మొన్నటికి మొన్న తెలంగాణ హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉప ఎన్నికలో ఓటుకు పదివేల రూపాయల వంతున పంచిపెట్టినట్టుగా వార్తలు విన్నాం. నిజానిజాలు పైవాడికెరుక.. నిప్పులేనిదే పొగ రాదన్నట్టుగా.. పదివేలు పంచారని వినిపించిందంటే.. కనీసం ఏడెనిమిదివేలైనా పంచే ఉంటారు కద!
అదంటే ఎమ్మెల్యే ఎన్నిక.. ఆ స్థాయి ‘రిటర్న్స్’ గురించి ఒక భరోసా ఉంటుంది గనుక.. అభ్యర్థులు పోటాపోటీగా పెట్టారని అనుకోవచ్చు. కానీ.. ఒక సాధారణ మునిసిపాలిటీ ఎన్నికలో ఓటుకు వేలం పాట ఎంత వరకూ వెళ్లే చాన్సుంది!
కుప్పంలో వేలం పాట ఆకాశాన్ని అంటుతోంది. మొన్నమొన్నటి వరకు ఆరువేల వరకు సాగిన పాట ఇప్పుడు పదివేలు దాటుతోందని సమాచారం.
కుప్పం మునిసిపాలిటీని వైఎస్సార్ కాంగ్రెస్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అదే సమయంలో తెలుగుదేశానికి ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. గత ఎన్నికల సమయానికే 17 వేల మెజారిటీ కోల్పోయిన చంద్రబాబు.. అమీతుమీ తేల్చుకోవాలనుకున్నారు. లోకేష్ పోలింగ్ కు ముందు ఊర్లోనే తిష్ఠవేసి ఎన్నికల ప్రచారంతో పాటూ డబ్బు పంపకాలను కూడా పర్యవేక్షించే బాధ్యత తీసుకున్నాడు. వైసీపీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నీ తానే అయి నడిపిస్తున్నారు.
ఒక్కో ఓటుకు అథమపక్షం 1500 రూపాయలు ఇవ్వాలనే దగ్గర పార్టీల కసరత్తు ప్రారంభమైనట్లు సమాచారం. అక్కడినుంచి పోటాపోటీగా పెంచుకుంటూ పోయి ఓటుకు ఆరువేల రూపాయల దాకా తీసుకువచ్చారు. అయితే.. ఇది పదివేల దాకా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.
వైఎస్సార్ సీపీ తరఫున స్థానిక నేత సుధీర్ భారీగా నిధులు వెచ్చించడానికి పూనుకున్నారు. నిధులు ఏమాత్రం అదనంగా అవసరం అయినా.. డబ్బుల బాధ్యత మొత్తం పెద్దిరెడ్డి చూస్తున్నారు. మొత్తానికి కుప్పం మునిసిపాలిటీ మొత్తం డబ్బు వరదలా పారుతోంది.
Discussion about this post