ఆంధ్రపదేశ్ ను బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పోర్డ్ స్వచ్చంధ సంస్థ డైరెక్టరు జల్లా లలితమ్మ కోరారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం క్రై, ప్రగతి, పోర్డ్ స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని బాల్య వివాహాల నిర్మూలన చేయాలని కోరుతూ రాష్ట్ర స్థాయి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జల్లా లలితమ్మ మాట్లాడుతూ… బాల్య విహహాల్లో దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు. తాజా గణాంకాల ప్రకారం ఏపీలో 29శాతం బాల్య విహహాలు జరుగుతున్నాయన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బాలికల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోందన్నారు. ఏపీలో ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది పురుషులకు 934మంది మాత్రమే మహిళలు ఉన్నారన్నారు. తమిళనాడు ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు.
తమిళనాడులో ప్రతి వెయ్యి మంది పురుషులకు 838మంది మహిళలు మాత్రమే ఉన్నారని తాజా గణంకాలు చెబుతున్నాయన్నారు. ఈ గణాంకాలు చూస్తే సమాజంలో మహిళలు ఎంత వివక్షకు గురవుతున్నారో అర్థమవుతోందన్నారు. ఈ పరిస్థితులు మారకపోతే భవిష్యత్తు అంధకారంగా మారడం ఖాయమని జల్లా లలితమ్మ అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయని తాజా నివేదికలు చెబుతున్నాయన్నారు. ఆడపిల్లలు లేకపోతే సమాజంలో మనుగడే ఉండదన్నారు.
ఈ వివక్ష కారణంగా భవిష్యత్తు ప్రమాదకరంగా మారునుందని ఆమె తెలిపారు. పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లేమి కారణంగా చదువుకునే వయసులో ఆడపిల్లలు చంకన బిడ్డ నెత్తుకుని తిరుగుతున్నారన్నారు. ఇలాంటి వారు బాల్యం పూర్తిగా కోల్పోతున్నారని జల్లా లలితమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య వివాహాల కారణంగా చిన్నవయసులోనే పిల్లలు కలిగి… బాలికలు రక్తహీనత బారిన పడుతున్నారన్నారు. అతిచిన్నవయసులోనే బాలికలకు వివాహం చేయడం వలన క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడి చాలా మంది అర్థంతరంగా మృత్యువాత పడుతున్నారని ఆమె తెలిపారు. సమాజంలో వివక్ష కారణంగా ఆడపిల్లలను ఎదగనివ్వడం లేదని… వారిని చదువుకోనివ్వడం లేదని… వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని జల్లా లలితమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మూఢ నమ్మకాలు, మూఢాచారాలు, కులతత్వం కూడా మహిళల పాలిట శాపంగా మారుతున్నాయన్నారు.
ప్రస్తుత సమాజంలో మహిళలకు పూర్తిగా భద్రత కరువైందన్నారు. మహిళలు ఎదగాలంటే సమాజంలో మౌళిక మార్పు రావాలని జల్లా లలితమ్మ అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలు సులభంగా చదువుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ విద్యపై దృష్టి కేంద్రీకరించాలని ఆమె కోరుకున్నారు. నేటి పిల్లలే రేపటి దేశ సంపద అని జల్లా లలితమ్మ అన్నారు. పాఠశాలల్లో చారిత్రక అంశాలతో పాటు సామాజిక విద్య బోధించాల్సిన అవసరం ఉందన్నారు.
విలువలు గల విద్య నేర్పినపుడే విద్యార్థులు మంచి పౌరులుగా తయారవుతారని ఆమె అభిప్రాయ పడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి జీవ నైపుణ్యాలు కూడా నేర్పాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య వివాహాలు నిర్మూలించాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో ఓ ప్రత్యేక అధికారిని నియయమించాలని జల్లా లలితమ్మ డిమాండు చేశారు. అంతకు మునుపు ప్రగతి స్వచ్చంధ సంస్థ డైరెక్టరు కేవీ రమణ మాట్లాడుతూ… గిరిజన కాలనీల్లో నేటికీ 80శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయన్నారు. ఈ బాల్య వివాహాలు గిరిజనుల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం తమ సంస్థ 2004వ సంవత్సరం నుంచి పని చేస్తోందన్నారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే శివ పార్వతుల కల్యాణం రోజున గతంలో వందల సంఖ్యలో బాల్య వివాహాలు జరిగేవన్నారు.
ఈ సమస్యపై ఛైల్డ్ రైట్స్ అండ్ యూ స్వచ్చంథ సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందన్నారు. అదేవిధంగా మానవ హక్కుల కమిషనుకు ఫిర్యాదు చేయడంతో ఆ కమిషను ఛైర్మన్ జస్టిస్ సుభాష్ రెడ్డి ఇక్కడకు విచారణకు వచ్చారన్నారు. ఆ ఆ తరువాత అధికార యంత్రాంగం, స్వచ్చంధ సంస్థలు, పత్రికలు కారణంగా శివ పార్వతుల కల్యాణం రోజున శ్రీకాళహస్తిలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. గత ఏడాది నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాల్లో కనీసం ఒక్క బాల్య వివాహం కూడా జరగలేదన్నారు.
ఈ నేపథ్యంలోనే బాల్య వివాహాల నిర్మూలనకు శ్రీకాళహస్తిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా క్రై, ప్రగతి, పోర్డ్ స్వచ్చంధ సంస్థలు పని చేయాలనే ఆశయంతో ఇక్కడ సమావేశం నిర్వహించి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు. బాలల హక్కుల సంరక్షణ, బాల్య వివాహాల నిర్మూలనపై ‘క్రై’ స్వచ్చంధ సంస్థ దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో పని చేస్తోందన్నారు. ఆ సంస్థతో కలసి తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల పరిధిలో తాము పని చేస్తున్నట్లు కేవీరమణ తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అనంతరం బాల్య వివాహాలు చేసుకుని ఇబ్బందులు పడుతున్న శైలజ, షేక్ సారా అఫ్రీన్, పవిత్రతో పాటు మరికొందరు తమ సమస్యలు మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్రై, పోర్డ్, ప్రగతి స్వచ్చంధ సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.
.