విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలిక తీసే విధంగా పాఠశాలల్లో బోధన ఉండాలని శాసనమండలి సభ్యులు విఠపు బాలసుబ్రమ్మణ్యం అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్ పీబీఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విఠపు బాలసుబ్రహ్మణ్యం అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రతి సంవత్సరం ఇన్స్పైర్, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ తో పాటు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నవన్నారు. కరోనా అనంతరం ఈ ఏడాది జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన శ్రీకాళహస్తి ఆర్ పీబీఎస్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. తాను ఏర్పేడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివానన్నారు. నార్మన్ బోర్లో అనే వ్యక్తి తన నిజ జీవితంలో వాతావరణ, పంటలలో జరుగుతున్న మార్పులను గమనించి నూతన గోధుమ, వరి వంగడాలకు నాంది పలికి కోట్ల మంది ఆకలి తీర్చారన్నారు.
సైన్స్ బోధించడం విద్యార్థులకు హృదయానికి హత్తుకునేలా ఉండాలన్నారు. వారిలో ఒక ఆలోచన రేకిత్తించే విధంగా ఉండాలన్నారు. మూఢ నమ్మకాలు ఉండకుండా సైన్స్ సందేహాలను నివృత్తి చేసేలా ఉండాలన్నారు. విద్యా విధానంలో సైన్స్ బోధన పక్కాగా జరగాలన్నారు. భవిష్యత్తు శాస్త్రవేత్తలను తయారు చేసేలా ఉండాలన్నారు. ఈ సందర్భంగా పలు సందర్భాలు ఉదహరించి విద్యార్థులకు అవగాహన ఉత్తేజం కల్పించారు. అనంతరం కలెక్టరు వెంకట్రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వాటిలో అనేక పథకాలను నిబద్ధతగా అమలు చేస్తోందన్నారు. ఎంతో మంది విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి వారికి మంచి నాణ్యమైన రుచికరమైన పోషకాహారం అందిస్తోందన్నారు. ఉన్నత స్థాయిలో ఈ అంశంపై ప్రతి రెండు వారాలకు సమీక్షిస్తున్నారన్నారు.
రక్తహీనత ఉంటే చదువు మీద ఆసక్తి తగ్గుతుందన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి జగనన్న గోరుముద్ద పకడ్బందీగా అమలు చేసి చిక్కీ లు, రాగి జావ, ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ సక్రమంగా వినియోగించు కోవాలన్నారు. భవిష్యత్తులో ఏమైతారని విద్యార్థులను అడిగితే సామాన్యంగా ఐఏఎస్, ఐపీఎస్, ఇంజినీర్, టీచర్ ఇలా చెప్తారని, కానీ సైంటిస్ట్ అని చెప్పడం అరుదు అన్నారు.
సైంటిస్ట్ లు వివిధ రంగాలలో వినూత్నమైన వాటిని భవిష్యత్తు ప్రయోజనాలకు అందించే గొప్ప వారు అన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలన్నారు. యువ శాస్త్రవేత్తలను తయారు చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం అన్నారు. వచ్చే సంవత్సరం మరింత సృజనాత్మక పరిశోధనలను ప్రదర్శించేలా ఉండాలని ఆయన కోరుకున్నారు. గత డిసెంబర్ నెలలో 14, 15వ తేదీలలో మండల స్థాయిలో అన్ని పాఠశాలల నుంచి మండల స్థాయి ఎగ్జిబిట్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు.
5 సబ్ థీమ్స్ నుంచి ఎంపిక చేసిన వాటిని 34 మండలాల నుంచి మొత్తం170 ఎగ్జిబిట్లు ప్రస్తుత ప్రదర్శనలో ఉంచడం జరిగిందన్నారు. ఇవన్నీ కూడా సృజనాత్మకతతో విద్యార్థులు తమ గైడ్ టీచర్ సహాయంతో నూతన ఆవిష్కరణలకు నాంది పలికే విధంగా ప్రస్తుత మన జీవన శైలిలో వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నాయన్నారు. ఇక శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ… విద్యతోనే ఉన్నతమైన పదవులు పొందవచ్చన్నారు. విద్యతోనే ఏదైనా సాధ్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 6వేల కోట్లు పైగా ఖర్చు చేసి విద్యా వ్యవస్థకు మౌలిక వసతులు, ఆంగ్ల విద్యా బోధన, బైజూస్ ట్యాబ్ లు అందించి శ్రీమంతులకు అందుబాటులో ఉండే నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు కూడా అందుబాటులో కి తెచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో కేఎస్ రామారావు, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి. శేఖర్, ఉపవిద్యాశాఖాధికారి రఘురామయ్య, ఎంఈవో భువనేశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, జిల్లా సైన్సు అధికారి భాను ప్రసాద్, సైన్సు సమన్వయకర్తలు ధనుంజయ సారథి, కోదండపాణి లతో పాటు పలువురు మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయికి పది సైన్స్ ప్రదర్శనలు
శ్రీకాళహస్తి వేదికగా జరిగిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్ర స్థాయికి పది నమూనాలు ఎంపికయ్యాయి. కొన్ని ప్రదర్శనలు నిత్యం మనం ఉపయోగించి పడేసిన వాటితో ప్రాజెక్టులు తయారు చేయగా ఎకోఫ్రెండ్లీ మెటీరియల్స్ లో భాగంగా నీటిపై తేలియాడు వ్యర్థాలను శాస్త్రసాంకేతికతో తొలగించే విధానాన్ని గార్బేజ్ క్లీనింగ్ రోబోట్ అనే ప్రయోగ నమూనా సందర్శకులను బాగా ఆకర్షించింది. ఇందులోనే సోలార్ రూఫింగ్ ఆన్ తార్ రోడ్స్ అనే ప్రాజెక్టు,ఆటోమేటికి సర్వీసింగ్ రోబోట్, అటో సెలైన్ ఇండికేటర్, స్మార్ట్ హైజీన్ టాయిలెట్, మెదలైనవి వీక్షకులనుఅలరించాయి. విద్యార్థుల సొంత ఆలోచనలకు సైన్స్ ఉపాధ్యాయులు పదును పెట్టి అద్భుతమైన ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనను శ్రీకాళహస్తి పట్టణం లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సందర్శించారు.
రాష్ట్ర స్థాయి కి ఎంపికైన ప్రదర్శనలివే…
*మినరల్ వాటర్ క్యాన్ క్లీనింగ్ మిషన్.(జిల్లా పరిషత్ జిల్లా పాఠశాల తడుకు ఆర్.ఎస్. విద్యార్థి ప్రియాంక.గైడ్ టీచర్ గజరాజన్.
*ఎకో ఫ్రెండ్లీ కంటైనర్ పర్ సీడ్ లింక్ -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-ముచ్చివోలు- విద్యార్థి ధర్మతేజ, గైడ్ టీచర్ డాక్టర్ సుబ్రమణ్యం శర్మ
*హైజీన్ టాయిలెట్.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు -రేణిగుంట-విద్యార్థి యోగేంద్ర, గైడ్ టీచర్ మోహన్ బాబు,
*షోల్డర్ పెయిన్ రెడ్యూసర్.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -తడుకు ఆర్.ఎస్. విద్యార్థి పార్థు వర్మ, గైడ్ టీచర్ -భానుప్రసాద్.
*స్మార్ట్ బ్లైండ్ స్టిక్ . జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెట్టు, విద్యార్థి చక్రధర్, గైడ్ టీచర్ రవి.
*స్మార్ట్ డస్ట్ బిన్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -నారాయణవనం . విద్యార్థి జ్యోత్స్న.గైడ్ టీచర్ శ్యామలత.
*సిఓ2 క్యాప్చరింగ్ మిషన్.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -బి.ఎన్.కండ్రిగ.విద్యార్థి పుష్కల్. గైడ్ టీచర్ గౌరి.
*ఎఫెక్టివ్ గ్లోబల్ వార్మి. ఎపి.టి.డబ్యు.ఆర్.ఎస్.వెంకటగిరి. విద్యార్థి భార్గవి. గైడ్ టీచర్ షకీనా.
*క్లీనో మీటర్ విత్ లేజర్ లైట్.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెల్లూరు.విద్యార్థి హారిక.గైడ్ టీచర్ రమేష్.
*త్రీడి హాలో గ్రామ్ . జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్.ఆర్.ఎస్.జి.హెచ్ . విద్యార్థి గౌతమ్.గైడ్ టీచర్ లత. కాగా ఈనెల 28వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలలో వీరు పాల్గొంటారు.
.