తిరుపతి సమీపంలో ఉన్న వకుళ మాత ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చుట్టు ప్రక్కల గ్రామస్తులను అవమాన పరిచారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. పాతకాల్వ పంచాయతీ పరిధిలో ఉన్న ఆలయ కార్యక్రమానికి ఆ గ్రామ సర్పంచిని పిలవక పోవడం ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధం అన్నారు.
కాగా పురాతనమైన ఆ ఆలయంపై పాతకాల్వతో పాటు పేరూరు, మల్లవరం గ్రామాల ప్రజలకు హక్కు ఉందని చెప్పారు. కాబట్టి మూడు గ్రామాల సర్పంచులను, ఇద్దరు ఎంపీటీసీలను ఆహ్వానించి శిలా ఫలకంపై వారి పేర్లు వేయడం ధర్మం అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆలయ జీర్నోద్ధరణకు స్వంత నిధులు ఖర్చు చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
అయితే నిబంధనలు మేరకు దాతలు ఆలయాల నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం టిటిడి కి జమచేయాలని తెలిపారు. టిటిడి తన డిజెన్ తో నిర్మాణం చేసి, దాతకు సౌకర్యాలు కల్పిచడం ఆనవాయితీ అన్నారు. అందుకు భిన్నంగా వకుళ మాత ఆలయం నిర్మాణం లో ఎక్కడ టిటిడి అజమాయిషీ లేక పోవటం తప్పని విమర్శించారు
అమ్మ ఆలయం పేరూరు బండ (గుట్ట) పైన, పాతకాల్వ , పేరూరు , మల్లవరం గ్రామాల రెవిన్యూ సరిహద్దు లో ఉందని తెలిపారు.
ఆలయాన్ని ప్రారంభించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి వస్తే అయా గ్రామస్తులకు సంతోషం కలగాలి కానీ తీవ్రంగా అవమానం ఎదురు కావడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమం దరిదాపుల్లోకి ప్రజలను రానివ్వక పోవడం అవమానం కాక మరేమిటని అన్నారు. కార్యక్రమానికి పరిమితి ఉన్నదని అనుకుంటే, పదుల సంఖ్యలో పెద్దిరెడ్డి అనుచరులు , బంధువులను మాత్రమే ఎందుకు అనుమతించారని నిలదీశారు.
మూడు గ్రామాల సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు తెలుగుదేశం వారు కాదని వైసీపీ పేరు మీద గెలిచిన వారేనని చెప్పారు. పెద్దిరెడ్డి కుటుంబ కార్యక్రమం లాగా సాగిన దీనికి టిటిడి లక్షల రూపాయల నిధులు ఖర్చు చేయడం ఎంత వరకు న్యాయమో చెప్పాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు రావడం వల్ల సీఎం ప్రజల్లో చులకన కాక తప్పదన్నారు.
ఇదే పాతకాల్వలో జగన్ పై ఈగ వాలనివ్వని పురుషోత్తమ రెడ్డి ఉన్నారని తెలిపారు.
దేశం గురించి , రాష్ట్రం గురించి, రాయలసీమ కు జరుగుతున్న అన్యాయం గురించి నీతులు చెప్పే మేధావి తన గ్రామస్తులకు జరిగిన అన్యాయం గురించి ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. పోనీ తనకన్నా ఆహ్వానం అందిందో లేదో పురుషోత్తం రెడ్డి తెలపాలని కోరారు. వైసిపిని ప్రేమించే వారు ఒక విషయం అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. తాము జగన్ ను ప్రేమిస్తున్నారు కానీ జగన్ తమను ప్రేమించడం లేదని గ్రహించాలని సూచించారు.
వెలకట్టలేని వారి ప్రేమను జగన్ వాడుకుంటున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే వారికి, రాష్ట్రానికి అంత మంచిదని సుధాకర్ రెడ్డి హితవు పలికారు.

.

Discussion about this post