ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి.. తన పాదయాత్రలో మూడువేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. ఇందుకు ఆయనకు అభినందనలు చెప్పాలి. మూడువేల కిలోమీటర్లు ఏకబిగిన నడవడం అనేది మామూలు సంగతి కాదు. భిన్నవాతావరణాల్ని తట్టుకుంటూ ఆయన ఆ ఫీట్ సాధించారు. ఆ నడక అసమానమైనది.. కానీ, ప్రజా సంకల్పయాత్ర పేరుతో సాగుతున్న ఆయన యాత్ర … సరైన దిశలోనే ఉన్నదా? అనేది అనుమానం.
ఈ పాదయాత్రను జగన్ చేపట్టడం వెనుక అసలు లక్ష్యం ఏమిటి? ప్రజల సమస్యలను తాను దగ్గరినుంచి తెలుసుకుంటానని.. వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానని జగన్ పాదయాత్రకు ముందు మాట ఇచ్చారు. అయితే ఆయన ఇప్పటిదాకా ప్రకటిస్తున్న హామీల్లో.. పాదయాత్ర వలన, ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యల గురించి, వాటి పరిష్కారం గురించి గానీ కనిపిస్తున్న అంశాలు చాలా తక్కువనే చెప్పాలి.
పాదయాత్ర ప్రారంభించడానికి మునుపే.. తాను తయారు చేసిపెట్టుకున్న వరుస హామీలను, ఆచరణ సాధ్యమేనా? అని అబ్బురపరిచే వరాలను అమ్ముల పొదిలో దాచుకుని.. ఒక్కొక్కటి ప్రజల మీదకు సంధిస్తూ జగన్ సాగిపోతున్నారే తప్ప.. ఆయన వాస్తవంలో బతుకుతున్నారా? ఈ యాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యల గురించి, యాత్ర వలన తెలుసుకోగలిగే వాటి మూలాలను గురించి.. వాటి పరిష్కారం గురించి మాట్లాడుతున్నారా….? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.
Discussion about this post