‘‘జగన్ ఓ గజనీ. ఆడియ మాట తప్పడం ఆయన నైజం. రాష్ట్రంలో ఆయన తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ అరాచాకాలు సృష్టిస్తున్నాడు. యువగళం పాదయాత్ర ఆపితే… దండయాత్ర చేస్తాం. జగన్ పాలనలో ప్రజలు ఎవరూ ప్రశాంతంగా లేరు. ధరల బాదుడుతో బతకలేని పరిస్థితి. అందుకే ఆంధప్రదేశ్ లో సైకో పోవాలి. సైకిల్ పాలన రావాలని’’ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర 22వ రోజైన శుక్రవారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. తొట్టంబేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ లక్ష్మీపురం వద్దకు ఉదయం 9.15గంటలకు నారా లోకేష్ చేరుకున్నారు. అక్కడ నారా లోకేష్ కు వందలాది మంది టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
లక్ష్మీపురం, కొత్తకండ్రిగ, శివనాథపురం మీదుగా పాదయాత్ర రాజీవ్ నగర్ చేరుకుంది. అక్కడ నారా లోకేష్ టిడ్కో ఇళ్లను పరిశీలించారు. అనంతరం రామచంద్రాపురం చేరుకుని సభలో ప్రసంగించారు. శ్రీకాళహస్తి నియోజకకవర్గం ప్రజలు వందలాదిగా తరలి వచ్చి తనకు ఘన స్వాగతం పలకడంతో తనలో కొత్త ఉత్తేజం, ఉత్సాహం వచ్చిందన్నారు. యువగళంకు ప్రజల నుంచి వచ్చే స్పందన చూసి జగన్ కు జ్వరమొస్తోందన్నారు. యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి జగన్ పోలీసులను ఉసిగొల్పుతున్నాడని నారా లోకేష్ ఆరోపించారు. అందులో భాగంగానే యువగళం పాదయాత్ర చుట్టూ వెయ్యి మంది వరకు పోలీసులను మొహరించారన్నారు. జగన్ అనే గజనీ ఆయన తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని… అయితే తాను డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని నమ్మానని… తన గొంతు ఎవరూ నొక్క లేరన్నారు.
యువగళం పాదయాత్ర ఆపితే దండయాత్ర చేస్తామని ఆయన హెచ్చరించారు. జగన్ తన పాదయాత్ర సందర్భంగా 25మంది పార్లమెంటు సభ్యులను ఇస్తే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పారని… అయితే ప్రస్తుతం లోక్ సభ రాజ్యసభల్లో 31మంది వైసీపీ ఎంపీలు ఉన్నప్పటికీ ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడటం లేదని నారా లోకేష్ ప్రశ్నించారు. జగన్ తన సీబీఐ కేసుల మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ను తాకట్టు పెట్టారన్నారు. అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఆ తరువాత మాట తప్పారన్నారు. 2014ఎన్నికలకు మునుపు అమరావతి రాజధాని అని చెప్పిన జగన్… అధికారంలోకి వచ్చాక తన స్వార్థ ప్రమోజనాల కోసం మూడు ముక్కలాట ఆడుతున్నారన్నారు. రాజధాని విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో మాట చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు.
కడపలో ఉక్కు పరిశ్రముకు భూమి పూజ చేసి 20వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మొదట చెప్పారని… ఇటీవల రెండవ సారి భూమిపూజ చేసి 6వేల మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ మాట మార్చారన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతి యేటా జనవరిలో జాబ్ క్యాలెండరు ఇస్తామని చెప్పిన జగన్ దాని ఊసే ఎత్తడం లేదన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీయస్సీ నిర్వహిస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్ ఆ మాట ఎపుడో మరచి పోయాడన్నారు. అమ్మఒడి ఇంటిలో అందరికీ ఇస్తామని చెప్పి… ఇపుడే ఒక్కరికి మాత్రమే పరిమితం చేశారన్నారు. ఈ పథకం పొందడానికి సవాలక్ష నిబంధనలు పెట్టారన్నారు. 45ఏళ్లు నిండిన ప్రతి మహిళకు పింఛను ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ వివిధ రకాల నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. జగన్ కు పబ్లిసిటీ పీక్ అని… ఆచరణలోకి వచ్చే సరికి అది నిల్ అన్నారు. ఉద్యోగ కల్పనలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దర్శిలో ఇటీవల కిరణ్ కుమార్ అనే యువకుడు ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకోవడమే ఇందుకు నిలువెత్తు సాక్ష్యమన్నారు. యువతకు ఉద్యోగాలు లేక చాలా మంది పెడదోవ పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లెలో ఇటీవల గంజాయి మత్తుతో ఓ యువకుడు అంగవైకల్యం గల బాలికను హత్య చేయడం తనను కలచి వేసిందన్నారు.
ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ సంఘటన జరిగిందన్నారు. విశాఖ కేజీహెచ్ లో శిశువు చనిపోతే ఇంటికి తీసుకెళ్లడానికి పేద తల్లిదండ్రులకు అంబులెన్స్ సమకూర్చలేని దుస్థితిలో జగన్ సర్కారు ఉందన్నారు. అంబులెన్సు లేక పోవడంతో మృత శిశువును ద్విచక్ర వాహనంలో 120 కి.మీ. దూరం తీసుకుపోవాల్సి వచ్చిందన్నారు. ఇది సర్కారు వైఫల్యమేనని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఇక రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పకునే జగన్ హంద్రీ-నీవా ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
కర్ణాటకలో నిర్మిస్తున్న అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టుతో రాబోయే కాలంలో రాయలసీయ ఎడారిగా మారడం ఖాయమన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కారు స్పందించక పోవడం బాధాకరమన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదన్నారు. తాను ఎంతో శ్రమించి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి తీసుకొచ్చిన రిలయన్స్ పరిశ్రమను తరిమేశాడన్నారు. జగన్ వేధింపులతో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమరరాజా పరిశ్రమ కూడా తెలంగాణకు తరలి పోయిందన్నారు. వరదలతో అన్నమయ్య ప్రాజెక్టు తెగి పోయి 62మంది చని పోతే వారికి పరిహారం చెల్లించలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్, బస్సు ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు అన్నీ పెంచేశారన్నారు.
చెత్త పన్నుతో సహా వివిధ రకాల పన్నులు వేస్తున్నారని… చివరకు మనం పీల్చే గాలికి కూడా జగన్ సర్కారు పన్ను వేస్తుందేమోనని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ సైకో పాలన సాగనంపి… వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి అమరనాధరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, బొజ్జల బృందమ్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, తొట్టంబేడు మండల అధ్యక్షులు గాలి మురళీనాయుడు, పులివర్తి నాని, మలిశెట్టి వెంకటేశ్వర్లు, బీద రవిచంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
.
Discussion about this post