అక్కడకు వెళ్లి పరిశీలించారు. మృత శిశువును మున్సిపాలిటీ వారికి అప్పగించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో బుధవారం వెలుగు చూసింది.
శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని కొండమిట్ట ప్రాంతంలో ఓ పాడు పడిన ఇంటి పక్కగా మురుగు కాలువ వెళుతోంది. కాలువ సమీపంలోనే చెత్త దిబ్బ కూడా ఉంది. ఈ దిబ్బ సమీపంలో మురుగు కాలువ పక్కనే గుర్తు తెలియని వ్యక్తులు ఓ మగ శిశువును వదలి పోయారు.
ఆ శిశువు పక్కనే ఓ గోనె సంచి.. తాటాకుల బుట్ట కూడా ఉంది. అక్కడ పరిస్థితిని బట్టి చూస్తే.. శిశువు జన్మించిన కొద్ది సేపటికే సంచిలో ఉంచి అక్కడ పడేసినట్లు తెలుస్తోంది. ఆ పరిసర ప్రాంతాల వారు చూసే లోపే ఆ శిశువు మృతి చెంది ఉన్నాడు.
కన్నవారు చంపి అక్కడ పడేశారా..? లేక చని పోయిన తరువాత అక్కడ పడేశారు తెలియడం లేదు. ఇలా ఎవరు చేశారో అంతు బట్టడం లేదు. ఈ మృత శిశువును చూసి.. స్థానికులు కొందరు శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. చుట్టు పక్కల విచారించారు.
ఆ ప్రాంత ప్రజలు తమకు తెలియదని చెప్పడంతో.. మృత శిశువును దహన సంస్కారాల కోసం పురపాలక శాఖ వారికి అప్పగించారు. ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుందో అనే దానిపై పోలీసులు అరా తీస్తున్నారు. కాగా ఈ సంఘటన శ్రీకాళహస్తిలో చర్చనీయాంశంగా మారింది.
.