జగన్ కు ధైర్యముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలని తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ డిమాండు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సుమారు మూడేళ్ల పాటు ఒక దొంగల ముఠా ఏపీని దోచుకుందని… ఇంకా రెండేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకోవడానికి రెండో దొంగల ముఠాకు మంత్రి పదవులు అప్పగిస్తున్నారని నరసింహయాదవ్ ఆరోపించారు. వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందినంతా దోచుకు తింటున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తన స్థాయిని మరచి మాట్లాడటం బాధాకరమన్నారు. ఇన్ని రోజులు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాంటి భాష మాట్లాడే వారని… ఇపుడు ముఖ్యమంత్రే అలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు.
ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత సహించలేక జగన్ ఇలా దిగజారి మాట్లాడుతున్నరన్నారు. రాబోయే కాలంలో ప్రజలే తగు బుద్ది చెబుతారన్నారు. ఎన్నికలు ఎపుడు పెట్టినా తెలుగుదేశం సిద్ధంగా ఉంటుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ధరలు విపరీతంగా పెరిగి పోయి.. పేద, మధ్య తరగతి ప్రజల బతుకు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
అసలే ధరల బాదుడుతో అల్లాడి జనానికి పన్నుల రూపంలో మరో భారం జగన్ ప్రభుత్వం మోపుతోందన్నారు. ఓటీఎప్ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడిన ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు వాటిని రిజిస్ట్రేషన్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ప్రజలను దోచుకోవడమే పనిగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. విద్యుత్ ఛార్జ్జీలు పెంచి వినియోగదారులపై మరింత భారం మోపిందన్నారు.
విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా… మరోవైపు పవర్ హాలిడే ప్రకటించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. పవర్ హాలిడే వలన పరిశ్రమలు చాలా నష్ట పోవాల్సి వస్తుందన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజల్లోకి వెళతామని నరసింహ యాదవ్ చెప్పారు. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడానికి ప్రజలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు విజయకుమార్, దశరథారాచారి, రెడ్డివారి గురవారెడ్డి, ప్రకాశ్ నాయుడు, చక్రాల ఉష, మిన్నల రవి, షాకీరాలీ, సుబ్బయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు.
.